మా గ్రామం తలకొండపల్లి. వెయ్యి పైచిలుకు జనాభా ఉండేది. ఇప్పుడు రెండున్నర వేల పైమాటే. తలకొండపల్లి మహబూబు నగరు జిల్లా కలువకుర్తి తాలూకాలో చేరినది. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో మా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏదీలేదు. మా నాయనగారు నాకు, మా తమ్ముడు రామచంద్రరావుకు విద్యాభ్యాసం కోసం ఒక బడిపంతులును నియమించారు.
ఆరంభంలో లక్ష్మారాజు మా బడి పంతులు. వారి తర్వాత మహ్మదు హుసేన్ వచ్చారు. తెలుగులో ఉన్న గొలుసువ్రాత జాబులు, ఆంధ్రమహాభాగవతం చదవటం, పెద్ద ఎరుసులు (లెక్కలు/ గుణకారాలు) చేయటం, బాగా పొంకంగా వ్రాయటం వస్తే తెలుగు మాధ్యమిక విద్య పూర్తి చేసినట్టు భావించేవారు. మా తెలుగు చదువు కూడా ఇంతవరకే సాగేది.
గ్రామంలోని మరికొందరు పిల్లలు మాతోపాటు చదివేవారు. మేము ఉదయం సుమారు నాలుగున్నర గంటల వరకు బడికి వెళ్లేది. భూపాలాలు మొదలగు ప్రార్థనలతో ఆరంభమై కా గుణింతంతో ఉదయం పాఠాలు ముగించుకొని ఎనిమిది గంటలకంతా ఇళ్లకు చేరేవాళ్లం. ఆ కాలంలో టీ, కాఫీలు పుచ్చుకొనేవారుకారు. రాత్రిపూట మిగిలిన అన్నం, ఇంత ఊరగాయ, మజ్జిగ కలుపుకొని తినేవాళ్లం. మళ్లీ పది గంటల లోపల బడికి వెళ్లి మధ్యాహ్నం వరకు చిన్న యెరుసులు, పెద్ద యెరుసులు కంఠతా పట్టేవాళ్లం.
భోజనానంతరం రాత్రి ఎనిమిది గంటల వరకు పాఠాలు జరిగేవి. అష్టమినాడు ఒక పూటే బడి. పౌర్ణమి, అమావాస్యలకు పూర్తి సెలవులు ఉండేవి. ఇప్పటిలా కాదు, ఆ కాలంలో పంతుళ్లంటే విద్యార్థులంతా గజగజ వణికేవారు. సరిగా చదువకపోయినా, క్రమశిక్షణకు విరుద్ధంగా నడచినా ‘కుర్చీ’ కూర్చుండబెట్టడం మామూలు. పంతులు వద్ద ‘తవుకు’ అని ఒక పొడవు కొరడా లాంటిది ఉండేది. దారి తప్పిన విద్యార్థులకు ఆ
‘తవుకు’తో దెబ్బలు పడేవి. అన్నిటికి మించిన శిక్ష ‘కోదండం’. పాఠశాల కప్పుకు ఒక తాడు కట్టబడి ఉండేది. తప్పుచేసిన విద్యార్థికి ‘కోదండం’ విధించేవారు. విద్యార్థి ఆ తాడు పట్టుకుని వేలాడాలి. ఉపాధ్యాయుడు ఏ శిక్ష విధించినా తల్లిదండ్రులు నిరోధించే వారుకాదు. విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించేవారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రేమించేవారు.
– మందుముల నరసింగరావు ఆత్మకథ ‘50 సంవత్సరాల హైదరాబాదు’ నుంచి