తెలంగాణ నేల ఎనిమిది శతాబ్దాల క్రితమే కొండలను సైతం పిండి చేయగల గండర గండలకు నిలయమైంది. రాజుల రక్షణకోసం తమ ప్రాణాలనుకూడా పణంగా పెట్టిన వీరులను కన్నది. బాహుబలి, భల్లాలదేవులకు తాతల్లాంటి యోధులను పెంచి పోషించింది. ఇప్పటికీ పలు ఆలయాల ప్రాకారాలపై ఆ వీరుల చరిత్ర దర్శనమిస్తున్నది, స్ఫూర్తిని రగిలిస్తున్నది.
మన దేశంలో మల్లయుద్ధం ప్రాచీనమైన ఆట. చారిత్రక ప్రాధాన్యమున్న క్రీడల్లో ప్రముఖమైందికూడా. పురాణాలు, ఇతిహాసాల కాలాల్లోనూ కుస్తీకి సంబంధించిన ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. మహాభారతంలో భీముడికి, జరాసంధుడికీ మధ్య జరిగిన మల్లయుద్ధం ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. ‘రెజ్లింగ్’ పేరుతో నేడు అంతర్జాతీయ క్రీడగా వెలుగొందుతున్నా, దాదాపు ఎనిమిది శతాబ్దాల క్రితమే మల్లయుద్ధానికి తెలంగాణ ప్రాంతంలో ఎంతో ఆదరణ ఉండేది. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనమైన రామప్ప ఆలయంలోని పలు శిల్పాలు ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. రామప్ప గుడికి ప్రధాన ఆకర్షణ అయిన ప్రదక్షిణ పీఠాన్ని ఆనుకొని ఉన్న ఆలయ కుడ్యస్తంభాలమీద పలు యుద్ధవీరుల శిల్పాలు దర్శనమిస్తున్నాయి. వివిధ దేవతలు, జైన, వీరశైవ సిద్ధులు, తీర్థంకరులు, డాలూ-కత్తి పట్టిన యోధులు, నాట్యగణపతి, చామరధారి, విల్లు, బాణం ధరించిన వేటగత్తె, భటులు, భైరవుడు, గణిక, వేణుగోపాల, సాలభంజిక (కొమ్మను పట్టుకొని వయ్యారంగా నిలబడ్డ స్త్రీ), అటూ ఇటూ మద్దెల వాయిస్తున్న వాద్యకారులు, నాగిని, సూర్య, శృంగార మైథున శిల్పాలు, నగ్నంగా వున్న ఋషి పుంగవులు, శివభక్తులు, నాట్యగత్తెలు తదితర మూర్తులూ ఇక్కడ ఉన్నాయి. దేనికదే విలక్షణ హావభావాలతో సందర్శకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఈ శిల్పాల్లో చెక్కిన వస్ర్తాలు, ఆభరణాలు, భంగిమలు, ఆనాటి పడతుల కళాభిరుచిని, శిల్పుల నైపుణ్యాన్నీ చాటి చెబుతున్నాయి. ఈ శిల్పాలన్నీ అప్పటి సాంస్కృతిక స్థితిని, అప్పటి ప్రజల అభిరుచులను తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాలు. వీటన్నిటిలో వివిధ మల్లయుద్ధ భంగిమల్లో ఉన్న వీరుల శిల్పాలు ఎంతో ప్రత్యేకం. కిందనున్న వ్యక్తిని కదలకుండా తన కాళ్లతో పట్టి ఉంచి, పైకి లేవకుండా బలప్రయోగం చేస్తున్నట్లున్న మల్లుడి శిల్పం, ఆ పక్కనే క్రీడాకారులను వారిస్తున్న తీర్పరి శిల్పం కనిపిస్తాయి. కాకతీయుల కాలంనాటికే మల్లయుద్ధం విస్తృతంగా వ్యాప్తిలో ఉండేదనడానికి ఈ శిల్పాలే నిదర్శనం. అప్పట్లో రాజ్య రక్షణ, తమ వ్యక్తిగత భద్రతకోసం రాజులు ప్రత్యేకంగా కుస్తీవీరులను పెంచి పోషించేవారు. రాజ్యంలో ఇలాంటి మల్లయోధులకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. సైనికుల దైనందిన కార్యకమాల్లో కుస్తీకూడా ఒకటిగా ఉండేది. తమ దేహదారుఢ్యాన్ని మరింత పెంచుకోవడానికి సైనికులు ఉదయాన్నే కుస్తీపట్లు పట్టేవారు. కృష్ణదేవరాయలు కూడా కుస్తీ ప్రియుడేనని విదేశీ యాత్రికుల రచనల వల్ల తెలుస్తున్నది. ఓ పట్టుపట్టడానికి ముందు, గిన్నెలకొద్దీ నువ్వుల నూనె తాగేవారట.
వీరే కీలకం
ఒక రాజ్యంలోని మల్లయోధుల సంఖ్యను, వారు సాధించిన విజయాలనుబట్టే ఆ రాజ్య సంపదనూ, కీర్తినీ నిర్ణయించే ఆనవాయితీ అప్పట్లో ఉండేది. రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగే సమయంలో, ప్రాణనష్టం నివారించ డానికి ఇరు దేశాల వీరులమధ్య మల్లయుద్ధం నిర్వహించి, గెలిచినవారికి పీఠం స్వాధీన పరిచిన ఉదంతాలెన్నో ఉన్నాయి. అమేయ భుజబల సంపన్నుడైన బాహుబలి, తన సోదరుడైన భరతుడితో మల్లయుద్ధం చేసి విజయం సాధించాడని జైన సాహిత్యం ద్వారా తెలుస్తున్నది.
గ్రంథాల్లోనూ..
పల్నాటి వీరచరిత్రలోని కాటమరాజు కథలో జెట్టీల ప్రసక్తి ఉంది. జెట్టీలు అంటే మల్లయోధులే. తిక్కన తన మహాభారత ‘విరాటపర్వం’లోనూ ఆంధ్రదేశంలో మధ్యయుగ కాలంలో ఉపతాయి, తోరహత్తము, ఒత్తొరువు, జలికి బట్టుట.. మొదలైన మల్లయుద్ధ విధానాలు వ్యాప్తిలో ఉన్నట్లు వర్ణించాడు. ప్రస్తుతం మల్లయుద్ధాలకు సంబంధించిన ప్రత్యేకమైన నియమావళిలో జరాసంధి, జాంబువంతి, భీమసేని, హనుమంతిలాంటి పేర్లతో అనేక రీతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. పురుషుల మల్లయుద్ధాన్ని ‘రెజ్లింగ్’ అని, మహిళల మల్లయుద్ధాన్ని ‘గాఫ్లింగ్’ అనీ వ్యవహరిస్తున్నారు. ప్రొఫెషనల్ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్) రాకతో ప్రస్తుతం ఇదొక క్రీడగా మారింది. సంప్రదాయ నియమాలను మార్చకుండా, కొద్దిపాటి మార్పులు చేసి మల్లయుద్ధాన్ని ప్రొఫెషనల్ క్రీడగారూపొందించారు.
అరవింద్ ఆర్య
7997 270 270