అదో చిన్న పల్లె. ఇక్కడ ఆచారాలు, నియమనిష్ఠల పట్టింపులు ఎక్కువే. అక్కడి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్న అఖండ జ్యోతిపై గ్రామస్తులకు ఏర్పడిన నమ్మకమే ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్నది. 200 ఏండ్లుగా అఖండంగా వెలుగుతూ తమకు విజయాల వెలుగుల్ని ప్రసాదిస్తున్నదీ ‘ఆరని దీపం’ అంటున్నారు ఆ గ్రామస్తులు. ఆ దీపపు ప్రత్యేకత, ఊరు విశేషాలు తెలియాలంటే వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం మున్ననూరు గ్రామం గురించి చదవాల్సిందే.
మున్ననూరు.. పూర్వం గోపాల్పేట సంస్థానంలో ఉండేది. యుద్ధంలో విజయానికి చిహ్నంగా నాటి బొబ్బిలి రాజవంశీయులు దాదాపు 200 ఏండ్ల కిందట ఇక్కడి వీరాంజనేయ స్వామి ఆలయంలో వెలిగించిన దీపం నేటికీ అఖండంగా వెలుగుతున్నది. గోపాల్పేట సంస్థానానికి వెళ్లే దారిలో మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం వనపర్తికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో 450 ఇండ్లు ఉండగా.. వ్యవసాయమే వీరి ప్రధాన జీవనాధారం.
బొబ్బిలి వంశ రాజులు శత్రువులపై యుద్ధానికి వెళ్లేటప్పుడు గోపాల్పేట సంస్థానం మద్దతు కూడగట్టుకుంటూ మున్ననూరు ద్వారా రాకపోకలు సాగించేవారట. సంస్థాన అధిపతి రాణీ రంగనాయకమ్మ వద్దకు యుద్ధ సమయంలో తరచూ వచ్చివెళ్లేవారట. గ్రామంలోని ఆలయంలో ఏకశిలా విగ్రహ రూపంలో ఉన్న శ్రీవీరాంజనేయస్వామికి పూజలు చేసేవారట. యుద్ధంలో గెలిచినప్పుడల్లా బొబ్బిలి వంశీయులు ఈ జ్యోతిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించేవారని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అలా ప్రజ్వలనకు నోచుకున్న ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయంలో నిరంతరాయంగా దీపం వెలిగించడం ఇబ్బందిగా మారిన నేపథ్యంలో అవసరమైన తైలం, వత్తులు, ఇతర పూజా సామగ్రిని తమ ఖర్చులతో కొనుగోలు చేసే బాధ్యతను గోపాల్పేట సంస్థానాధిపతి రాణి రంగనాయకమ్మకు అప్పగించారట బొబ్బిలి రాజులు. రాజరిక వ్యవస్థ అంతరించినా, తరాలు మారుతున్నా అఖండ జ్యోతి ప్రజ్వలనను కొనసాగిస్తున్నామని చెబుతున్నారీ గ్రామస్తులు.
మున్ననూరు వీరాంజనేయ ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో జ్యోతి అఖండంగా వెలుగుతున్నది. నిరంతరం వెలగడానికి ఆముదం నూనెను వినియోగిస్తున్నారు. ప్రతి నెలా ఐదు లీటర్ల నూనె అవసరమవుతుండటంతో గ్రామస్తుల సహకారంతో రూ.60 వేల నిధిని ఏర్పాటు చేశారు. ఈ డబ్బుతో వచ్చే ఆదాయంతో నెలకు సరిపడా నూనెను సమకూర్చుతున్నారు. 1999లో ఆలయ పునఃనిర్మాణం చేపట్టినప్పటికీ జ్యోతి అఖండంగా వెలిగేలా గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు.
ఇక్కడి ఆలయంలోని దీపం దర్శించుకుని వెళితే తాము తలుచుకున్న కార్యం ఏదైనా విజయంతో తిరిగి వస్తామనే నమ్మకం గ్రామస్తుల్లో ఉంది. గోపాల్పేటతోపాటు వనపర్తి సంస్థానాధీశులు సైతం ఈ ఆలయంలో జ్యోతిని దర్శించుకొని వెళ్లేవారని గ్రామంలోని వృద్ధులు చెప్తారు. శుభకార్యాలు, ప్రత్యేక పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ అఖండ జ్యోతిని దర్శించుకొని, వీరాంజనేయుడికి దణ్ణం పెట్టుకొని వెళ్తుండటం ఇప్పటికీ చూడొచ్చు. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ఆలయంలో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
మా వీరాంజనేయ గుడిలోని జ్యోతి నిరంతరం వెలుగుతూ మా గ్రామానికి రక్షణగా ఉంటున్నది. ఎలాంటి అలజడులకు తావు ఉండదు. గ్రామమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నికలప్పుడే హడావుడి నెలకొంటుంది. నిరంతర దీపారాధన గ్రామస్తులను ఐక్యంగా ఉంచుతున్నది. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని కొత్త తరానికి కూడా అందిస్తాం.