చదువంటే పాఠ్యాంశాలు మాత్రమే కాదు. విద్య సమాజ చైతన్యానికి సంబంధించింది. జ్ఞానాన్ని పంచే, విజ్ఞానాన్ని పెంచే ప్రతి అక్షరమూ చదువే. జీవితాన్ని నేర్పే, స్ఫూర్తిని నింపే ప్రతి పుస్తకమూ చదువే. ఆ ఉత్తమోత్తమ సంస్కృతిని సమాజానికి పరిచయం చేస్తున్నది.. మోత్కూరు గ్రంథాలయం.
యాదాద్రి జిల్లాలోని మోత్కూరు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమ కేంద్రంగా నిలిచింది. ఆ స్ఫూర్తి ఇక్కడి ప్రజల్లో ఇంకా కనిపిస్తున్నది. అందుకు సాక్ష్యం స్థానిక గ్రంథాలయమే. మోత్కూరు గ్రంథాలయం 1986లో ప్రారంభమైంది. చైతన్య స్ఫూర్తిని రగిలించే ఎన్నో పుస్తకాలకు ఇది చిరునామా. తమ గ్రంథాలయం సేవల్ని మరింత విస్తృతం చేయాలని గ్రామస్థులు సంకల్పించారు. అందులో భాగంగానే ఓ ‘అభివృద్ధి కమిటీ’ని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచీ ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ లైబ్రరీని భాష, సంస్కృతి, చరిత్ర పరిరక్షణకు మూలకేంద్రంగా తీర్చిదిద్దారు. బాధ్యతగా సాహితీ వేత్తలు, ఉద్యమ నేతల జయంతులు, వర్ధంతులు జరుపుతున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాల సందర్భంగా భాషా పరిరక్షణకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇంటికో పుస్తకం
గ్రంథాలయం బతకాలంటే ముందు పుస్తకం పట్ల ప్రేమ మొలకెత్తాలి. అందుకే, జనంలో అక్షరాభిమానం కలిగించడానికి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది అభివృద్ధి కమిటీ. ఇప్పటి
వరకు మోత్కూరు గ్రంథాలయానికి 79 మంది పుస్తకదానం చేశారు. దాదాపు తొమ్మిది వేల పుస్తకాలు దాతల నుంచి వచ్చినవే. ప్రతి ఒక్కరికీ పుస్తకంతో, గ్రంథాలయంతో అనుబంధం ఉండాలనే ఉద్దేశంతో ‘ఇంటికో పుస్తకం-గ్రంథాలయ భాగస్వామ్యం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దళితవాడ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది. ‘పుస్తకం ఇస్తాం, తీసుకోండి’ అని ప్రజలే ముందుకొస్తున్నారు.
పాదయాత్ర
ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు పాదయాత్రలు చేయడం పరిపాటే. కానీ, మోత్కూరులో చేపట్టే పాదయాత్రకు ఒక ప్రత్యేకత ఉంది. గ్రంథాలయం కోసం ఇక్కడ ఏటా నవంబర్ 1న, వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి సందర్భంగా పాదయాత్ర నిర్వహిస్తారు. ప్రజలే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేపడతారు. గ్రంథాలయ సంస్కృతికి మోత్కూరును ఓ చిరునామాగా మార్చేందుకు కమిటీ కృషి చేస్తున్నది. మోత్కూరు గ్రంథాలయ విశిష్టత గురించి తెలియజేసేందుకు హైదరాబాద్, భువనగిరి, ఆలేరు, రామన్నపేట, సిరిపురం, దత్తప్పగూడెం, నల్లగొండ ప్రాంతాల కవులు, రచయితలు, మేధావులు, విద్యావంతులను దీంట్లో భాగస్వామ్యం చేస్తున్నారు.
కేసీఆర్ స్ఫూర్తితో..
ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకొని పుస్తకంతో ప్రతి ఒక్కరూ అనుబంధం ఏర్పరచుకునేలా కృషిచేస్తున్నామని అభివృద్ధి కమిటీ చెబుతున్నది. చదువు విజ్ఞానాన్ని ఇస్తే, పుస్తకం జీవితాన్నే ఇస్తుందనే నినాదంతో పదివేల పుస్తకాలను సేకరించారు. ‘ప్రతి ఇంటి నుంచీ గ్రంథాలయానికి ఒక పుస్తకం చేరాలి, ప్రతి పౌరుడూ గ్రంథాలయంలో భాగస్వామ్యం కావాలి’ అనే సంకల్పంతో నవంబర్ 14 నుంచి గ్రంథాలయ సభ్యత్వ నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ బాధ్యతగా గ్రామస్థులంతా కలిసి గ్రంథాలయ సభ్యత్వాలు నమోదు చేయించడం గర్వించదగ్గ విషయం. పుస్తకానికి మంచిరోజులు వచ్చినట్టే.