ఒక రేవు పట్టణం తీరంలో నౌక బయల్దేరడానికి సిద్ధంగా ఉంది. అప్పుడో కాకి వచ్చి నౌకపై ఉన్న కట్టెపై వాలింది. ఏదో ఆలోచనలో పడి అలాగే కూర్చుండిపోయింది. ఇంతలో నౌక కదిలింది. ఇదేమీ పట్టించుకోలేదు కాకి. ఏదో గుర్తుకు వచ్చినట్టు రివ్వున గాల్లోకి ఎగిరింది. ఎటు చూసినా సముద్రమే కనిపించింది. ఎక్కడా వాలేందుకు అవకాశం లేక మళ్లీ వచ్చి ఆ కట్టెపైనే వాలింది. ఇలా చాలాసార్లు జరిగింది. ఇక ఎగిరి ప్రయోజనం లేదనుకున్న కాకి కట్టెపైనే స్థిరంగా ఉండిపోయింది. దీనిని ‘నౌకాగ్రకాక న్యాయం’ అని చెబుతారు పెద్దలు. సాధన క్రమంలో లౌకిక విషయాలు ఎన్నో ప్రభావితం చేస్తుంటాయి. వాటికి లోబడితే సాధన అటకెక్కినట్టే. నడి సంద్రంలో నావపై ఉన్న కాకిలా మనసును ఇతర విషయాలపై వాలనీయకుండా సాధనను కొనసాగించాలి. అలాగని బాధ్యతలు విడువాల్సిన పనిలేదు. కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక ఆనందం పొందవచ్చు. లౌకిక విషయాలకు తగు ప్రాధాన్యం ఇవ్వాలే గానీ, వాటిలోనే మునిగిపోవద్దు. గృహస్థు ధర్మం పాటిస్తూనే పరమాత్మపై దృష్టి కేంద్రీకరించాలి.