Ramaayanam | చిన్నప్పుడు పైసా ఖర్చు లేని ఎన్నో ఆటల్లో.. రైలు ఆట ఒకటి. ఎడం చేత్తో మన ముందు నడిచేవాళ్ల గౌను పట్టుకుని.. అర చేతిని విప్పార్చి, బొటన వేలికి, చూపుడు వేలికి మధ్య ఉన్న భాగాన్ని నోటికి అడ్డం పెట్టుకుని.. ‘కూ.. చుక్. చుక్!” అంటూ తిరిగేవాళ్లం. ఎంతమంది పిల్లలుంటే.. అంత పెద్ద రైలు ఏర్పడి, అందరం సంతోషంగా ఆడుకునేవాళ్లం.
తెలుగు వాచకంలో రైలు ప్రయాణం గురించి ఒక పాఠం ఉండేది. అందులో రాసినట్టు.. ‘ఎప్పుడెప్పుడు రైలు ఎక్కుతామా? ఎప్పుడు ఆ ఊళ్లన్నీ చూస్తామా? కదులుతున్న రైల్లో కిటికీ పక్కన కూర్చుని వెనక్కి వెళ్తున్న చెట్లనూ, కొండల్నీ, పొలాల్నీ, ఆకాశాన్నీ తనివితీరా చూసి ఆనందిస్తామా?’ అనే తహతహ ఉండేది. ‘విజయవాడలో ఎక్కి సామర్ల కోటలో దిగాం!’ అంటూ చదివినప్పుడు.. ‘అరే! ఈ పాఠంలో మన ఊరు పేరు లేదే? మన ఊర్లో కూడా రైలు పట్టాలున్నాయి కదా! ఇక్కడ కూడా స్టేషన్ ఉంది కదా! ఇట్నుంచి కూడా రైళ్లు ప్రయాణిస్తాయి కదా!’ అనిపించేది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి రైలు ప్రయాణం అంటే సంక్రాంతి సెలవుల్లో హైదరాబాద్ పోవడమే! చాలాసార్లు మాకు సెలవులు రాగానే హైదరాబాద్ నుంచి మా కజిన్ ఆనంద్ అన్నయ్య వచ్చి, మమ్మల్ని హైదరాబాద్ తీసుకెళ్లేవాడు. అమ్మ కూడా మాతో వచ్చినప్పుడు చపాతీలపై వెన్న కారప్పొడి రాసి, గుండ్రంగా చుట్టి.. రైల్లో తినడానికి తీసుకువచ్చేది. అమ్మ లేకుండా మేమే వెళ్తే.. కారప్పూస, చేగోడీలు లాంటివి కట్టి ఇచ్చేది.
అప్పట్లో ఇక్కడినుంచి వెళ్లడానికి పూరీ ప్యాసింజర్, నాగపూర్ ప్యాసింజర్.. మా ఊర్లో ఆగే ఈ రెండు రైళ్లు మాత్రమే దిక్కు మాకు. మా రైల్వే స్టేషన్ చాలా చిన్నది. అయినా పచ్చని చెట్లతో.. చల్లగా, నిశ్శబ్దంగా, తపస్సు చేస్తున్న మునిలా అనిపించేది. పొద్దున 11 గంటలకు ట్రైన్ ఉందంటే.. ముందుగానే తయారై స్టేషన్కి వెళ్లేవాళ్లం. అక్కడున్న రెండు బెంచీల నిండా మనుషులు కూర్చుని ఉండేవారు. మేం చెట్టు కింద నిలబడి.. ‘రైలు ఎప్పుడు వస్తుందా!?’ అని ఎదురు చూసేవాళ్లం. చుట్టుపక్కల ఊర్లవాళ్లు సద్దులు తెచ్చుకుని అక్కడే తినేవారు. ఆ ట్రైన్లు ఎప్పుడూ సమయానికి వచ్చింది లేదు. కనీసం ఒక గంట వెయిట్ చేశాక.. అప్పుడు ‘రైలు మూడు గంటలో, నాలుగు గంటలో లేట్!’ అని చెప్పేవారు. చేసేదేమీ లేక కాళ్లు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చి, అన్నం తిని మళ్లీ స్టేషన్కు వెళ్లేవాళ్లం. అప్పటికి ఊరికి వెళ్లాలన్న ఉత్సాహమే పోయేది. ఒకవేళ లేటు మరీ ఆరేడు గంటల పైగా ఉంటే కనుక.. “ఇగ ఇవాళ ప్రయాణం వద్దు ఏమొద్దు! రేపు బోదురులే!” అని ఇంట్లో వాళ్లు అనేవారు. బట్టలు మార్చుకొని మళ్లీ ఆటల్లో పడేవాళ్లం.
మా ఊరి నుంచి నాంపల్లి స్టేషన్కు రైలు చేరేసరికి ఐదారు గంటలు పట్టేది. రైలు ఎక్కగానే కంపార్ట్మెంట్ కిక్కిరిసి సీటు దొరికేది కాదు. చాలామంది ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చేవారు. అప్పుడు అమ్మ ఆ కూర్చున్న వాళ్లతో.. “బచ్చే హై! థోడా జాగా దేతే క్యా?” అని అడిగేది. అమ్మకు హిందీ రావడం నాకెంతో ఆశ్చర్యం కలిగించేది. కొంతమంది మిటుకుమిటుకుమంటూ చూసేవాళ్లు తప్ప.. ఏమాత్రం దయ చూపించేవాళ్లు కారు. పైగా మమ్మల్ని చూడగానే, ఎక్కడ కొంచెం చోటు అడుగుతామేమోనని వాళ్ల పిల్లల్ని.. “ఎహే! సరిగా కూర్చోండి. అందరూ వస్తున్నారు” అంటూ మరింత విశాలంగా కాళ్లు చాపి కూర్చోబెట్టేవారు. ఇంకా కొంతమంది మాత్రం కొంచెం జరిగి మాకు చోటిచ్చేవారు. ఆ తర్వాతి స్టేషన్లో ఎవరైనా దిగితే.. ఆ సీట్లో మెల్లగా అమ్మ, ఆ తర్వాత ఆనంద్ అన్నయ్య కూర్చునేవారు. మధ్యలో పల్లీలు, బఠాణీలు అమ్మేవాళ్లు వచ్చేవారు. వాళ్లల్లో ఒకరిద్దరు అబ్బాయిలు స్కూల్లో మా సీనియర్లు.
“పల్లీ.. బఠానీ!” అంటూ, ఒక వెదురు బుట్ట చేతికి వేసుకొని.. కంపార్ట్మెంట్ నుంచి కంపార్ట్మెంట్కు తిరుగుతూ అవి అమ్ముకునేవారు. అప్పట్లో ఒక డబ్బా నుంచి మరో డబ్బాకు వెళ్లడానికి లింక్ ఉండేది కాదు. అంత చిన్నపిల్లలు భుజానికి బుట్ట వేసుకుని ఒక కంపార్ట్మెంట్ నుంచి డోర్ ద్వారానే పక్కనున్న కిటికీ పట్టుకుని వేలాడుతూ.. పక్క కంపార్ట్మెంట్కు వెళ్లేవారు. వాళ్లను అలా చూసినప్పుడు.. ఎక్కడ కింద పడిపోతారేమోనని భయం వేసేది. పైగా వాళ్లను అప్పుడప్పుడూ రైల్వే టీసీ వచ్చి బెదిరించేవాడు. డబ్బులేమీ ఇవ్వకుండానే.. వాళ్ల దగ్గర పల్లీలు, బఠానీలు తీసుకునేవాడు. ‘పాపం!’ అనిపించేది. “స్కూల్ పిల్లలు ఎందుకు పల్లీలు అమ్ముడు?” అని అమ్మను అడిగితే.. “వాండ్లకు సరిపోయేటన్ని పైసలు ఉండవు. ఇంట్ల అందరూ పనిజేస్తెనే బతుకుతరు. ఏం జేస్తరు పాపం! సెలవులల్ల చేతనైన పనిజేసి వాళ్ల అమ్మానాన్నలకు సాయపడుతున్నరు” అన్నది. ఆ మాట నాకు చాలా రోజులు గుర్తుండిపోయింది. అది నాగపూర్ ప్యాసింజర్ అయితే గనక చాలామంది బుట్టలతో పళ్లు తీసుకొచ్చి.. “సంత్రా! సంత్రా.. నాగపూర్ సంత్రా!” అంటూ అమ్మేవారు. అమ్మ అప్పుడప్పుడూ మాకు సంత్రాలు గానీ, పల్లీలు గానీ కొనిపెట్టేది. కొన్నిసార్లు ఉడకపెట్టిన సెనగలు లాంటివి కూడా అమ్మేవారు. వాటిని కొనమని అమ్మను అడిగితే.. వద్దన్నట్టు చూసేది. అమ్మ వద్దంటే అంతే! ఆ మాటే శాసనంలా మారుమాట్లాడే వాళ్లం కాదు. సతాయించడం అస్సలు తెలియదు.
– నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | సంగీత జ్ఞానం (గాత్రం)
Ramaayanam | చెంబులకొద్దీ నీళ్లు ముంచి ఇస్తుంటే.. బడికి పోయినా బాగుండె అని అనిపించింది!
Ramaayanam | తొలి యాత్రా స్పెషల్!