జరిగిన కథ : ద్వీపరాజ్య రాకుమారుడు జాయప.. అనుమకొండ చేరి దాదాపు రెండేళ్లు కావస్తున్నది. ఒకనాడు మహాసేనాని మల్యాల చౌండ నగరికి వెళ్లాడు. మాటల మధ్యలో తన తల్లి కొంచెం నలతగా ఉన్నారనీ, తనను తలచుకుంటూ దుఃఖితులవుతున్నారనీ తెలుసుకున్నాడు. బాధతో నగరి నుంచి బయటికి వచ్చేశాడు. తల్లి రూపాన్ని తలచుకొంటూ.. మౌనంగా రోదిస్తూ, ఎక్కడెక్కడో తిరిగాడు. అదే సమయంలో మహా స్థపతి
జక్కనాచార్యులను అనుమకొండకు ఆహ్వానించాడు కాకతీయ చక్రవర్తి.
చక్రవర్తి ఆహ్వానంపై స్థపతి జక్కనాచార్యులు అనుమకొండకు వచ్చారు. రాజ్యంలోని స్థపతులు, సూత్రధారులు, వద్దంకులు.. మొదలైన సమస్త శిల్పపరివారం వెంటరాగా.. మహారాజు అధిరోహించే మహామత్తగజంపై ఆయన్ని కూర్చుండబెట్టి, ఊరేగింపుగా రాచనగరికి తోడ్కొని వెళ్తున్నాడు కాకతీయ ఆస్థాన స్థపతి కానోజు.
బాజా భజంత్రీలు ముందు పోతుండగా స్థపతులు లాంటి పెద్దలు గజానికి అటూ ఇటూ నడుస్తున్నారు. మిగిలిన పరివారం వెనక సాగుతున్నది. పురవాసులు దారి తప్పుకొంటూ ఆ మహా స్థపతికి కైవారాలు చేస్తుండగా, దారి పక్కన ఓ బండపై దుఃఖిస్తూ కూర్చున్న జాయప.. కళ్లు తుడుచుకుని తలెత్తి కుతూహలంగా చూశాడు.
ఎదురుగా మహా మత్తగజం. అతనికి చిన్ననాటి నుంచి అత్యంత సాన్నిహిత్యం ఏనుగులతోనే. స్నేహితుడితో తన మనసులో బాధ చెప్పుకొన్నట్లు.. చిన్నగా కూజితం చేశాడు. అప్పుడు జరిగిందొక అద్భుత సన్నివేశం..
బాజా భజంత్రీల వాళ్లు ముందుకు కదిలారు గానీ.. మత్తగజం హఠాత్తుగా ఆగిపోయింది. తల తిప్పి.. ఏడుస్తున్న జాయపను చూసింది. గట్టిగా ఘీంకరించింది. అప్పుడే అందరూ చూశారు. మహామత్తగజం మళ్లీ ఘీంకరించింది. అది చెప్పినమాట ఏదో అర్థమైనట్లు కళ్లు తుడుచుకుని ఆ మత్తగజం దగ్గరికి వెళ్లాడు జాయప. గురువు నాగంభట్టు చెప్పిన సుభాషితం గుర్తొచ్చింది.
పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవచక్రవాలం
నాభ్యర్థితో జలధరోపి జలం దదాతి
సంతః స్వయం పరహితే విహితాభియోగాః
(సూర్యుడు ఎవ్వరూ ప్రార్థించకుండానే కొలనులో తామరను వికసింపజేస్తాడు. చంద్రుడు ఎవ్వరూ అడగకపోయినా కలువలను వికసింప చేస్తాడు. మేఘుడు యాచించకపోయినా నీటిని ఇస్తున్నాడు. సత్పురుషులెప్పుడూ పరులకు సాయపడటానికే ఇష్టపడతారు.)
తనను ఊరడించడానికి ఆగిన ఆ మహామత్తగజానికి నమస్కరించాడు జాయప. మహాగజం అతణ్ని తన తొండంతో పైకి ఎత్తుకుని, ముఖం వద్దకు తీసుకుంది. మావటివానితో సహా అందరూ విభ్రమంగా చూస్తున్నారు. జాయప ఎలాంటి తొణుకు లేకుండా ఆకాశమంత ఎత్తున్న ఆ గజరాజాన్ని నిమురుతూ ఏదేదో చెప్పాడు. కింద ఉన్న ఓరుగల్లు ఆస్థాన స్థపతి కానోజు కొంత విస్తుపోయినా, అవతల మహారాజు వారి దర్శన సమయం మించిపోతున్నదన్న ఆలోచనతో..
“మావటీ! ఎవరు ఆ పిల్లవాడు? ఏం జరుగుతున్నది? సమయం మించిపోతున్నది! దిగమని చెప్పు వాడికి”.. అంటూ తొందరపెట్టాడు.
“చిత్తం.. బాబూ! దిగు దిగు”.. అన్నాడు ఆ మావటి ఆశ్చర్యం నుంచి బయటపడి.
మళ్లీ ఆ మహాగజానికి ఏదో వివరించాడు జాయప. మత్తగజం అతణ్ని కిందికి దింపింది.
“అయ్యా.. మహామత్తగజాన్ని అధిరోహించిన మహానుభావులు ఎవరో తెలుసుకోవచ్చా?” అడిగాడు జాయప.
“ఆయన హొయసల సామ్రాజ్య మహాస్థపతి శ్రీ జక్కనాచార్యవర్యులు. మేము కాకతీయరాజ్య ఆస్థాన స్థపతులం” చెప్పాడు కానోజు.
కళ్లు తుడుచుకుని గజం ముందు సాష్టాంగపడ్డాడు జాయప. చేతులు పైకెత్తి అంబారీలోని ఆయనకు కనిపించేలా కైవారం చేశాడు. మళ్లీ మహాగజానికి నమస్కరించి, మళ్లీ ఏదేదో చెప్పి పక్కకు తొలగాడు. గట్టిగా ఘీంకరించిన మహామత్తగజం.. అక్కణ్నుంచి భారంగా కదిలింది. ఇది చూసిన పురజనులు జాయపను అబ్బురంగా చూస్తుండగా.. మరోవైపు సాగిపోయాడు జాయప.
రాత్రి రెండో జాము అవుతున్నది. అలా ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు జాయప. ఊరు నిద్ర కోసం ఆవులిస్తున్నది. వీధులు పలచబడుతున్నాయి. దారుల వెంట కాగడాలు కూడా నీరసంగా వెలుగుతున్నాయి. దగ్గరగా కుక్కల అరుపులు.. దూరంగా నక్కల ఊళలు.. ఓ వీధి మలుపువద్ద ఎవరినో చూసి ఆగిపోయాడు జాయప. ఎదురుగా సుబుద్ధి. ఆందోళనగా చూస్తున్నాడు. తిరిగి తిరిగి వెతికి వెతికి అలసినట్లున్నాడు.
“యువరాజా! ఏమిటిది? చెప్పకుండా ఎక్కడికెళ్లారు. ఏమిటీ డొంకల వెంట తిరగడం? ఏమైంది మీకు?”.
సుబుద్ధిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకున్నట్లు గట్టిగా ఏడ్చాడు జాయప. ఎన్నాళ్లుగానో హృదయంలో గడ్డకట్టుకున్న దుఃఖం జలపాతంలా ఉరికింది. ధూళి ధూసరితమై, స్వేదంతో తడిసిన దుస్తులతో.. దైన్యం మూర్తీ భవించిన కౌమారంలా ఉన్నాడు జాయప. కదిలిపోయాడు సుబుద్ధి.
“అయ్యో.. జాయపా! నా తండ్రి.. ఏమైంది మీకు?” ఆందోళనగా అడిగాడు.
“అమ్మ! అమ్మ కావాలి.. మామయ గారూ!”..
వెక్కి వెక్కి ఏడుస్తూ జాయప చెప్పిన మాట వినగానే.. ఆయన ఆందోళన అంతా తగ్గిపోయింది. తల్లిపై ఇంత
కాలంగా గుండెల్లో గూడుకట్టుకున్న బెంగ ఇప్పుడు బయటపడింది. అందుకే ఇలా పిచ్చెక్కినట్లు తిరిగాడు.
కళ్లు తుడిచి కదిపి తన గుర్రంపై కూర్చోబెట్టి చెప్పాడు..
“రేపు ఓ వర్తకబిడారు దక్షిణాదికి బయల్దేరుతున్నది. మీరు ఆ బిడారుతో ద్వీపరాజ్యం వెళ్లే ఏర్పాటు చేస్తాను. కాస్త ఉపశమించండి. తమ్ముడు భైరయతో మాట్లాడదాం.. సరేనా!? సరేనా!?” అంటూ ఊరడించాడు.
‘సరే!’ అన్నట్లు జాయప తల ఊపాక.. ఇద్దరూ అధిరోహించిన అశ్వం వారి ఇంటి వైపుగా కదిలింది.
ఆవలగా చీకట్లో.. ఇద్దరు వ్యక్తులు ఎక్కి ఉన్న మరో రెండు అశ్వాలు చౌండ నగరి వైపు పరుగు తీశాయి.
మూడవ అధ్యాయం : అధ్యయన జాయప
భానుడు ప్రకృతి కప్పుకొన్న కంబళి తొలగించి.. రాత్రి కురిసిన మంచును కబళిస్తూ నిద్రమత్తు వదిలిస్తున్నాడు. అనుమకొండ పురాన్ని విడిచేందుకు వర్తకబిడారు సిద్ధంగా ఉన్నది. రెండుక్రోసుల పొడవున్న ఎడ్లబళ్ల బిడారు అది. రెండువందల ఎడ్లబళ్లు. రోజువారి గృహోపకరణాలతో, వినిమయ వస్తువులతో, వంటింటి పదార్థాలతో రూపొందింది. అది సమయశెట్టి వల్లయ బిడారు. ఆయన అనుమకొండలోనే పేరు ప్రఖ్యాతులున్న వర్తకుడు. చాలా నిజాయితీపరుడి గానూ, మంచి యుద్ధవీరుడి గానూ, చతుర్విధోపాయాలతో తన ప్రాణాలు వొడ్డి అయినా తోటి వ్యాపారులను సంపూర్ణంగా రక్షించగలడని.. నాణ్యమైన సరుకును మాత్రమే అమ్మకానికి పెడతాడని.. భారత ఉపఖండవ్యాప్తంగా ఉన్న ఛప్పన్న రాజ్యాలలో గుర్తింపు ఉన్నవాడు. ఆయన బిడారులో చేరడానికి వర్తక శ్రేష్ఠులు తాపత్రయ పడతారు. ఆయన బిడారు మార్గం తెలుసుకుని ఆ మార్గంలోని గ్రామాల రాశి వర్తక శెట్టిలు సరుకు తమకే అమ్మాలని మునుముందే ఆయనతో ఒడంబడిక చేసుకుంటారు. గ్రామాలలో రట్టలు, మహాజనులు, సమయశెట్టిలు వల్లయ బిడారుకోసం ఎదురు చూస్తుంటారు.
అలాంటి వల్లయ బిడారు ముందురోజు అర్ధరాత్రి అనుమకొండలోని ఆయన కోష్టాగారంలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. మైలారదేవుడికి, కాకతమ్మకు బలులు, కొలుపులు అయ్యాక తొలి బండి కదిలింది. వర్తకబిడారు (వర్తకసాటు)లో మూడు ప్రధాన విభాగాలు ఉంటాయి. వర్తకులు, పెరికలు, ముమ్మూరు దండు. వర్తకుల్లో కోమట్లు, బలింజ వర్తకులతోపాటు ఇతర కులవృత్తులవారు, చర్మంతో విభిన్న వస్తువులు తయారు చేసే మాదిగ వర్తకులు కూడా ఆ బిడారులో ఉంటారు. ఈ బిడారులో జొన్నలు, పసుపు, పత్తి, బెల్లం, అల్లం, మిరియాలు, ఆకులు, పోకలు, చక్కెర, నూనెలు మొదలు దాదాపు నలభై వంటింటి వాడుక వస్తువులు ఉన్నాయి. సరుకు వర్తకుడిదైతే దాన్ని తమ ఎడ్లబళ్ల ద్వారా రవాణా చేసేవారు పెరిక బలింజలు. కొంత రుసుము మీద బళ్లు రవాణా చేస్తారు. పెరికలకు కూడా సమయాలు ఉన్నాయి.
బలింజల్లో మూడోవర్గం ముమ్మూరు దండు. రక్షణ సైన్యం. మొదటితరం రక్షణ సైన్యం వర్తకులుగా మారితే.. అలా మారకుండా కేవలం రక్షణమాత్రమే చేస్తున్న బలింజ ఉపకులం ఈ ముమ్మూరు దండు. చేతిలో మూడు మూరల దండ(కర్ర)తో వర్తక వర్గాలకు కాపలా కాసే వీరు మైలార వీరభటులు. వీరు ముప్పై రెండు రకాల ఆయుధాలను ఉపయోగించగలరని ప్రతీతి. మూడు మూరల దండ తిప్పితే.. విసిరిన రాయి కూడా బిడారుపై పడదని చెప్పుకొంటారు.
కర్రతో ఒక్క దెబ్బ వేస్తే ఎదుటివాడు కిక్కురుమనకుండా చావాల్సిందే!
దాదాపు వంద రకాల వస్తువులతో, లేఖకులతో, సహాయకులతో, అలేఖన పొత్తాలతో, ఘంటాలతో సిద్ధమయ్యారు నలభై మంది వర్తకులు. సరుకులు ఎత్తిన రెండువందల బళ్లతో పెరికలు సిద్ధమయ్యారు. అలాగే ఆయుధ ధారులై తమ గుర్రాలతో సంసిద్ధంగా ఉన్నారు యాభైమంది ముమ్మూరు దండు. తన నాణ్యతా పరీక్షకులను ప్రతి వర్తకుని కోష్టాగారానికి పంపి నాణ్యతా పరీక్షలు చేయించాకే వారికి బిడారులో అవకాశం ఇచ్చాడు వల్లయ. పెరిక సంచులపై సరుకు సంకేత నామాలు, తూకం వివరాలు, ధరవరలు ఘంటంతో చెరిగిపోని రసాయనాలతో రాయించాడు. అలాగే ఏ వస్తువు ఏ పరిమాణంలో, ఏ వస్తువుతో మారకం ఉంటుందో.. నాణాలైతే ఎట్లా నిర్ణయించారో.. అన్నీ వివరంగా రెండురోజుల ముందు నుంచే తెలుసుకుంటూ.. గత బిడారు అమ్మకాల్లో జరిగిన అనుభవాలను వివరిస్తూ అన్నిటికీ సరసమైన ధరవరలు నిర్ణయించాల్సిందిగా వ్యాపారులను బుజ్జగిస్తూ.. అన్నీ సరిగా ఉన్నట్లుగా తన లేఖకులు, అనుచర నిర్వాహకులు చెప్పాకే తన పల్లకి ఎక్కాడు వల్లయ.
అప్పుడొచ్చి ఎదుట నిలబడ్డాడు సుబుద్ధి. ఓ చేతిలో జాయప చెయ్యి.. మరో చేతిలో అతని బట్టలున్న గుడ్డసంచి. పక్కన తమ్ముడు భైరయ. మొదటిసారి తన అసలు వివరాలు వల్లయతో సుబుద్ధి చెప్పడం విన్నాడు జాయప. వల్లయ ఆశ్చర్యపోయాడు. ఒక సామంత రాకుమారుడు ఇంత అనామకంగా.. సుబుద్ధి వంటి సాధారణ దళపతి ఇంట్లో ఉండటం అతణ్ని విస్మయపరిచింది.
“ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్పలేను శెట్టీ! ఇంతకాలం హాయిగానే ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు తల్లిదండ్రులమీద బెంగతో తల్లడిల్లుతున్నాడు. దయచేసి ఇతణ్ని బెజ్జవాడ వద్ద ద్వీప వర్తకులకు అప్పగించమని మనవి” అన్నాడు. అంతకుముందే.. అదే బిడారులో వెళ్తున్న భైరయతో జాయప అంశం చెప్పాడు సుబుద్ధి. అతణ్ని ఎలాగైనా ద్వీపరాజ్యం చేర్చాలని, అందుకు ఇదే తగిన మార్గమని అన్నదమ్ములు చర్చించుకున్నారు.
“జాయపను నా బండిలో, నా వద్దే ఉంచుకుంటాను. పద.. వల్లయను అభ్యర్థిద్దాం అన్నా!” అన్నాడు భైరయ. జాయప ఎవరో తెలిశాక.. వల్లయ ‘సరే!’ అన్నాడు. సుబుద్ధి ఇంట్లో జాయప ఉండటం వల్ల సుబుద్ధికి ఎప్పుడైనా ముప్పు ఉన్నదని వల్లయ భావించాడు. భైరయ కూడా ఈ బిడారులో ఉండటం వల్ల జాగ్రత్తగా జాయపను ద్వీపరాజ్యానికి చేర్చగలమని ఆయన భావించాడు.
అలా జాయప ఆ బిడారు ద్వారా దాదాపు రెండేళ్ల తర్వాత తన ద్వీపరాజ్యం వైపుగా వెళ్తున్నాడు. ఎడ్లబండి కుదుపులకు మెలకువ వచ్చింది జాయపకు. అప్పటికే సూర్య భగవానుడు వేడిని పుంజుకున్నాడు. బండిలో పక్కన కూర్చుని గణాంకాల పొత్తం చూస్తున్న భైరయ లేఖకుడు జాయపను చూసి నవ్వాడు.
“మంచినీరు! తాగు”.. అంటూ తాగు నీరున్న తోలుతిత్తిని జాయప ముందుకు జరిపాడు. తీసుకుని తాగాడు జాయప. ఒళ్లు విరుచుకుని లేచి గూడులోంచి బయటికి చూశాడు. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది.
(సశేషం)
..అప్పుడొచ్చి ఎదుట నిలబడ్డాడు సుబుద్ధి. ఓ చేతిలో జాయప చెయ్యి..
మరో చేతిలో అతని బట్టలున్న
గుడ్డసంచి. పక్కన తమ్ముడు భైరయ. మొదటిసారి తన అసలు వివరాలు
వల్లయతో సుబుద్ధి చెప్పడం విన్నాడు జాయప. వల్లయ ఆశ్చర్యపోయాడు.
మత్తి భానుమూర్తి 99893 71284