గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం. వినూత్న ఆలోచనలు రేకెత్తించే.. సహజ మానసిక ఉల్లాసాన్ని పంచే దివ్యౌషధం. కానీ, సాంకేతిక విప్లవంతో గ్రంథాలయం నిర్వచనమే మారిపోతున్నది. పోటీ పరీక్షల కదనరంగమైపోతున్నది. ఉద్యోగార్థులకే పరిమితమై కుంచించుకుపోతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ ఉపాధ్యాయుడు దీక్ష పూనాడు. గ్రంథాలయాన్ని సబ్బండ వర్గాల చెంతకు చేర్చాలని నడుంబిగించాడు. మొక్కవోని దీక్షతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్న ఆయన పేరు డాక్టర్ చేగోని రవికుమార్. రామన్నపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథపాలకుడు. ఈ పుస్తకాల కాపరి అనుభవాలివి..
నల్గొండ జిల్లా నకిరేకల్కు చెందిన చేగోని మల్సూర్, సాయమ్మ దంపతుల కొడుకు రవికుమార్. సామాన్య రైతు కుటుంబం. తండ్రి మల్సూర్ వామపక్ష ఉద్యమాలతో మమేకమయ్యాడు. ఏ రోజుకారోజు వార్తలను తెలుసుకునేందుకు ఉత్సుకత చూపేవాడు. దినపత్రిక చదివి ఆ విశేషాలను చెప్పాలని కొడుకులను పురిగొల్పేవాడు. అలా తండ్రి ప్రోత్సాహంతో రోజూ గ్రంథాలయానికి వెళ్లి పేపర్లన్నీ చదివేవాడు రవికుమార్. ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకొని, తండ్రికి వినిపించేవాడు. అలా బాల్యం నుంచే గ్రంథాలయానికి వెళ్లడం, దినపత్రికలు, పుస్తకాలు చదవడం అతని జీవితంలో భాగమయ్యాయి. ఇంట్లో కన్నా గ్రంథాలయంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు.
ఆ మక్కువతోనే డిగ్రీ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లైబ్రరీ సైన్స్ను 2001లో పూర్తి చేశారు. అక్కడే ఎంఎల్ఐఎస్సీ, ఎంఫిల్, పీహెచ్డీ కూడా పూర్తిచేశారు. చదువు కొనసాగిస్తూనే మరోవైపు పేరొందిన ప్రైవేట్ వైద్యశాలకు చెందిన లైబ్రరీ ఇన్చార్జీగానూ దాదాపు ఎనిమిదేండ్లు పనిచేశారు. 2011లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లెక్చరర్గా మెదక్ జిల్లా మిరుదొడ్డి జూనియర్ కాలేజీలో చేరారు. అక్కడి నుంచి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ప్రభుత్వ సిటీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులను నిర్వర్తిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా లైబ్రరీలతోనే రవికుమార్ జీవితం కొనసాగుతున్నది. ఇప్పుడు పదుల సంఖ్యలో లైబ్రరీ సైన్స్ విభాగంలో పీహెచ్డీ విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచారు.
విద్యార్థి విజ్ఞానం పెరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. విజ్ఞానం అందించేవి పుస్తకాలు. ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండే ఆలయం గ్రంథాలయం. అలాంటి పుస్తకాలయాల పరిరక్షణకు నడుం బిగించారు రవికుమార్. ఆ లక్ష్యంతో తన గురువు ప్రొఫెసర్ లక్ష్మణ్రావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 2011లో తెలంగాణ గ్రంథాలయ సంఘాన్ని నెలకొల్పారు. వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ గ్రంథాలయాల పరిరక్షణకు పరిశోధకుడిగానూ మారారు. తెలంగాణ గ్రంథాలయాల చరిత్రను వెలికితీశారు. తన పరిశోధనలు ఇంకా కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో కనుమరుగవుతున్న పురాతన గ్రంథాలయాల అన్వేషణ చేపట్టి వాటిని వెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఖమ్మంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం 1896లో ఆంధ్ర విజ్ఞాన నికేతనమనీ, అదే జిల్లాలోని నేలకొండపల్లిలో ప్రస్తుత పౌర గ్రంథాలయం.. భక్తరామదాసు పుస్తకాలయమనీ నిరూపించారు. ఈ క్రమంలో పురాతన గ్రంథాలయాల పరిశోధన కమిటీ సభ్యుడిగా ఎంపికయ్యారు.
ప్రతి ఊరికీ ఒక గ్రంథాలయం ఉండాలన్న తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి ఆశయాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో ‘గ్రంథాలయాలను రక్షించండి’ అనే నినాదంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు రవికుమార్. దీనికోసం తన నెల వేతనంలో 10 శాతం వెచ్చిస్తున్నారు. పురాతన గ్రంథాలయాల పునరుద్ధరణకు, నూతన లైబ్రరీల స్థాపనకు పాటుపడుతున్నారు. సొంత నిధులతోనేకాదు దాతలు, స్థానికుల సహకారంతో మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తెలంగాణ గ్రంథాలయం సంఘం ఆధ్వర్యంలో యాభై వరకు గ్రంధాలయాలను పునరుద్ధరించారు. పుస్తక పఠనంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో అడపాదడపా సదస్సులు ఏర్పాటుచేస్తున్నారు.
గ్రంథాలయాల పరిరక్షణే కాదు, వాటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు రవికుమార్. లైబ్రరీలపై అవగాహన కల్పించేందుకు, చరవాణులకే అంకితమైన నేటి యువతను గ్రంథాలయాలవైపు ఆకర్షించే ప్రయత్నంలో పదుల సంఖ్యలో పుస్తకాలను రాశారు. ఆయన రాసిన వ్యాసాలు ప్రముఖ దినపత్రికల్లోనే కాదు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో, జర్నల్స్లో కూడా ప్రచురితం కావడం విశేషం. ఆ రచనలను పుస్తకరూపంలో ముద్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన గ్రంథాలయాలు, పౌర గ్రంథాలయాలు, పుస్తకాలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, మెడికల్ గ్రంథాలయాలు వంటి పుస్తకాలను ముద్రించారు. ‘మన తెలంగాణ గ్రంథాయాలు’, ‘తెలంగాణ గ్రంథాలయాలు’ పుస్తకాలు రచించారు. ఇందులో రాష్ట్రంలోని ప్రముఖ పుస్తకాలయాల చరిత్రను నిక్షిప్తం చేశారు. రవికుమార్ చేస్తున్న కృషికి ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ- గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థలు ‘విద్యా సేవా రత్న’ అవార్డుతో సత్కరించాయి. అనేక స్వచ్ఛంద సంస్థలు రవికుమార్ విశేష సేవలను గుర్తించి సన్మానించాయి. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2022 సంవత్సరానికి గానూ గ్రంథాలయ సమాచార విజ్ఞానంలో ‘కీర్తి’ పురస్కారం అందుకున్నారు.
“గ్రంథాలయాలు సామాన్య ప్రజల విశ్వవిద్యాలయాలు అంటారు సంఘ సంసరణ ఉద్యమకారులు. భారత స్వతంత్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం వంటి చారిత్రక పోరాటాలకు వ్యూహ రచనలు గ్రంథాలయాల్లోనే పురుడుపోసుకున్నాయి. సమాజ పురోభివృద్ధి దిశగా ప్రధాన ప్రేరణను కలిగించే లైబ్రరీలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతీ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్నదే నా లక్ష్యం. విద్యార్థుల్లో పుస్తక పఠనం పెరిగితే విజ్ఞానవంతమైన యువతరాన్ని దేశానికి అందించగలుగుతాం. ఆ ఆకాంక్షతోనే నా ప్రయాణం కొనసాగుతున్నది.”
– మ్యాకం రవికుమార్