Ramaayanam | చలికాలం.. పల్లెటూరి వాళ్లకు టూరిజం సీజన్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద జాతరలు ఘనంగా జరిగేవి. సంక్రాంతితో మొదలై కొన్ని, శివరాత్రితో మొదలై మరికొన్ని.. ఉగాది దాకా సాగేవి.
పిల్లలూ, పెద్దలూ ఇంటిల్లిపాదీ కలిసి, మొద్దుబండ్లకు ఎద్దులను కట్టి, వంట సామాన్లూ, పాత్రలూ, బట్టలూ, కట్టెలమోపులూ సర్దుకుని జాతరలకు వెళ్తుండేవారు. జాతరకు పోతున్నామంటే.. చిన్నపిల్లల సంబురం సరేసరి! ముసలివాళ్లల్లో కూడా ఎంతో సంతోషం కనిపించేది. చిన్నప్పుడు మాకు తెలిసిందీ, చూసిందీ వరంగల్ జిల్లానే గనుక.. పాలకుర్తి, కొమురవెల్లి, ఐనవోలు ఈ మూడు శైవక్షేత్రాలలో జాతరలు వైభవంగా జరగడం చూశాం. ఇప్పటికీ చూస్తున్నాం. ఆ తరువాతి రోజుల్లో సమ్మక్క – సారలమ్మ జాతర వాటికన్నా పెద్దదని తెలిసింది.
నేను మొట్టమొదట చూసిన జాతర పాలకుర్తిలోనే. మా అమ్మ పుట్టిల్లు బమ్మెరకు మూడు కిలోమీటర్ల దూరంలో పాలకుర్తి ఉండేది. తరువాతి రోజుల్లో హైస్కూల్కు వచ్చాక మా కజిన్స్ కొందరు రోజూ నడిచి బమ్మెర నుంచి అక్కడి బడికి వెళ్లి చదువుకునేవారు. పాలకుర్తి సోమనర్సింహ స్వామి సన్నిధిలో శివరాత్రి నుంచి జాతర ప్రారంభమయ్యేది. తెలుగులో తొలి ద్విపద కావ్యం రాయడమే కాకుండా.. ‘వృషాధిప శతకం, పండితారాధ్య చరిత్రం, బసవ పురాణం’ వంటి ఎన్నో గ్రంథాలు రచించిన పాల్కురికి సోమనాథుడు ఇక్కడివాడేనని కొంచెం పెద్దయ్యాక అమ్మ చెబితే తెలిసింది.
శివరాత్రికి ప్రభలు కట్టడం ఇక్కడి ఆచారం. బండిని చక్కగా రకరకాల పూలతో అలంకరించి, పెద్ద తెరచాపల్లాంటి రంగురంగుల బట్టలతో పరదాల్లాగా కడతారు. బండి చక్రాలకు, నొగలకు కూడా రంగులు వేసేవారు. ఇక ఎడ్ల మెడల్లో గంటలు వేసి కొమ్ములను కూడా బంతిపూలతో చుట్టేవారు. వీరముష్టి వాళ్లు గడీలో బండి ముందు వీరంగం వేసేవాళ్లు. మేం చిన్నపిల్లలమంతా మిద్దె ఎక్కి చూసేవాళ్లం. రాజాలు అనే ఆయన వీరంగం వేసేటప్పుడు చూసి తీరాల్సిందే! బండికి ప్రభలు కట్టాక.. దాని ముందు అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ తిరుగుతూ, గెంతుతూ, ఎర్రబడ్డ కళ్లతో, మధ్య మధ్య మీసాలు తిప్పుతూ.. “హఁ! హఁ! శరభ, శరభ, అశ్శరభ శరభ!” అంటుండేవాడు. అలా అంటూనే, ఓ పెద్ద గుమ్మడి
కాయను అందుకుని మోకాలెత్తి.. దానిమీద ఠపీమని గుమ్మడికాయను పగలగొట్టేవాడు. పైనుంచి చూస్తున్న మేమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేవాళ్లం.
బమ్మెరలో గడీ నుంచి మావాళ్ల బండి మొదట కదిలాక, దాని వెనక బలిజ కులస్తుల బండి.. ఆ తరువాత అందరి బళ్లూ వరుసగా కదిలేవి. పాలకుర్తిలో గుడి ఓ చిన్న గుట్ట మీద ఉంటుంది. గుట్ట చుట్టూ ఈ బండ్లు ప్రదక్షిణగా తిరిగేవి. విస్నూరు రామచంద్రారెడ్డి బండి వచ్చినా.. “మా ఎనుక తిరుగవల్సిందే!” అని బమ్మెర వాళ్లు అంటూ.. ఆ బండిని ముందు వెళ్లనిచ్చేవారు కాదట. ఆ గుట్ట మీద ఒక సొరంగం చీకటిగా ఉండేది. శివరాత్రి రోజుల్లో మాత్రం అందులోంచి గబ్బిలాలను వెళ్లగొట్టి, కాగడాలతో వెళ్లి పైనున్న పెద్ద మట్టి ప్రమిదలో అఖండ దీపం వెలిగించేవారు. అది మూడురోజులైనా ఆరిపోకుండా అలా వెలుగుతూనే ఉండేది.
ఉపవాసాలుండే భక్తులందరి కోసం గడీలో నుంచి మావాళ్లు తూమెడు రవ్వ, ఇరుస గోధుమ పిండి, రెండు తక్కెళ్ల బెల్లం, రెండు తక్కెళ్ల నెయ్యి, నందా తిరువళిక (అఖండ దీపం) కోసం మణుము నూనె పంపించేవారట. తూమెడు అంటే నలభై కిలోలు. ఇరుస అంటే ఇరవై కిలోలు, మణుము అంటే పన్నెండు కిలోలు, తక్కెడ అంటే సుమారు కిలోన్నర అని.. అమ్మను విసిగించి మరీ అడిగి తెలుసుకున్నాను.
ఇక జాతర సంబురం అంతా ఇంతా కాదు. మేం ఆడపిల్లలమంతా మధ్యాహ్నం భోజనాలు అయినాక రెండు కచ్చడాల్లో జాతరకు బయల్దేరేవాళ్లం. మా వెంట కనీసం ఇద్దరు మగవాళ్లను లక్ష జాగ్రత్తలు చెప్పి పంపేవాళ్లు. వద్దంటే మొదటికే మోసం వస్తుందని ఊరుకునేవాళ్లం. పది నిమిషాల్లో పాలకుర్తి చేరుకునేవాళ్లం. జాతరలో చిన్న చిన్న గుడారాల కింద రకరకాల దుకాణాలు ఏర్పడేవి. వాటిని చూస్తూ ఎంత దూరం నడిచినా అలసటే తెలిసేది కాదు. పూసలు, పిన్నీసులు మొదలుకొని.. చీరలు, దుప్పట్లు, వ్యవసాయ పనిముట్లు, మూలికల మందుల దాకా, అన్ని రకాల దుకాణాలు వరుసలు కట్టి ఉండేవి. ఇక తినుబండారాలకైతే లెక్కే లేదు. అప్పట్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్లు లేవు గనుక బజ్జీలు, పూరీలు, జిలేబీ అమ్మే దుకాణాలు మటుకు ఉండేవి. అక్కడ చాలామంది గుమిగూడేవారు.
పాన్ షాపుల దగ్గర కూడా అంతే! ఐస్ ఫ్రూట్, బూరు మిఠాయి, కలర్ సోడాల బళ్లు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించేవి. కానీ, మా వెంట వచ్చిన ఎస్కార్టులు వాటి జోలికి మేం వెళ్లకుండా చూసేవారు. జాతరలో టూరింగ్ టాకీస్ ఆఖరి ఘట్టం. ఓ పక్కగా తెర ఉండేది. చుట్టూ తడకలతో దడి కట్టేవారు. పైన మాత్రం ఆకాశం కనిపించేది. ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నమాట. తాతయ్య వాళ్లు టాకీసు వాళ్లకు మొదటే వంద రూపాయలిచ్చేవాళ్లట. అందుకని అమ్మ వాళ్ల జమానాలో ఫ్రీషో చూసేవాళ్లట. మా వరకు వచ్చేసరికి టికెట్లు కొనేవాళ్లం కానీ, బండిలో వేసుకుని తెచ్చిన మోడాలు వేసుకుని సినిమా చూసేవాళ్లం.
వచ్చేటప్పుడు మళ్లీ తెచ్చుకునేవాళ్లం. ఓసారి అలాగే ‘జేమ్స్ బాండ్ 777’ సినిమాకు వెళ్లాం. కృష్ణ, విజయలలిత.. హీరో, హీరోయిన్లు. అందులో ‘జేమ్స్ బాండ్ త్రిబుల్ సెవెన్’ అనే పాట పదేపదే వస్తుంటుంది. ఆ పాటలో కృష్ణ వచ్చినప్పుడు మామూలుగానే ఉండే తెర.. విజయలలిత వచ్చినపుడు మాత్రం కిందికీ మీదికీ అలల్లాగా కదులుతూ ఉండేది. మా కజిన్స్లో ఒకామె.. “ఏయ్.. చూడండే! హీరోయిన్ డాన్స్ చెయ్యాలె గనుక విజయలలిత రాంగనె ఎనుక నించి తెరను ఊపుతున్నరు!” అన్నది. వెంటనే ఇంకో కజిన్.. “ఎహె! డాన్స్ చేస్తె ఆమె జెయ్యాలె గానీ, తెర ఊపితె డాన్స్ అయితదా?! అయినా డాన్స్ లేనప్పుడు కూడా ఊగుతున్నది! ఎవరన్న సిన్మా టికెట్కు పైసలు లేనోళ్లు కావాల్నని ఎనుకకు పొయ్యి ఊపుతున్నరు గావొచ్చు” అన్నది. “అట్లేం గాదు!” అంటే.. “ఏం కాదు”!. “షర్తా?!” అంటే.. “షర్తా?!”. “ఎంత?”.. అంటే “ఎంత?” అని, చివరికి రూపాయి పందెం కట్టుకున్నారిద్దరూ.
చివరికి ఎస్కార్టును పంపిస్తే.. తెల్సిందేమిటంటే డాన్సనీ కాదు, హీరోయిననీ కాదు, టికెట్ కొనని వాళ్లూ కాదు.. అసలు ఆ తెరను ఎవ్వరూ ఊపలేదు.
ఓపెన్ ఎయిర్ కనుక.. గాలి వీచినప్పుడల్లా తెర అలాగే ఊగుతుందనీ, విజయలలిత వచ్చినప్పుడే గాలి వచ్చి తెర ఊగడం కేవలం అనుకోకుండా జరిగిందనీ!!
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి