Katha – 2021 | “నేలనపడి ఊపిరితో ఉన్న యెద్దును కటికకు యెట్లమ్ముతావు సోమీ!”..
అప్పటికి పావుగంట నుంచి మాలిండ్లలో ఉన్న పెద్దమనుషులంతా కట్టకట్టుకునొచ్చి నిలేస్తున్నారు.
అందరూ యాభై అరవై యేండ్ల పైబడినోళ్లే!
ఇంటి వసారాలో అరుగుమీద కూర్చొని, కలబంద నారతో పగ్గం పేనుకుంటున్న నాగన్న.. అంతసేపూ తలకాయొంచుకొని వాళ్ల మాటలు, నిలదీతలు వింటూనే ఉన్నాడు.
కొందరు వసారాలో కింద కూర్చుని ఉన్నారు. ఇంకొందరు అరుగునానుకుని నాగన్నకు దగ్గరగా నిలబడి ఉన్నారు. వాళ్లలో ఒక పెద్దమనిషి.. నాగన్న నాయన కాలంలో ‘ఇంటి మాలోడు’గా ఉన్న పెదరాజు. కలబందనార పాయలు చిక్కుతీసి నాగన్న చేతికిస్తూ సాయపడుతున్నాడు.
“పెద్దరెడ్డివై ఉండి నువ్వే ఊరికట్టడి దాటితే ఎట్లబ్బా!”.. నార అందిస్తున్న పెద్దమనిషి అనునయంగానే నిలదీసినాడు.
పేనిన భాగాన్ని తొడ కిందనుంచి వెనక్కి జరుపుకొని, ఆ పెద్దమనిషి చేతినుంచి నారపాయను అందుకుంటూ నాగన్న తలెత్తినాడు.
“పెద్దరెడ్డి యెవడురా! పెద్దరెడ్డినైతే.. దాని ఊపిరి నిలిచిపోయిన్దాకా సగదీరి, గుంతతీసి పూడ్చిందును. దాని బతుకంతా నాకే చాకిరీ చేసింది. అట్లాంటిదాన్ని నాకు ఉసి లేకనే అమ్ముకుంటున్నా. మా యబ్బ కాలంనాటి ఈ లంకంత కొంప తప్ప నాకేముంది?! పైన దంతెలు ఇరిగిపోయి మెత్తు రాలిపోతాంటే సరిచేయిచ్చుకోలేకుండా!” అన్నాడు.
“నీ ఇబ్బందులెట్లన్నా ఉండనీ! అంతోఇంతో భూమి, యెద్దులు, యెనుముల యాసంగం ఉన్న మారాజువి. మీ నాయన, అబ్బల కాలం నుంచీ ఊరిలో పదిమందికీ మంచీ – చెడ్డా చెప్పిన కుటుంబం. నువ్వు కట్టడి దాటడం సరికాదబ్బా!”.. ఆ మాల పెద్దమనిషి గిరిగీసి దాటొద్దన్నట్లు అనునయంలోనే కటువు ధ్వనించినాడు.
నాగన్న పేనుతున్న పగ్గాన్ని నడిమధ్యనే విసురుగా పక్కకుతోసి..
“మీరందరూ కట్టుబాట్లు, కట్టడ్లను దాటకుండానే బతుకుతున్నారా? రైతుకు, మాలోనికి యాడన్నా సంబంధం మిగులుందారా? మీ బతుకులు మీయైనాయి, మా బతుకులు మాయైనాయి. మీ పిల్లోళ్లు తిప్పే ఆటోల్లో మేమెక్కుతా ఉండాం. మా దగ్గరలేని సెల్ఫోన్లు మీ దగ్గరుండాయి. ఇంగా కట్టడి పేరుతో నాయట్లాటి బక్క రైతుమింద పడటమేందిరా! అయినా ఊర్లో ఇంగా ఏ కట్టుబాట్లయినా బతికున్నాయారా!? యా కాలంలో ఉండారు. పోండిరా! నా యెద్దును నేను అమ్ముకొంటాను. ఎవడు అడ్డమొస్తాడో చూస్తా” అంటూ లేచి ఇంట్లోకి నడిచినాడు.
మాల పెద్దమనుషులందరూ ఒక నిట్టూర్పు విడిచి..
“పోదాం పాండిరా! పంచాయితీ పెట్టిద్దాం!” అని తలోమాట అంటూ.. లేచి తమ ఇండ్లదావ పట్టినారు.
* * *
గాడిపాటన కండ్లు మూసుకుని నెమరేస్తా పడున్న యెద్దును చూస్తా ఉంటే.. నాగన్నకు గుండె చెరువవుతా ఉంది. మక్కి విరిగిన కాలును పారజాపుకుని యెద్దు పడుకునుంది. వారం దినాలనుండి ఎట్ల పడున్న యెద్దు అట్లనే ఉంది. అటూ ఇటూ కాలుమార్చి పొర్లలేని స్థితిలో.. ఒకేవైపు పడుకొని ఉంది. నేలకానిన వైపు కడుపు, పక్క భాగమంతా తోలు చవికిపోయి పీక్కొచ్చి పుండవుతా ఉంది.
వారం కిందట గాడిపాటన కాలుజారి దభేలుమని పడింది. అంతకుముందు వారం దినాలు తెరపిలేకుండా వానలు కురిసి.. ఊరూ చేలూ జివజివమని బురద మయమయ్యాయి. ఇండ్లలో గాడిపాళ్లు ఎంత వూడ్చినా ఆరకుండా జోమొడుస్తా ఉన్నాయి. ఊడ్చేటప్పుడు యేమారితే సర్రున కాలు జారేలా ఉన్నాయి. ప్రాయం మీద పడిన యెద్దులు. నాగన్న మేత జొళ్లగాట్లో గుమ్మరిస్తుండగానే, పడుకొనున్న యెద్దులు ఆత్రంగా మేతకోసం లేచినాయి. లేవబోతున్న కొమ్ములెద్దు వెనక కాలు సర్రున జారి దబ్బునపడింది. అంతే! లేవలేకపోయింది. నాగన్న అదిలిచ్చినాడు. భార్య, ఈడొచ్చిన ఆడపిల్లలిద్దరితో కలిసి లేపాలని శతవిధాలా పోరాడినాడు. వాళ్ల తరం కాలేదు.
బయటకుపోయి ఇరుగుపొరుగు, అయిన పొయినోళ్లను పదిమందిని వెంటేసుకొచ్చినాడు. తలోమాట, తలో సలహా మాట్లాడినారు. కూలబడిన యెద్దు నడుములు పట్టుకుని కొంచెం లేపి.. ఆ సందున కాడిమాను దూర్చి, అటు నలుగురూ ఇటు నలుగురూ కాడిమాను పట్టుకొని.. యెద్దును లేపి నిలబెట్టినారు. కాడిమాను యెద్దు కిందనుండి తీస్తుండగానే.. కాలు నిలబడక మళ్లీ దబ్బున పడిపోయింది. అందరూ పెదవి విరిచినారు. మక్కి విరిగిందని తేల్చినారు.
ఆ దినం నుండి.. ఈ వారం దినాలుగా యేటి అవతల పల్లెనుండి బుడేన్సాబ్ వచ్చి వైద్యం చేస్తున్నాడు. తనే కొండకుపోయి యేవో ఆకులు కోసుకొచ్చి నూరి, కోడిగుడ్లలోని తెల్లసొనతో కలిపి పట్టు వేస్తున్నాడు. వారం దినాలయినా గుణం కనిపించలేదు. వారం గడిచాక పదిమందీతోడై మళ్లీ ఒక్కసారి యెద్దునులేపి నిలబెట్టే ప్రయత్నం చేసినా.. ఫలితం దక్కలేదు.
“పాయం మీరింది! యెంక కట్టుకోవడం కష్టం నాగిరెడ్డీ! కట్టుకున్నా లేచి నిలబడుతుందేమో గానీ యాసంగానికి పనికిరాదు. ఈలోపుగా యెద్దు అవతలిపక్క తోలు పాచిపోయి అదొక పుండయితుంది” అని బుడేన్సాబ్ తేల్చేసినాడు.
నాగన్నకు గుండెల్లో యేదో నొప్పి తగిలింది. తనకున్న అయిదెకరాల మెట్టతోపాటు, పదిమందికి యెద్దులతో బాడుగ సేద్యాలకుపోయి నెట్టుకొస్తున్నాడు. రెండెనుముల పాడి అమ్మి.. భార్య ఉప్పు పప్పులకు సరిపెడుతున్నది. అయినా యెదిగిన ఆడపిల్లల చదువులు ఇంటర్తోనే ఆగిపోయినాయి. రెండేండ్ల నుండి అనుకుంటున్నా.. ముసలెద్దులను అమ్మి కోడెలను పట్టుకొచ్చేందుకు పైకం బిసలేక కాలం వెళ్లదీస్తున్నాడు. ఇప్పుడు నేలనపడిన యెద్దును బతికినంత కాలం సగదీర్చేంత సత్తువ తనకు లేదు.
ఊర్లో యెద్దులను బాడుగులకు పిలవడం కూడా తగ్గిపోయింది. ఊర్లో ట్రాక్టర్లు యెక్కువవుతున్నాయి. యెద్దులతో విత్తనం వేసి, సేద్యం చేయించుకోవాల్సిన జొన్న, కొర్ర, వేరుశనగ పంటలు మాయమై, బుడ్డసెనగపంట వచ్చి పడింది. ఇప్పుడు అప్పుచేసి మళ్లీ ఇంకో యెద్దును కొనడం కన్నా రెండెద్దులనూ అమ్మడమే మేలనిపించింది.
బుడేన్సాబ్కే ఫోన్చేసి బేరగాండ్లను తోడుక రమ్మన్నాడు.
ఇంతలోనే యెట్ల తెలిసిందో.. మాలిండ్లలోని పెద్దమనుషులంతా కట్టకట్టుకుని వచ్చినారు.
‘యెద్దు పనిచేయలేక నేలనపడి ప్రాణంతో ఉంటే.. దాన్ని కటికకు అమ్మే హక్కు రైతుకు లేదు. దానంతకది నడిచి పోయేటట్లుంటేనే రైతు అమ్ముకోవాల. బండికెత్తి పంపే స్థితిలో అమ్మకూడదు. అది మాలల సొంతం. ప్రాణం పోయిన యెద్దయితే.. మాదిగల సొంతం. అది అనాదిగా ఉన్న ఊరి కట్టడి’.. అంటూ తన బతుక్కు అడ్డుపడినారు.
ఈ రెండూ వొద్దనుకుంటే.. రైతు ఆ యెద్దును బతికినంత దూరం సగదీర్చి చచ్చినాక పూడ్చుకోవాలి.
నలభై యేండ్ల కిందట సర్పంచు సుబ్బిరెడ్డి ఇంట్లో ఈ రకంగా యెద్దు యెత్తుబడితే మాలోళ్లకు ఇచ్చినాడు. ఇరవై యేండ్ల కిందట తనవంటి చిన్నరైతే వెంకటసుబ్బన్న యెద్దు కూలబడిపోయింది. బతికినంత కాలం నీళ్లు, మేపు పెట్టి.. చచ్చాక కోసుకోవాలని షరతుమీద మాదిగోళ్లకు ఇచ్చినాడు. ఇన్నేండ్లకు.. కాలం మారిపోయి అన్ని కట్టడులు పోయినాక తనకు ఈ కష్టమొచ్చింది.
* * *
మాలలు అటుపోయిన గంటకు నలుగురు మాదిగ పెద్దమనుషులు వచ్చినారు. నాగన్న యెద్దుకు నీళ్లు పెడుతుండగా చూసి.. యెద్దు చుట్టూ గాడిపాటకు చేరినారు. ఎద్దును పట్టిపట్టి చూసినారు. సానుభూతి పలుకులు పలికినారు.
నాగన్న చేతిలోని తవుడు చేటను ఓ పెద్దమనిషి.. నాగన్న నాయన కాలంలో ‘ఇంటి మాదిగోడు’గా ఉండిన రాముడు తీసుకుని, యెద్దు మూతిపెట్టి తాగుతున్న నీళ్ల బకెట్లో కలుపుతూ అక్కడే కూర్చున్నాడు. మరొకరు నిలబడి ఉండగా.. ఇద్దరు గాడిపాట బండమీద పిర్రలు మోపినారు.
ఎద్దుమీద ఆమాట ఈమాట మాట్లాడి..
“నీ ఇంట్లోనే బతుకంతా బతికి నీకు సేవచేసిన జీవం. దాని రుణం నువ్వు తీర్చుకోలేవు రెడ్డీ! బతికుండగానే చూసి చూసి ఆ మాలోళ్లకు మాత్రం ఇయ్యాకు. సగదీరను నీకు అంత బరువయితే.. మా ఇండ్లలో రాముల దేవళం కాడికి మోసుకుపోయి పండబెట్టి చచ్చేదాంకా సగదీరుతాం!” అన్నాడు రాముడు.
“ఏమొద్దు పోండిరా! నేను వాళ్లకు ఇయ్యను. మీకు ఇయ్యను. నా సావు నన్ను సావనీయండిరా!”.. రాముని చేతిలోని తవుడు చేట గుంజుకున్నాడు నాగన్న.
* * *
“ఫోన్జేసి రమ్మన్నావంటనే! చిన్నాయమ్మి చెప్పింది”.. సర్పంచు సుబ్బిరెడ్డిని సమీపిస్తూ నాగన్న అడిగినాడు.
వసారా అరుగుకు ఆన్చిన మంచంలో కూర్చుని కాఫీ సేవిస్తున్న సుబ్బిరెడ్డి..
“రావోరు కూర్చో!” అన్నాడు.
పయి మిందున్న తుండుగుడ్డను అరుగుమీద ఉన్న స్తంభము దగ్గర వేసి, స్తంభానికానుకుని కూర్చున్నాడు నాగన్న.
యెద్దు పంచాయితీ కోసమేనని తనకు తెలుస్తూనే ఉంది.
సుబ్బిరెడ్డి నేరుగా విషయంలోకి దిగినాడు.
“ఏంది వోరు! లేవలేని యెద్దును ఊపిరుండగానే కటికకు అమ్ముకుంటుండా వంటనే?”..
“ఏమ్ అమ్ముకొంటే? నా యెద్దును నా ఇష్టమొచ్చినట్లు చేసుకుంటా మావా! మాలోళ్లను వెనకేసుకొస్తున్నావా?”.. నాగన్న గొంతులో బింకం బయటపడింది.
“ఒకర్ని వెనకేసుకొని రావడ మేందోరు! నువ్వు సాటి కాపోనివి. చుట్టానివి. నీకు అన్యాయం జేయాలనుకుంటానా?”.
“చుట్టరికాల మాటెందుకులే మావా! నువ్వు యాపొద్దు నన్ను పిలిచి నీ ఇంట్లో ఆకేసినావు? నా ఇంటికొచ్చి యాపొద్దు చెయ్యి కడిగినావు? యెద్దు మాట యేందో చెప్పు”.
సుబ్బిరెడ్డికి ఇక యవ్వారం తెంచక తప్పలేదు. తేనె పూసిన మాటలు పనిచేయవని అనుకున్నాడు.
“చెప్పడానికి ఏముందోరు! ఊరికి ఒక కట్టుబాటు, కట్టడి ఉందన్నాక.. నువ్వూ నేనూ అందరం కట్టుబడి ఉండాల్సిందే! ఏమ్.. నా ఇంట్లో యెద్దు యెత్తుబడినపుడు మాలోళ్ల యెదాన కొట్టిండ్లా?”.. సుబ్బిరెడ్డి సర్పంచ్ దర్పం చూపినాడు.
“నువ్వు ఇచ్చినావులే నలభై యేండ్ల నాడు. ఇప్పుడు ఇంగా నా యట్లాటోళ్ల మెడకు చుట్టడానికా ఈ కట్టడ్లు? యాడుండారు మావా అన్ని కట్టడ్లు? ఇంటి మాలోడు, ఇంటి మాదిగోడంటే.. అన్నిటికి తల్లేరు పట్టినట్లు ముందుంటాడు. మన ఇంట్లో యెవరైనా చస్తే ఇంటి మాలోడొచ్చి గుంత తీస్తాండాడా? వాళ్లడిగినంత లెక్క ఇచ్చి గుంత తీయించుకుంటా ఉండాం. మెట్టు తెగిపోతే మాదిగోడు యెవడన్నా కుట్టిస్తా ఉండాడా? సెలకోలుకు వార్లు పెట్టమన్నా పెట్టడంలేదే! అయినా యెద్దులు యెత్తిపెట్టి ట్రాక్టర్లు తెచ్చుకున్న నీ యట్లాటోళ్లకు వాళ్లిద్దరితో పనిలేదు. మరెందుకు ఈ కట్టడ్లు? ఊర్లో ఇంగా యెద్దుల సేద్యం చేసుకునే మా యట్లాటి పది ఇరవై మంది సన్నకారు జీవాలను నలిపి పారేయడానికా ఈ కట్టుబాట్లు?”..
సర్పంచు సుబ్బిరెడ్డిని ఎదిరిస్తూ మాట్లాడుతున్న నాగన్న స్వరంలో ఆ పదును కనిపిస్తున్నది.
“ఒరే యెర్రి నాగన్నా! ఊరి కట్టుబాట్లు మనం పెట్టినయేరా. వాళ్లు పెట్టుకున్నయి కాదు. కట్టుబాట్లలో మనకు మేలుచేసేవి నూరుంటే.. వాళ్లకు మేలుచేసేవి ఒకటీ అరా ఉంటాయి. వాళ్లకు మేలుచేసేవి ఒక్కొక్కటే తగ్గిచ్చుకుంటా మనమే వాళ్లకు అన్యాయం చేసినాము. వాళ్లకు మనమూ, మనకు వాళ్లూ అన్నెట్లుండే వాళ్లం. ఇప్పుడుండామా? మనింట్లో పెండ్లయినా, వాళ్లింట్లో పెండ్లయినా ఒక్కరవ్వ బంగారు తునక ఇచ్చేవాళ్లం. ఇప్పుడిస్తాండామా? మేరగింజలు కొలుస్తాండామా? అన్నీ మానుకొన్నాం కదవోరు. వాళ్లకు మేలుచేసే ఒకటీ అరా కట్టడిని కూడా ఇప్పుడు మనం కాదంటే.. ఇంగ వాళ్లు దేనికీ మన చెప్పుచేతల్లో ఉండరు. అది తెలుసుకో!”.. నాగన్నకు జ్ఞానబోధ చేసినాడు సర్పంచు.
“వాళ్లనెవర్నో చెప్పుచేతల్లో పెట్టుకొనే తాహతు నాకులేదు. ఆ అక్కరా నాకులేదు. ఓట్ల కోసమో, ఇంగోదానికో నీకు అక్కరుందేమో! ఆ అక్కర ఉన్నోళ్లకోసం నేనెందుకు నలిగిపోవాల మావా? నేను యే కట్టడికి కట్టుబడను. నా పని నేను చేసుకుంటా!”.. నాగన్న కరాఖండీగా చెప్పి, లేచి కిందవేసుకున్న తుండుగుడ్డ విదిలించి, పయిమీద వేసుకుని తిరిగి చూడకుండా దాటుకున్నాడు.
“ఒరే నాగన్నా! నా మాట ఇనకుంటే తిప్పలు పడతావ్”.. వెనుక నుండి సుబ్బిరెడ్డి హుంకరింపు వినిపించింది.
* * *
సుబ్బిరెడ్డి దగ్గర యెదిరించి వచ్చినాడే కానీ.. యే నిర్ణయం తీసుకోవాలో నాగన్నకు తోచలేదు. తనదీ మాలా మాదిగోళ్ల బతుకే. ఆ యెద్దును కటికకు అమ్ముకుంటే అంతో ఇంతో నష్టం తగ్గుతుంది. సర్పంచునూ, మాలోళ్లనూ, మాదిగోళ్లనూ కాదని నేలకూలబడిన యెద్దును ప్రాణంతో అమ్ముకోలేడు. వీళ్లకో, వాళ్లకో ఇవ్వడం వల్ల పరోక్షంగా సర్పంచు సుబ్బిరెడ్డి ఆధిపత్యపు నీడ వీళ్లమీదో, వాళ్లమీదో మరింత చిక్కగా పరుచుకుంటుంది. నడిమధ్యన అందరి నడుమా తను నష్టపోతాడు. నాగన్న యెటూ నిర్ణయించుకోలేక పోయినాడు. మూడు దావల కూడలిలో నిలబడినట్లు అయ్యింది. ఇంటికి వచ్చి భార్య వెంకటసుబ్బమ్మతో జరిగిందంతా చెప్పినాడు.
“ఎవనికీ ఇయ్యొద్దు. ఎద్దు చచ్చేదాంకా మేతా, నీళ్లు పెట్టి.. చచ్చినాక కల్లంలో పూడ్చిపెడదాం! పెసిడెంటు పెత్తనానికీ, దిక్కుమాలిన ఊరి కట్టడులకూ మూడు దావల దిష్టి తీసి పారేసినా మనుకుందాం!”.. అన్నది ఖండితంగా.
భార్యలో ఉన్న తెగువ నాగన్నలో కనిపించలేదు.
దిగులు ఆవరించిన మనసుతో భార్యకు తలవూపినాడు.
* * *
పాలగిరి విశ్వప్రసాద రెడ్డి స్వస్థలం కడప జిల్లా యర్రగుంట్ల మండలం హనుమగుత్తి గ్రామం. వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బీఎస్సీ చదివారు. విద్యాభ్యాసం తర్వాత కొన్నేండ్లు వ్యవసాయం చేసిన ఈయన.. 25 ఏండ్లకు పైగా జర్నలిస్ట్గా పనిచేశారు. విశ్వప్రసాదరెడ్డి రాసిన మొదటి కథ ‘కాపలా కుక్కలు’. ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితమైంది. ఆ తరువాత 2005లో పది కథలతో కూడిన ‘చుక్క పొడిచింది’ కథల సంపుటి వెలువరించారు. మరో 12 కథలు పలు ప్రధాన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఇటీవల రాసిన ‘మూడు దావల దిష్టి’ కథ.. రచయితకు మరింత గుర్తింపు తీసుకువచ్చింది. యోగివేమన యూనివర్సిటీ నుంచి గజ్జెల మల్లారెడ్డి సాహిత్య పురస్కారం, మల్లెమాల సాహిత్య పురస్కారం, కవిత సాహిత్య సాంస్కృతిక పురస్కారాలను అందుకున్నారు.