యాంటీ బయాటిక్స్ ఓ విప్లవం. ఎందుకు పోతున్నాయో తెలియని ప్రాణాలను నిలబెట్టిన సంజీవని. వాడకం మొదలై నూరేండ్లు కూడా గడవలేదు. అంతలోనే వాటి వినియోగంపై అనుమానాలు మొదలయ్యాయి. విచ్చలవిడి సిఫార్సులు, మోతాదుకు మించిన వినియోగంతో… వాటిని తట్టుకోగలిగే సూక్ష్మజీవులు తయారయ్యాయి. మందులకు లొంగని ఈ సూక్ష్మ జీవుల వల్ల ఏటా ఏడు లక్షలమంది చనిపోతున్నారని అంచనా. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగిపోతుందనే భయమూ ఉంది. ఇంగ్లండ్కు చెందిన శాస్త్రవేత్తలు దీనికో విరుగుడు కనిపెట్టామని చెబుతున్నారు. కంప్యూటర్ విశ్లేషణ ఆధారంగా, ప్రస్తుతం ఉన్న యాంటీ బయాటిక్స్లో ఎలాంటి మార్పులు చేయాలో నిర్ధారించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న యాంటీ బయాటిక్స్ కంటే ఇవి 56 రెట్లు బలంగా పనిచేస్తాయని అంటున్నారు. ఏ మందుల మిశ్రమం, ఏ పరిస్థితుల్లో, ఎంత మోతాదులో అందించాలో కంప్యూటర్ విశ్లేషణతో తేల్చేయవచ్చని చెబుతున్నారు.