ఏదైనా సాధించాలంటే పరుగులు పెట్టాల్సిన పన్లేదు. ప్రతిభ ఉంటే చాలు. ఉన్నచోటే కలను సాకారం చేసుకోవచ్చు. గ్రామీణ జీవితాలు నేపథ్యంగా టైలర్ శ్రీనివాస్ గీసిన చిత్రాలు పరోక్షంగా ఆ మాటే చెబుతున్నాయి. ఐరోపా ఖండంలో ఆవిర్భవించిన ఆధునిక చిత్రకళా దృక్పథాన్ని అందిపుచ్చుకోవాలని గొప్ప గొప్ప చిత్రకారులంతా ఆరాటపడ్డారు. ఆ తపనతో ఐరోపా దాకా వెళ్లిన వారూ ఉన్నారు. ఆధునిక చిత్రకళకు ఆద్యుడైన పికాసో ఇదంతా చూసి నవ్వాడట.
‘ చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుంటే సంతోషిస్తాం. అనుకరిస్తే బాధపడతాం. మీ జీవితాలు మీవి. మీకూ ఓ సంస్కృతి ఉంది. చరిత్ర ఉంది. వాటిని అనుకరించండి’ అంటూ దారి చూపాడట. అదే దారిలో నడిచిన ఎంతోమంది చిత్రకారులు, సంప్రదాయ భారతీయ చిత్రకళను ఆధునికత వైపు నడిపించారు. ఆ దారిలో ఎంతో దూరం ప్రయాణించారు కూడా. కానీ, ఏ ప్రయాణమూ లేకుండా పల్లె ఆత్మలోని కళాత్మకతను పట్టుకున్నాడు టైలర్ శ్రీనివాస్.
ఇంటర్మీడియట్ చదువుతూనే ఊళ్లోనే సైన్ బోర్డులు రాస్తూ కెరీర్ మొదలుపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఎఫ్ఏలో సీటు రావడంతో సిటీకి వచ్చాడు. శని, ఆదివారాల్లో ఉపాధి కోసం సైన్ బోర్డులు రాసేవాడు. కాలేజీ అసైన్మెంట్స్లో భాగంగా ఊరి జనాల స్కెచ్లు గీశాడు. పచ్చని పంట పొలాలు, సబ్బండ కులాల జీవితాలు ఆవిష్కరించాడు. హెచ్సీయూలో ఎంఎఫ్ఏ పూర్తి చేసినా పట్నం పోకడకు దగ్గర కావాలని ఆరాటపడలేదు. పల్లెపట్టునే ఉంటూ గ్రామీణ జీవితాన్ని క్యాన్వాస్పై ఆవిష్కరించాడు. సొంతూరు టేక్మల్ (మెదక్ జిల్లా)లో స్టూడియో నడుపుతున్నాడు. ఆ ఊరి జీవితాలే గీస్తూ తన ప్రత్యేకతను నిలుపుకొంటున్నాడు.