సర్పో రక్షతి రక్షితః… అన్నది ఆ ఇద్దరి నినాదం. ‘మీ ఇంట్లోకి వచ్చిన పాములను మేం కాపాడుతాం. బదులుగా మొక్కలను నాటి వాటిని రక్షించండి. పాములకు భయపడకండి. వాటిని మేం జాగ్రత్తగా పట్టుకుంటాం. అవి పర్యావరణాన్ని కాపాడుతాయి. మీరూ మొక్కలు పెంచడం ద్వారా ప్రకృతిని కాపాడండి’ అంటూ పరిసర గ్రామాల ప్రజలకు హితవుచెబుతున్నారు. ఆ సర్ప ప్రేమికులలో ఒకరు.. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర అధ్యాపకులు సదాశివయ్య. మరొకరు.. వనపర్తిలోహోం గార్డుగా పనిచేస్తున్న కృష్ణ సాగర్.
సదాశివయ్య.. ఓసారి అడవిలో ప్రయాణిస్తున్నాడు. హఠాత్తుగా పైనుంచి పాము మీద పడింది. అంతే, భయంతో వణికిపోయాడు. దాన్ని చంపేశాడు. ఆ తర్వాత, చాలా పశ్చాత్తాప పడ్డాడు. ఆ చేదు అనుభవం ఆయన ఆలోచనలలో మార్పు తెచ్చింది. ఇప్పటి వరకూ సుమారు 5 వేల పాములను కాపాడి అడవిలో వదిలాడు. అసోసియేషన్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ (ఏబీసీడీ) పేరిట ఓ సంస్థను స్థాపించి జీవ వైవిధ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు. గత ఏడాది సీఎం కేసీఆర్ పిలిపించి, ఆయన వృక్ష సేవను ప్రశంసించారు. సదాశివయ్య పనిచేస్తున్న కాలేజీకి నిధులు మంజూరు చేశారు. ఏబీసీడీ ద్వారా పాములను కాపాడటమే కాదు, పాముల వల్ల ప్రజలకు ప్రమాదం వాటిల్లకుండా చూస్తున్నాడు సదాశివయ్య. సర్పజాతులతో మనకు లాభమే కాని, నష్టం లేదన్న విషయాన్ని విద్యార్థులకు వివరించేందుకు ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో 692 అవగాహన తరగతులు ఏర్పాటు చేశాడు. పాములు ఎక్కువగా సంచరించే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలల్లో అనేక సదస్సులు జరిపాడు.
ఆ ఖర్చులన్నీ సొంతంగానే భరిస్తున్నాడు. ‘పాములను చంపొద్దు… మనమూ చావొద్దు’ అని పిలుపునిస్తున్నాడు. పాముల వల్ల పర్యావరణానికి, ముఖ్యంగా రైతులకు కలిగే లాభాలను వివరిస్తున్నాడు. పాములే లేకుంటే ఎలుకల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. రైతు పంటలు పండించుకునే పరిస్థితే లేకుండా పోతుంది. పాములకు మనిషి ఆహారం కానేకాదనీ… అవి ఉద్దేశ పూర్వకంగా మనకు హాని చేయవనీ… తమను తాము రక్షించుకునేందుకే కాటు వేస్తాయని సదాశివయ్య చెబుతున్నాడు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాము కాటు వల్ల ఏటా సుమారు 600 మంది చనిపోతున్నారని తమ సర్వేలో తేలినట్లు సదాశివయ్య తెలిపాడు. తెలంగాణలో ఉన్న 39 రకాల పాముల్లో ఏడు మాత్రమే విషపూరితమైనని చెబుతాడు. పాము కాటేసినప్పుడు, మంత్రాలను నమ్ముకో కుండా, సాధ్యమైనంత త్వరగా సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళితే సరిపోతుందని సూచిస్తున్నాడు.
‘స్నేక్’ గార్డ్..
వనపర్తికి చెందిన కృష్ణ సాగర్ ట్రాఫిక్ విభాగంలో 15 ఏండ్లుగా హోంగార్డుగా చేస్తున్నాడు. ఎనిమిదేండ్ల క్రితం, ఓసారి పొలం దగ్గర అతడిని పాము కరిచింది. వెంటనే దాన్ని చంపి, తనతో పాటు దవాఖానకు తీసుకెళ్లాడు. వైద్యులు ఆ పాము విషపూరితమైందని పొరబడి, యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్ ఇచ్చారు. అయితే, ఆ పాము విషం లేనిది కావడంతో కృష్ణకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ అనుభవంతో అతడిలో పాముల పట్ల ఆసక్తి పెరిగింది. ‘విషం ఉన్నవేవి? లేనివేవి?’ అనే అంశాన్ని గుర్తించే ప్రయత్నం చేశాడు. అనేక పుస్తకాలు చదివాడు. టీవీ చానెళ్లు, యూట్యూబ్ ద్వారా అవగాహన పెంచుకున్నాడు. ఆ ప్రయత్నంలో పాముల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను గుర్తించాడు. పర్యావరణంలో మనతో పాటు సకల జీవజాలానికీ స్థానం ఉండాలని అర్థం చేసుకొన్నాడు. పాముల రక్షణ కోసం ‘సాగర్ స్నేక్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. అందులో 37 మంది సభ్యులున్నారు. వీళ్లంతా, పరిసరాల్లో పాము ఉందని
ఎవరైనా సమాచారం అందిస్తే చాలు, తక్షణం చేరుకుని చాకచక్యంగా పట్టుకుంటారు.
తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలేస్తారు. ప్లాస్టిక్ నిర్మూలన కోసం కూడా సాగర్ సొసైటీ పనిచేస్తున్నది. పాముల వల్ల ప్రయోజనాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు కృష్ణసాగర్ నేతృత్వంలోని సొసైటీ సభ్యులు. పామును పట్టుకున్నందుకు వీళ్లు ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. ‘పామును పట్టుకుని మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. కానీ, ఈ సాయానికి గుర్తుగా ఓ ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించండి చాలు’ అని మాత్రం కోరుతారు. ఇప్పటివరకు 4400 పాములు, ఎనిమిది మొసళ్లు, అరవై కుందేళ్లు, పందొమ్మిది నెమళ్లు, ఇరవైమూడు కొండ చిలువలు, వివిధ రకాల పక్షులు.. పట్టుకుని సురక్షితంగా అడవుల్లో
వదిలారు.
–పెద్ది విజయభాస్కర్ , మహబూబ్నగర్