1947 అక్టోబర్ 2 గాంధీజీ చివరి పుట్టినరోజు. ఆశ్రమంలోని వారంతా ఒక్కొక్కరే వచ్చి ఆయనకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుని వెళుతున్నారు. అంతలో ‘బాపూ.. ఇవ్వాళ మీ పుట్టినరోజు. మీరు మా నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి.. మీరు ఇస్తున్నారు.. ఇదేం తిరకాసు?’ అంది ఓ ఇరవై ఏళ్ల యువతి ఆశ్చర్యం నటిస్తూ. ‘మీరంతా కలిసి నన్ను ‘మహాత్మ పీఠం’ ఎక్కించారుగా.. అందుకే ఇలా..’ అన్నారు బాపు చమత్కారంగా. అంత చిన్న వయసులో ధైర్యంగా బాపూపై చెణుకు విసిరిన ఆ యువతి మనూబెన్! తల్లిని కోల్పోయాక మను కస్తూర్బా గాంధీకి సహాయకురాలిగా వచ్చారు. కస్తూర్బా ఆమెను మాతృవాత్సల్యంతో చేరదీశారు. అప్పటికి ఆమె వయసు సుమారు పదిహేనేళ్లు. కస్తూర్బా మరణానంతరం ఆమె బాపూజీ దగ్గరికి చేరారు. అప్పటినుంచి బాపు అమరులయ్యేవరకు ఓ ఐదేళ్లపాటు ఆయన ఆంతరంగిక సహాయకురాలిగా పనిచేశారు. ‘ఈ ఆశ్రమంలో అందరికీ తండ్రిని.. నీకు మాత్రమే తల్లిని’ అని గాంధీజీ ఆమెతో అనేవారు. అప్పట్లో బాపూ ఆనతి మేరకు మను నిత్యం డైరీ రాసేవారు. అది చదివితే స్వతంత్రం వచ్చిన తొలిరోజుల్లో బాపూ అనుభవించిన మానసిక వేదన వెల్లడవుతుంది. అప్పటివరకు అన్నదమ్ముల్లా ఉన్న భారతీయులు మతాల పేరుతో మారణహోమం సాగించటం ఆయనకు జీవితం మీద విరక్తి కలిగించింది. వాళ్లు మారాలి.. లేదా తాను చావాలి అనుకునేవారు. శాంతి స్థాపనకు ప్రాణాలకు తెగించి హింసాత్మక ప్రదేశాలకు కాలినడకన వెళ్లారు కనీసం చెప్పులు కూడా లేకుండా. ఆయా సందర్భాలలో మను ఆయన వెంటే ఉన్నారు. ప్రతికూల పరిస్థితులు చవిచూశారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర సంగతులు ఈ పుస్తకంలో ఉన్నాయి. మను రాసిన ‘బాపు- మై మదర్’ పుస్తకాన్ని ‘నేను చూసిన బాపు’ పేరుతో అనువదించారు డా.కాళ్లకూరి శైలజ. సరళమైన శైలిలో సాగే ఈ పుస్తకం ఆసాంతం వదలకుండా చదివిస్తుంది. ఇది కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ, హైదరాబాద్ వారి ప్రచురణ.
రచన: మను బెన్ గాంధీ, అనువాదం:
డా. కాళ్లకూరి శైలజ; పేజీలు: 100
వెల: 100/-
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్,
ఫోన్: 040- 24652387, విజ్ఞాన ప్రచురణలు, నెల్లూరు ఫోన్: 94405 03061
చంద్రప్రతాప్ కంతేటి,
80081 43507