Lightyear 0 | పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. కాలుష్యం తగ్గడంతో పాటు నిర్వహణ ఖర్చు తగ్గనున్నది. ఈవీ వాహనాలను సైతం ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు బ్యాటరీలను చార్జ్ చేస్తేనే నడుస్తుండగా.. త్వరలో ఇకపై ఇలాంటి అవసరం లేకుండానే సోలార్ ఆధారంగా నడిచే వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా తొలి అడుగుపడింది. నెదర్లాండ్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అయిన లైట్ ఈయర్.. ‘లైట్ ఈయర్ 0’ (Lightyear 0) సేరిట సరికొత్త కారును లాంచ్ చేసింది. సూర్యుడి నుంచి వెలువడే కాంతితో నేరుగా కారులో ఉన్న లిథియం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఇందు కోసం కారుపై భాగంలో సోలార్ ప్యానెళ్లను సైతం ఏర్పాటు చేశారు.
వీటితో ఓ వైపు కారు నడుస్తున్న సమయంలోనే.. బ్యాటరీ చార్జ్ అవుతుంది. కారులో ఉన్న బ్యాటరీ ఒక్కసారి ఫుల్ చార్జ్ అయితే.. ఏకంగా 625 కిలోమీటర్ల దూరం ప్రయాణించొచ్చని కంపెనీ ప్రకటించింది. ఇందులో సోలార్ ప్యానెళ్లతో పాటు ప్లగ్ ద్వారా సైతం బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. మరో వైపు కారులో నావిగేషన్, ఎంటర్నైట్మెంట్ కోసం ప్రత్యేకంగా 10 ఇంచుల టచ్ స్క్రీన్ను ఏర్పాటు చేశారు. అయితే, కారు ధర రూ.2కోట్లకుపైగా ఉండనుండగా.. ఈ ఏడాది చివరి వారంలో ప్రీ ఆర్డర్లు ప్రారంభంకానున్నాయి. రోజుకు సగటున 35 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఏడు నెలల వరకు నడుస్తుందని, నెదర్లాండ్స్ వంటి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే దేశాల్లో మూడు నెలల వరకు నడుస్తుందని పేర్కొంటున్నారు.