ఎంతోమంది ఉద్యమం నుంచి వెళ్లిపోయారు. వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అందులో ముఖ్యులు కవిత్వం రాసినవారు. పాటలు రాసిన వారు. గళం ఎత్తిన వారున్నారు.ఒక్కో క్షణం అనిపించేది. ఆమె చెప్పినట్లు ఓ కొస నుంచి మరో కొసకు ఉద్యమం మలుపు తీసుకుంది.
అతని కళ్లు మూతబడటం లేదు.దట్టమైన అడవి. ఒక్కసారిగా వాతావరణం స్తంభించినట్లు అనిపించింది. అతనిలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అప్పుడు కొమ్మలు కదిలాయి. ఉలిక్కిపడి పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. అనుమానంగా ఆ చీకట్లో కళ్లు చిట్లించి చూస్తున్నాడు. దూరంగా తమ దళ సభ్యులు ఆదమరిచి నిద్రపోతున్నారు. అందులో ఓ వ్యక్తి మాత్రం.. నిద్రపోకుండా అప్రమత్తంగా ఉన్నాడు. చల్లటి గాలి వీయడం మొదలైంది. గాలి పాటను మోసుకొస్తున్నట్లు అతనికి అనిపించింది. అవును పాట. పదునెక్కిన పాట! అతని మనసు గతంలోకి పరుగులు తీసింది.
అదో మారుమూల గ్రామం.అక్కడికింకా అభివృద్ధి అనేది ప్రవేశించలేదు. అక్కడ అన్ని వృత్తులవారూ ఇంకా వాటినే నమ్ముకుని బతుకుతున్నారు. అరకొరగానే ఆదాయాలు. అక్కడ ప్రకృతి అందాలు ఉన్నాయి. అతనికి చిన్నప్పటి నుంచీ పాట అంటే ప్రాణం. అది ఎప్పుడు మనసులో పుట్టిందో తెలియదు. అతను నోరు తెరిస్తే ఏదో రాగం బయటికి వచ్చేది. అది ఏ రాగమో అతనికి తెలియదు. అతను అక్కడి బడిలోనే అక్షరాలు దిద్దుకున్నాడు.
అక్షరాలకంటే అక్కడి చెట్లూ, చెలమలూ, మనుషులూ.. అతణ్ని పాటగాడిగా మలిచాయి. మొదటి రోజుల్లో సినిమా పాటలు పాడేవాడు. తర్వాత జానపద గీతాలు. అందులో శృంగారం, ఆ తర్వాత తత్వాలు పాడుకున్నాడు. అతని బతుకులోకి ఎన్నో పాటలు అలా వచ్చి, అతని మెదడు పొరల్లో నివాసం ఏర్పరుచుకున్నాయి.
బాల్యం కరిగిపోయింది. కౌమారం దారి విడిచింది. యవ్వనంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు పరిచయం అయ్యారు కొందరు వ్యక్తులు.
“ఈ లోకం నిండా ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే తత్వాలు పాడుతున్నావా?”.. అన్నప్పుడు అతని మనసులో తేనెతుట్టె కదిలింది.
“పాట మన ఆనందం కోసం కాదు. అది జనం కోసం కావాలి. ఇప్పటివరకు నువ్వు పాడిన పాటల చోటులో నువ్వు కొత్త పాటలు రాయాలి. నువ్వు జనం నాలుకల మీద పాటగా మారిపోవాలి. రేపు నువ్వుండవు. నీ పాట మాత్రమే ఉంటుంది” అన్నారు.
అతను ఇల్లు విడిచిపెట్టాడు. దళంలో చేరిపోయాడు. అనంతమైన దరిద్రాన్ని, హింసను, అణచివేతను దగ్గరగా చూశాడు. అతనిలో పాట సరికొత్త రాగాలతో ఊపిరి పోసుకుంది. అయినా అతనికి రాగాలు తెలియవు. రాగాలన్నీ అతని పాటలో నిక్షిప్తం అయ్యాయి.
అతనికి అంతకుముందు అమ్మానాన్నలు పెట్టిన పేరు ఉంది!
“ఈ రోజు నుంచి నీ పేరు మారుస్తున్నాం” అన్నారు.అతను ఆందోళనగా చూశాడు. అతనికి అమ్మానాన్నలు గుర్తుకు వచ్చారు.“ఇక్కడ మనకు ఉద్యమం ప్రధానం. ఇందులో పని చేసేవారికి ఒక్క పేరు మాత్రమే ఉండదు. అనేక పేర్లు ఉంటాయి. మనం జయించాల్సినవి చాలా ఉన్నాయి. మనం వ్యక్తిగత ఆస్తిలేని సమాజం కోసం యుద్ధం చేస్తున్నాం. మనకు కుటుంబం లేదు. జగమంత కుటుంబం మనది. మనకు అనుబంధాలు అడ్డంకి. మనకు సహచరులు, జనం మాత్రమే.. స్నేహితులైనా, ప్రాణమైనా. మనం ఇప్పుడు వ్యక్తులం కాదు. వ్యక్తులుగా మన అస్తిత్వాన్ని మనం వదులుకున్నాం. ‘నేను’ అంటే మన ఉద్యమం. మన సంస్థ. అంతకుమించి ఎలాంటి కీర్తి కాంక్షలు మనల్ని తాకకూడదు. నేను అంటే సమూహం. ఇది ప్రతిక్షణం మనల్ని హెచ్చరించే ఆయుధం కామ్రేడ్!”.కాలం పరుగులు తీస్తున్నది. నిరంతరం ప్రయాణం. ఆట నుంచి పాట వరకు, వాటినుంచి రకరకాల ఆచరణల వరకు.
అతను ఎప్పటికో ఓ రాత్రి అతని గ్రామం చేరుకున్నాడు. అప్పుడు అమ్మానాన్నలను చూడాలనుకున్నాడు. జన్మనిచ్చిన వారు. ఎవరికీ చెప్పకుండా ఓ రోజు మాయమయ్యాడు. అలా చేసింది తను మాత్రమే కాదు. ఎందరో యువతీ యువకులు. తల్లిదండ్రులను కలవడానికి దళం అంగీకరిస్తుంది. అతను మాత్రం తను బంధాలకు బానిస అవుతానేమో అనుకున్నాడు. బలవంతాన తనను తాను నిగ్రహించుకున్నాడు.
అతను ఊర్లోకి అడుగుపెట్టగానే ఒక్కసారిగా అతణ్ని పాటలు చుట్టుముట్టాయి. అందులో అతను విన్న, పాడిన అన్ని రకాల గీతాలు ఉన్నాయి. అతని దగ్గర ఓ డైరీ ఉంటుంది. అందులో అతను పాటలు రాసుకుంటాడు. వందల కొద్దీ పల్లవులు, చరణాలు ఉంటాయి. అందులో కొన్ని ప్రేమగీతాలు ఉంటాయి. అలాగే ప్రకృతి మీద ప్రేమతో రాసుకున్న పాటలు ఉంటాయి. ఎప్పుడన్నా ఏకాంతంలో ఉన్నప్పుడు..
‘నేను పాటకు దూరం అయ్యానా? నాలో అనేక ఉద్వేగాలు ఉన్నాయి కదా! అవన్నీ చంపుకొని కేవలం ఓ తరహా పాటలకు పరిమితం అయ్యానా!?’ అనిపిస్తుంటుంది. అంతలోనే కర్తవ్యం ముందుకు వస్తుంది.
ఈ ప్రయాణంలో అతనికి ఆమె కలిసింది. ఆమెకు కూడా కొన్ని పేర్లున్నాయి. ఆమె అతని కంటే ఎక్కువ చదువుకుంది. మంచి కవిత్వం రాస్తుంది. వారి చేతిలో కలాలు మాత్రమే కాదు.. ఆయుధాలు కూడా ఉంటాయి. ఆ కవిత్వంలోనూ అనేక రకాల ఆలోచనలు. ప్రేమ, కలలు, కొత్త సమాజం, సౌందర్యం.
“వీటినుంచి దూరంగా పారిపోవడం సాధ్యం కాదు”
అన్నదామె.
“వీటిని ప్రచురిస్తున్నారా?” అన్నాడతను.
“పత్రికలకు పంపడానికి మనవాళ్లు ఒప్పుకోరు. మన పత్రికల్లో ప్రచురించే కవిత్వం, కథలు వేరు. ఇవన్నీ నా కోసం. ఇలాంటి తీవ్రత లేకపోతే నేను ఉద్యమంలోకి వచ్చేదాన్ని కాదు” అన్నదామె.
అతను తల పంకించాడు.
ఇద్దరూ కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవారు. మొదట్లో కాస్త ముభావంగా ఉన్నా.. క్రమంగా వారిద్దరి మధ్య ఓ అనుబంధం ఏర్పడింది.
“మనం పత్రికలకు మన రచనలు పంపకపోతే అందులో ప్రజలకు వ్యతిరేకమైన రచనలే వస్తుంటాయి. మనం ఆ స్పేస్ని ఉపయోగించుకోవాలి కదా! అవి చదివేది కూడా పాఠకులే కదా!” అన్నాడతను.
“మన రచనలను ఆ పత్రికల వారు ప్రచురిస్తారా!? అనేది పక్కన ఉంచుదాం. మన సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక ఓ కారణం ఉంది. మనం వ్యక్తిగత ప్రచారాలకు లోబడిపోతాం అని. మనం ఇంతకుముందు నుంచి గమనిస్తున్నాం. కొంతమంది కవులు, రచయితలు కేవలం సంస్థను ఉపయోగించుకోవడానికి వస్తున్నారు. వారికి కాస్త పేరు రాగానే సంస్థ నుంచి బయటికి వెళ్తున్నారు. అందుకోసం ఇలాంటి లక్షణాలు పొడచూపకుండా కట్టడి కావచ్చు”.
“నేను మీతో మాట్లాడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి” అన్నాడతను.
“మాట్లాడండి” అన్నదామె.
“ఇప్పుడు కాదు. నాకు మరికొంత క్లారిటీ రావాలి. అప్పుడు!” అన్నాడతను.
ఈ ఉద్యమంలో అందరూ ఒకేచోట పనిచేయడం సాధ్యంకాదు. అందులోనూ ఇది రహస్య నిర్మాణం. రకరకాల ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తుంటుంది. అక్కడి అవసరాల కోసం కొంతమందిని పంపిస్తుంటారు. నిరంతరం రిక్రూట్మెంట్ జరుగుతుంటుంది. కొంతమంది కొరియర్లుగా ఉంటారు. ఇంకొంతమంది పూర్తికాలం కార్యకర్తలుగా పని చేస్తుంటారు. అందులో రకరకాల వడపోతలు ఉంటాయి. కార్యకర్తలుగా మొదలైన వారు క్రమంగా వారి అనుభవాన్ని, అధ్యయనాన్ని, నిజాయితీని దృష్టిలో ఉంచుకుని రకరకాల నాయకత్వ బాధ్యతల్లోకి ప్రమోట్ చేస్తుంది అగ్రనాయకత్వం.
ఇక పట్టణాల్లో, నగరాల్లో బహిరంగంగా పని చేస్తుంటారు కొంతమంది. వారు అనేక ప్రజా సంఘాల్లో ఉంటారు. పౌరహక్కుల నుంచి కార్మిక, కర్షక సంఘాల వరకు ఉంటాయి. సాహితీ, సాంస్కృతిక సంస్థలు ఉంటాయి. అందులో కొన్ని కొంతకాలం నిషేధానికి గురవుతుంటాయి. వీటిలో పని చేసేవారు కూడా అజ్ఞాతంలోకి వెళ్తుంటారు.
అతను – ఆమె ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అదే చివరి సమావేశం.. వారిద్దరిది.
“మళ్లీ మనం కలుసుకుంటామో లేదో తెలియదు!” అన్నాడతను కాస్త విషాదంగా.
“అవును. మనతో పాట, కవిత్వం మాత్రమే కాదు.. మృత్యువు కూడా మన పక్కనే నడుస్తుంటుంది” అన్నదామె.
“మృత్యువుకు నేను భయపడను. అది ఎప్పటికైనా అనివార్యమని మనకు తెలుసు. అందుకు సిద్ధపడే ఈ ఉద్యమంలోకి వచ్చాం. నేను చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు వెళ్లినా.. అమ్మానాన్నలను కలుసుకోలేదు. బంధువులకు లోబడతానని భయం కలిగింది. ఇప్పుడు నువ్వు, నేనూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. చాలా బాధగా ఉంది. ఇది మాత్రం బంధం కాదా?”.
ఆమె మాట్లాడకుండా చూపులు పక్కకు తిప్పుకొన్నది.
“మనుషులు బంధాలను తెంచుకోవడం సాధ్యం అవుతుందా?”.
“అది అసాధ్యం మిత్రమా!” అన్నదామె.
మళ్లీ వారి మధ్య మాటలు కరువయ్యాయి.
“ఇంతకుముందు.. ‘కొంత క్లారిటీ వచ్చాక మాట్లాడే విషయాలున్నాయి’ అన్నావు. క్లారిటీ వచ్చిందా కామ్రేడ్!”.
అతను ఆమె కళ్లలోకి చూశాడు.
ఓ నీటి పొర కళ్లను కమ్మింది.
“దుఃఖ పడుతున్నావా?” అన్నదామె.
“ఉద్యమకారులు ఏడవరా? వాళ్లు బండరాళ్లా? మనుషులకుండే అన్ని లక్షణాలకు వారు అతీతులా నేస్తం” అన్నాడతను.
“ముందు మనం మనుషులం. పుట్టుకతో ఎవరూ ఉద్యమకారులుగానో, భక్తులుగానో పుట్టరు. పరిస్థితులు వారిని అలా మారుస్తాయి” అన్నదామె.
అతను మాట్లాడటం మొదలుపెట్టాడు.
“పాట.. నన్ను ఈ ఉద్యమంలోకి తీసుకువచ్చింది. నేను ఎన్నో పాటలు రాశాను. అవన్నీ జనం ఆదరణ పొందాయి. అనేక సమావేశాలకు వెళ్లాను. అక్కడ నా పాటను కళాకారులు పాడుతుండేవారు. అది వింటున్న ప్రజల కళ్లలో ఆనందం… ఆగ్రహం, రకరకాల భావాలు నేను చూస్తుండేవాణ్ని. కానీ, నా పాట సంస్థ పేరు మీద ఉంటుంది. అది నా కడుపులో పుట్టిన పాట. నా బిడ్డ అది. కానీ నేను ‘అది నా బిడ్డ!’ అని చెప్పుకోలేను”.
“ఉద్యమం కోసం అమ్మానాన్నలను, కుటుంబాన్ని కూడా వద్దనుకున్నావు కదా కామ్రేడ్!”.
“నిజమే! ఒక్క ప్రశ్న అడుగుతాను!”.
“అడుగు నేస్తం”.
“ఈ ఉద్యమానికి మార్క్స్ సిద్ధాంతం ప్రేరణ. దాన్ని అభివృద్ధి చేసినవాడు లెనిన్. తమ దేశానికి అన్వయించుకున్న వాడు మావో. వీళ్లందరి పేర్లూ చరిత్రలో ఉన్నాయి. వారి రచనల్లో ఉన్నాయి. అలాగే మన దేశంలో కమ్యూనిస్టు, విప్లవ నాయకులందరి పేర్లతో, నాయకత్వంతో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇంక స్వతంత్ర పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహానాయకుల పేర్లు ఉన్నాయి. వారందరికీ లేని ఈ ‘వ్యక్తిగత’ సమస్య కవులకేనా, పాటల రచయితలకేనా? ఈ పాటను రాసింది ఫలానా వ్యక్తి అంటే ఏమవుతుంది? అతను పతనమవుతాడా? సినిమాల్లోకి వెళ్లిపోతాడా? పాలకవర్గ రాజకీయాల్లోకి వెళ్తాడా?”.
“ఈ పాటను తయారుచేయడంలో అందరి పాత్ర ఉంటుంది కదా!”.
“ఉంటుంది. ఎవరన్నా ఓ పదం అదనంగా జోడించవచ్చు. ఆ మాటకొస్తే పాటకు సంగీతాన్ని మరొకరు అందిస్తారు. వారి పేరు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న బీజం ఎవరిది?”.
“మరోలా అనుకోవద్దు. చర్చ కోసం అడుగుతున్నాను.. జానపద గీతాలు సృష్టించిన వారి పేర్లు మనకు తెలియదు. అవి జనం నుంచి, తరాల నుంచి, దేశాల నుంచి అలా ట్రావెల్ చేస్తుంటాయి. వాటి మీద హక్కు ఎవరికి ఉంటుంది? జానపద గీతం ఆధారంగానే అనేక పాటలు తయారవుతున్నాయి కదా!”
అన్నదామె.
“మంచి ప్రశ్న కామ్రేడ్! జానపద గీతంలోని పల్లవిని తీసుకోవడం వేరు. కొన్ని చరణాలు వాడుకోవచ్చు. వాటి మీద ఎవరికీ హక్కులు ఉండవు. అందుకు కారణం మూల రచయితల గురించి తెలియకపోవడం. అవి ఉపయోగించుకుని తయారుచేసిన గీతంలో ఆత్మ ఎవరిది? ఆ రచయితదే కదా!? మార్క్సిజానికి గానీ ప్రపంచంలో ఉన్న మరే తత్వశాస్ర్తానికి గానీ.. అంతకుముందు ఆధారాలు లేవా? అప్పటికప్పుడు ఆకాశం నుంచి పుట్టాయా? వాళ్లు చేసింది లోపాలను సవరించడం, ఖాళీలను పూరించడం, తలకిందులుగా ఉన్నవాటిని సరిగ్గా నిలబెట్టడం. అది కదా శ్రమకు ఇచ్చే గౌరవం. అలానే ఈ తత్వశాస్ర్తాలు, రాజ్యాంగాలను ఒక్కరు మాత్రమే రూపొందించారా?” అన్నాడతను.
“వ్యక్తిగత బలహీనతలకు లోనవుతారని కదా ఇవన్నీ. అలాంటప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా. కొంతమందిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు. నగరాల్లో ఉండేవారికి, అజ్ఞాతంలో ఉన్నవారికి మధ్య ఉన్న అంతరాలు ఏమిటి? పాట రాసిన వారు ఒకరైతే ఇంకొకరి పేరు మీద చెలామణి కావడం ఏంటి? ఇంకో విషయం. నగరంలో ఉన్నవారు మాత్రమే లొంగుబాటలో ప్రయాణం చేయడం లేదు. అడవుల్లో ఉన్నవారూ అనేకమంది అదే బాటలో ఉండటం మన అనుభవం కదా! అయినా ‘వ్యక్తి’ సమస్య కొత్త సమాజం వచ్చేంత వరకేనా? వచ్చాక కూడా ఇలానే ఉంటుందా? మనం ఇలాంటి చిన్న సమస్యలను పరిష్కరించకుండానే ఈ సమాజాన్ని మార్చగలమా?” అని ఆగాడు.
“నువ్వు మాట్లాడటం పూర్తయిందా కామ్రేడ్!?”.
అతను చిన్నగా తలూపాడు.“ఒకటి మాత్రం నిజం. మనది నెలబాలుడి ఉద్యమం అంటుంటాం. ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఏదో కొసకు లాక్కుపోతున్నారు. మధ్యే మార్గం ఈ ఆవేశాల్లో కనిపించదు. సుదీర్ఘకాలం పోరాటం చేయడం, నమ్మకాన్ని పెంచుకోవడం, నిలబెట్టుకోవడం ఇన్ని నష్టాల మధ్య చాలాకష్టం. ఈ ఉద్యమంలోకి అనేకమంది వస్తుంటారు పోతుంటారు. చివరి వరకు నిలబడగలిగే వారు అతితక్కువ మంది. కొంతమంది బలిదానాలు చేస్తారు. ఇంకొందరు లొంగుబాటు వీరులుగా ప్రపంచం ముందు నిలబడిపోతారు. నాకు కూడా అనిపిస్తున్నది.. మనం అంతర్గతంగా చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయని. నువ్వు అన్నట్లు ప్రపంచ సాహిత్యంలో ప్రముఖులందరి పేర్లు ఉన్నాయి. వారి రచనలు ఉన్నాయి. అసలు అనామకుడు అని ఎవరన్నా పేరు పెట్టుకున్నా.. అదీ ఓ పేరే” అన్నదామె.
అతను చిన్నగా నవ్వాడు.
“ఇంకో మాట అడుగుతాను నేస్తం”.
“అడుగు కామ్రేడ్!”
“ఈ కారణం వల్ల నువ్వు ఉద్యమం నుంచి బయటికి వెళ్లవు కదా!”.“లేదు లేదు! ఇది నా ఒక్కడి బాధ మాత్రమే అనుకోను. మనలో ఇంకా చాలామందికి ఇలాంటిది ఉండవచ్చు. అందరూ బయటికి చెప్పుకోరు. నేనుకూడా ఇంతవరకూ ఎవరితోనూ ఈ విషయం గురించి మాట్లాడలేదు. నీతోనే పంచుకున్నాను”.
“ఇకముందు కూడా అలాగే ఉంటావా?”.
“మౌనంగా పని చేసుకుపోవడం అన్ని సందర్భాల్లోనూ సరైంది కాదు. ఇకనుంచి మన మధ్య అంతర్గత చర్చ జరగాలి. ఇదొక్కటే కాదు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. నాయకత్వానికి అవన్నీ వివరంగా రాసి పత్రం సమర్పిస్తాను. దానిమీద చర్చ జరగాలని సూచిస్తాను. అది మనందరం ఎక్కడ ఉన్నా అందరికీ సర్క్యులేట్ చేస్తారు కదా!”.
“అవును. అలా జరుగుతుందని అనుకుందాం”.
“మరో విషయం. ఇదంతా మరింతగా ఉద్యమం కోసం అంకితం కావడానికే. నాయకత్వం నాలాంటి వారి ఆలోచనలతో విభేదించినా.. మెజార్టీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అందుకు తగ్గట్లుగా ఓ కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్తాను”.
“చాలా సంతోషం నేస్తం!” అన్నదామె.
“మనం కొన్ని గంటల్లో విడిపోతున్నాం. మనం కోరుకున్న సమాజం ఏదో ఒకరోజు వస్తుంది. ఆ నమ్మకం ఉంది. ప్రపంచ చరిత్రను గమనిస్తే కమ్యూనిస్టు పార్టీలన్నీ ఈ వ్యక్తికి చెందిన అస్తిత్వ సమస్యలకు గురవుతున్నాయి అనే స్పష్టత నాకుంది. అందువలన అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మనం వ్యక్తులుగా చీలిపోతున్నాం. తర్వాత వ్యక్తుల పేరు మీద సంస్థలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ ప్రమాదాన్ని మనం ముందుగా పసిగట్టాలి. దాన్నుంచి బయట పడటానికి ఏం చేయాలో నేర్చుకోవాలి. లేకపోతే చివరికి వ్యక్తులుగా మిగిలిపోతామనే బాధ నన్ను పీడిస్తూనే ఉంటుంది” అన్నాడు.
“నువ్వు పాటలు రాయడం మానుకుంటావా?”.
“లేదు నేస్తం. పాట నా ప్రాణం. రేపు మనం ఉండం. మన పాటే ఉంటుంది. నేను బతికి ఉన్నంత వరకూ పాటను నేను.. నన్ను పాట వదిలి పెట్టదనుకుంటున్నాను”.
“సెలవు మిత్రమా… మళ్లీ మనం కలుసుకుంటామనే నమ్మకం ఉంది. అప్పటికి కొత్త సమస్యలు వస్తాయి. వాటి గురించి మనం చర్చించుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటాను” అన్నదామె.
“సెలవు నేస్తం!” అన్నాడతను.
ఇద్దరి పిడికిళ్లూ బిగుసుకున్నాయి.
ఆమె చివరిసారి అడిగింది.
“నువ్వు ప్రేమగీతం కూడా రాశావని తెలుసు. అదొక్కసారి పాడగలవా!”.
అతను పాడుతున్నాడు.
ఆమె రెండు కళ్లూ మూసుకుని తన్మయత్వంతో వింటున్నది.
“ఏం కామ్రేడ్.. నిద్రరావడం లేదా?” అన్నాడు కాపలా కాస్తున్న వ్యక్తి.“లేదు మిత్రమా! ఏవేవో జ్ఞాపకాలు” అన్నాడతను.
“ఉదయమే మన ప్రయాణం. బలవంతంగా అయినా కళ్లు మూసుకో. నిద్రపోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైందో!” అన్నాడా వ్యక్తి.
చిన్నగా తలూపి పడుకున్నాడు. మళ్లీ ఆలోచనలు!ఆమె మళ్లీ కనిపించలేదు. ఎన్కౌంటర్లో చనిపోయిందని తెలిసినప్పుడు.. అతను రెండు రోజులు భోజనం చేయలేదు. ఆమెకు నివాళిగా తను చేయగలిగింది ఒక్కటే. అశ్రుగీతం రాయడం – అమర గీతం పాడటం. ఆ గీతానికి అతని పేరు ఉంచాలనుకోలేదు. ఆమెతో జరిగిన చర్చ తర్వాత అనేక మార్పులు జరిగాయి. ఉద్యమంలోకి కులం ప్రవేశించింది. ప్రాంతం ప్రవేశించింది. ఎంతోమంది ఉద్యమం నుంచి వెళ్లిపోయారు. వేరు కుంపట్లు పెట్టుకున్నారు. అందులో ముఖ్యులు కవిత్వం రాసినవారు. పాటలు రాసిన వారు. గళం ఎత్తిన వారున్నారు. ఒక్కో క్షణం అనిపించేది. ఆమె చెప్పినట్లు ఓ కొస నుంచి మరో కొసకు ఉద్యమం మలుపు తీసుకుంది. వ్యక్తిగత ప్రాబల్యం తగ్గించాలనుకున్న నిర్ణయం వికృతంగా మారింది. ఇప్పుడు అన్నీ వ్యక్తుల పేరు మీదే. ఇలాంటిది కవులూ, గాయకుల్లోనే ఎక్కువ ఉంటుందా? నేను తప్పు చేశానా? వ్యక్తిగా మించి ఎదగలేకపోయానా!? అనే ఆలోచనలు వచ్చాయి.
క్యాడర్ను కాపాడుకోవడం కష్టంగా మారింది. ముఖ్యమైన నాయకులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. కొత్తవారు వస్తున్నా.. ఇంతకుముందులా ఎక్కువమంది ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చిన్నచిన్న బృందాలు. రాజకీయ, సైద్ధాంతిక అవగాహన పరిమితంగా ఉంది. అతని అమ్మానాన్నలు చనిపోయారని తెలిసినప్పుడు అతను భోరున ఏడ్చాడు.
‘నేను సైతం మామూలు మనిషిని అయ్యాను!’ అనుకున్నాడు.
‘ఇది సహజం నేస్తం!’ అని ఆమె ఓదార్చుతున్నట్లు భావించాడు.
ఉద్యమం ఇంకా పసిప్రాయంలోనే ఉంది.
కనుచూపు మేరలో ఏ మార్పూ కనిపించడం లేదు.
శరీరాన్ని, మనసునీ, బందూకుని, నమ్మకాన్నీ మోసుకుంటూ ప్రయాణం చేయాల్సిందే!
చివరికి మిత్రులు శత్రువులుగా మారిపోయారు.
అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అయినా…!
ఉషోదయపు కిరణాలు అతని ముఖం మీద పడ్డాయి. అప్పటికే అందరూ తయారవుతున్నారు బయల్దేరడానికి. ప్రయాణం ఆరంభమైంది.
అప్పుడు మొదలయ్యాయి కాల్పులు.
క్షణాల్లో తేరుకుని అతను కాల్చడం మొదలుపెట్టాడు.
కామ్రేడ్స్ అందరూ తలో దిక్కు అవుతున్నారు.
కొందరి గుండెల్లో, మరి కొందరి వెన్నులో బుల్లెట్స్ దూసుకుపోయాయి. అతను తృటిలో తప్పించుకునేవాడు. ఇంతలో.. అతని శరీరం ఎగిరెగిరి పడింది.
బుల్లెట్ల వర్షం… అతను కుప్పకూలిపోయాడు.
పోలీసులు అతని బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు.
అతని డైరీ నిండా పాటలు.. పాటలు.. ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పాటలు..
అతను లేడు. అతని పాటలూ లేవు!
ఓ అశ్రుగీతాన్ని ఎవరో రచిస్తున్నారు.
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
పి. చంద్రశేఖర ఆజాద్
రచన తప్ప మరో ప్రపంచం లేకుండా.. నాలుగు దశాబ్దాలుగా సాహితీసేవ చేస్తున్నారు పి. చంద్రశేఖర ఆజాద్. పుట్టిపెరిగింది.. గుంటూరు జిల్లా వెల్లటూరు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా వీఆర్ఎస్ తీసుకుని పూర్తికాలం రచయితగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ 850కి పైగా కథలు, 85 నవలలు, 18 నవలికలు, 50కి పైగా కవితలు, 15 ఫీచర్స్, అనేక వ్యాసాలు, ముందుమాటలు, రేడియో, స్టేజ్ నాటికలు రాశారు. రేడియో, సినిమా, సాహితీ సంస్థల నిర్వహణతోపాటు కొన్ని సీరియల్స్, ఒకటి రెండు సినిమాల్లో నటించారు. ఈయన రాసిన ‘అడవి పూలు’ టెలీ ఫిల్మ్ సంభాషణలకు రెండు నంది అవార్డులు అందుకున్నారు. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు అందించిన నాలుగు టెలీ ఫిల్మ్స్కు మూడు స్వర్ణ నందులు, ఓ వెండి నంది స్వీకరించారు. ‘భారతి’ పిల్లల సినిమాకు స్వర్ణ నంది దక్కింది. 30 నవలలకు, వందకుపైగా కథలకు వివిధ పత్రికలు, వివిధ సంస్థల నుంచి బహుమతులు వచ్చాయి.
-పి. చంద్రశేఖర ఆజాద్
92465 73575