అదృష్టం ఎప్పుడు, ఎవర్ని, ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. సిరి తావచ్చిన వచ్చును.. అన్నట్టు, తలుపు తట్టిన అవకాశాన్ని ఠక్కున అందిపుచ్చుకోవాలి. మనమేమిటో నిరూపించుకోవాలి. ఆ పనే చేసింది మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసి.. వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. చూస్తుంటే, ఇక్కడే తిష్టవేసేలా ఉంది ఉత్తరాది మీనాక్షి. ఆ సార్థక నామధేయురాలి ముచ్చట్లు..
మోడలింగ్తో, సినిమాలతో బిజీ అయినా చదువులను పక్కన పెట్టలేదు మీనాక్షి. ప్రస్తుతం, పంజాబ్లోని నేషనల్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతున్నది. ఆటల్లో చురుగ్గా ఉంటున్నది. స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొంటున్నది.
సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత విశేషాలను, సినిమా సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది మీనాక్షి. మిస్ ఇండియా అయిన నాటినుంచీ ఆమెను అనుసరించేవారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
ఇటీవల, సుశాంత్ హీరోగా వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ, మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షూటింగ్ దశలోనే మరో రెండు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.
‘మిస్ ఇండియా’ ఫైనల్ రౌండ్లో ‘జీవితంలో ఏది గొప్ప పాఠం? విజయమా, అపజయమా?’ అని న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు, ‘జీవితంలో ఎన్నో అపజయాలను ఎదుర్కొన్నాను. విజయం ఇచ్చే ఆనందం కంటే, అపజయం నేర్పే పాఠమే విలువైంది. నా వరకు అపజయమే గొప్ప గురువు’ అని మీనాక్షి చెప్పిన సమాధానం అందరినీ అబ్బురపరిచింది.
హర్యానాకు చెందిన మీనాక్షి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్-2018’లో ఫస్ట్ రన్నరప్గా నిలిచింది. అదే ఏడాది ‘ఫెమినా మిస్ ఇండియా’గా ఎంపికైంది. మోడలింగ్ను కెరీర్గా మలుచుకొని వీడియో ఆల్బమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. 2019లో హాట్ స్టార్లో వచ్చిన ‘ఔట్ ఆఫ్ లవ్’
వెబ్ సిరీస్ ద్వారా నటిగా మారింది. మాస్ మహారాజ్ రవితేజ పక్కన ‘ఖిలాడీ’లో చాన్స్ కొట్టేసిన ఈ చిన్నది, అడివి శేష్తో ‘హిట్-2’లోనూ నటిస్తున్నది. ఈ రెండు సినిమాలూ ఘన విజయం సాధిస్తే టాలీవుడ్లో మీనాక్షి స్థిరపడిపోవడం ఖాయమని సినీ జనాల అంచనా.