‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.
“త్వరగా పోనివ్వు ముత్యాలు.. వాళ్లు వెయిట్ చేస్తూ ఉంటారు” అన్నది సోషల్ వెల్ఫేర్ కమిషనర్ రోహిణి.
“సరే.. అమ్మగారూ!” అంటూ కారు స్పీడ్ పెంచాడు ముత్యాలు.
ఏసీ ఆఫ్ చేయమని చెప్పి.. కార్ విండో ఓపెన్ చేసింది. టేకు చెట్ల మీదినుంచి చల్లటి గాలి వీస్తున్నది. బాసర చేరే సరికి మధ్యాహ్నం దాటింది. అప్పటికే అక్కడ మహిళలు గుమిగూడి ఉన్నారు. కారు దిగగానే.. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదానందం, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ మార్కస్.. రోహిణికి బొకేతో స్వాగతం పలికారు. అక్కడ ఉన్న మహిళలు గౌరవప్రదంగా లేచి నిల్చున్నారు. రోహిణి దగ్గరికి వచ్చి లబ్ధిదారుల జాబితా చూపిస్తూ..
“వీళ్లలో చాలామందికి ఇంతకుముందే రుణాలు ఇచ్చాం మేడమ్” అని ఏదో చెప్పబోయాడు ఈడీ.
“ఆ రుణాలు కట్టలేదా?” అడిగింది.
“గత ప్రభుత్వం రద్దు చేసిందమ్మా” అన్నాడు డిప్యూటీ డైరెక్టర్.
“మరి పాత రుణాలను ఎందుకు గుర్తుచేస్తున్నారు?” అడిగింది.. ఈడీని చూస్తూ.
“ప్రతి ఏడాది కొత్త కమిషనర్ రావడం.. రుణమేళా ఏర్పాటు చేయడం.. ఆనవాయితీగా మారింది తప్పా, వీళ్ల జీవితంలో మార్పు లేదమ్మా! అదే తమకు చెప్ప
బోతున్నా!” చెప్పాడు ఈడీ.
“మనం తెద్దాం..! వీళ్లు గౌరవప్రదంగా బతకడమేకదా మనకు కావాల్సింది” అన్నది రోహిణి.
“మమ్మల్ని మనుషులుగా ఎవరు చూస్తున్నారు మేడం? సెక్స్ వర్కర్ల లెక్క. అధికారుల నుంచి ఊళ్లో మోతుబరుల వరకూ.. అందరూ అలాగే చూస్తున్నారు” అన్నది వాళ్లలో ఓ అమ్మాయి.
అందం, తెలివి పోటీ పడినట్టున్న ఆ అమ్మాయిని చూస్తూ..
“నువ్వు చదువుకున్నావా?” అడిగింది రోహిణి.
“డిగ్రీ డిస్కంటిన్యూ.. మేడం!”.
“ఎందుకలా?”.
“ఇంటర్ దాకా చదవడమే మాకు చాలా గొప్ప మేడం. రెండో తరగతిలో మొదలయ్యే హేళన.. కొన
సాగుతూనే ఉంటుంది. ఆ ఎగతాళి భరించలేక కూలీకి వెళ్లి బతుకుతుంటాం. మా జీవితాలు ఇలాగే రాలిపోతుంటాయి”.. కళ్లలో నీళ్లు ఉబికి వస్తున్నాయి.
రోహిణి కళ్లూ.. అరుణిమ దాల్చాయి.
“ఏమని హేళన చేస్తుంటారు మిమ్మల్ని?”..
పీఏ రామ్మూర్తి ఎంటరై చొరవగా అడిగాడు.
“ఒకడు.. ‘మీ నాన్న ఎవడే?’ అని అడుగుతాడు. ఇంకొకడు.. ‘నీకు నాన్న ఎవరో తెలీదు కదా!?’ అంటాడు..” ఇంకా చెప్పబోతుంటే, రోహిణి అడ్డుకొని..
“ఐ నో.. నాకు తెలుసు. మీ అవమానాల జాబితా నా దగ్గర కూడా ఉంది. మీరు చేయని తప్పులకు మీరు గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. మీరెవరూ చదువులు మానకండి” అన్నది రోహిణి.
తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి కళ్లలోకి చూస్తూ..
“నువ్వు స్టడీస్ కంప్లీట్ చెయ్.. నేను సపోర్ట్ ఏర్పాటు చేస్తాను” అని చెప్పింది రోహిణి.
“ఇలా చాలామంది చెప్పి పోతుంటారు. ఈ కాలనీలో డిగ్రీ వరకు వచ్చింది ఈ పిల్లొక్కతే. ఏటికి ఎదురీదుతున్నది” అన్నది అక్కడున్న ఓ మహిళ.
“నీ పేరు ఏంటమ్మా?” అడిగింది రోహిణి.
“సాయమ్మ!” చెప్పిందామె.
ఆమె వైపు చూస్తూ…
“సాయమ్మా! నేను ఇంకో గంట ఇక్కడే ఉంటా కదా. ఈ అమ్మాయిని బట్టలు సర్దుకొని రెడీగా ఉండమను. నేనే తీసుకెళ్లి చదివిస్తా” చెప్పింది రోహిణి.
నమ్మశక్యం కానట్టు చూసింది ఆ అమ్మాయి.
అక్కడ గుమిగూడిన జనం దిక్కు తిరిగి..
“జోగిని వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసి చాలాకాలమైంది. మీ జీవితాల్లో మార్పుకోసమే ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఇక ఎవరూ మీ పిల్లల్ని జోగినిగా మార్చాల్సిన పనిలేదు. మీకు నచ్చిన వృత్తిని మీరు ఎంపిక చేసుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడితే
నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోండి. అందుకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇస్తుంది. ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తుంది. మిగతా వాళ్లలాగే మీరంతా పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” చెప్పింది రోహిణి.
ఒక్కసారిగా హర్ష ధ్వానాలు మిన్నంటాయి.
తిరుగు ప్రయాణంలో తనతోపాటు తీసుకెళ్లాలనుకున్న అమ్మాయి తల్లి బసంతిని కలిసింది. అనారోగ్యంతో మంచంపైన పడుకొని ఉన్న ఆమెవైపు చూస్తూ..
“మీరు దిగులు పడకండి. మీ అమ్మాయిని పెద్ద
ఆఫీసర్ని చేస్తాను” హామీ ఇచ్చింది రోహిణి.
బలహీన దేహంతోనే పైకి లేచి, రోహిణి కాళ్ల మీద పడినంత పనిచేసింది బసంతి.
అక్కడినుంచి కదిలి, ఆ అమ్మాయిని తన కారులో ఎక్కించుకొంది.
“ఇంతకీ నీ పేరేంటి?” అని అడిగింది రోహిణి.
“హాసిని”.
“గుడ్ నేమ్”.
“మా అమ్మతో ఎవరో ఒక పెద్ద
మనిషి జత కడితే నేను పుట్టానట. ఒకరోజు అతను అమ్మ దగ్గరికి వచ్చి, ఈ పేరు పెట్టమని చెప్పి.. పదివేలు ఇచ్చి వెళ్లాడట. ఆయన సుహాసినిగారి ఫ్యాన్ అట. మళ్లీ అతను మా అమ్మ కంటికి కనిపించలేదు!”.. చెప్పింది హాసిని నవ్వూ.. దిగులూ కలగలసిన చూపుతో.
నాలుగున్నర గంటల ప్రయాణం తర్వాత.. కారు హైదరాబాద్లో రోహిణి ఇంటి ముందు ఆగింది.
భార్య వెంట వచ్చిన హాసినిని చూసి.. రఘోత్తమ్ భృకుటి ముడిపడింది.
“ఏంటి అలా చూస్తున్నారు?” అడిగింది రోహిణి.
“ఇప్పుడే టీవీలో చూస్తున్నానోయ్.. నీ ఘనకార్యం” అన్నాడు రఘోత్తమ్.
భర్తను హాసినికి పరిచయం చేసి..
“హాసినీ.. అది నీ గది. వెళ్లి ఫ్రెషప్ కా!”.. అన్నది ఒక గదిని చూపిస్తూ.
హాసిని బిడియంగా ఆ గదిలోకి నడిచింది.
భార్యవైపు చూస్తూ..
“ఇది మీడియాకి స్పెషల్ న్యూస్ అయ్యింది. ఒక జోగిని అమ్మాయిని కమిషనర్ అడాప్ట్ చేసుకొన్నారని న్యూస్ టెలికాస్ట్ చేశారు” చెప్పాడు.
“సారీ.. తను జోగిని కాదు” అన్నది రోహిణి.
“అఫ్కోర్స్! రెస్క్యూ హెూమ్స్ ఉన్నాయి కదా.. అక్కడ వదిలి రాలేకపోయావా?”.
“నేరుగా అక్కడికి పంపిస్తే ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి కదా! ఉండనీయండి మనతో కొద్దిరోజులు”.
“ఓకే మేడం! మీ మాట మేం ఎలా కాదనగలం?”.
కాసేపటికి.. హాసిని స్నానం చేసి వచ్చింది. డైనింగ్ టేబుల్ దగ్గర హాసినికి స్వయంగా వడ్డించింది
కమిషనర్.
“హాసినిని మంచి కాలేజీలో చేర్పించి, మంచి హాస్టల్లో అకామిడేషన్ ఏర్పాటు చేద్దాం” చెప్పాడు
రఘోత్తమ్.
“నాకు కిచెన్లో కాస్త జాగా ఇవ్వమ్మా చాలు. నేను ప్రైవేటుగా డిగ్రీ పూర్తి చేసుకుంటాను” అన్నది హాసిని.
“నిన్ను తెచ్చిందే కాలేజీలో చేర్పించడానికి.. కదా హాసినీ!” అన్నాడు రఘోత్తమ్.
హాసిని భయంగా చూసింది.
“వద్దమ్మా.. నన్ను జోగినీ పిల్ల అని ఎగతాళి చేస్తారు”.
“వాళ్లకు ఎవరు చెబుతారు? నువ్వు కూడా చెప్పకు”.
“మీరు నన్ను చదివించడానికి బాసర నుంచి తెచ్చినట్టు ఇప్పటికే మీడియాలో వచ్చింది కదమ్మా!”.
“భయపడకు హాసినీ.. కాలేజీలో ఎవరైనా టీజ్ చేస్తే, నాకు కాల్ చెయ్. జీవితంలో మళ్లీ వాడు రోడ్డుమీద నడవకుండా చేస్తాను” అన్నాడు రఘోత్తమ్.
“నాకోసం గొడవలెందుకు సార్?”.
“హాసినీ.. సొసైటీలో అందరితోపాటే నీకూ సమాన హక్కులు ఉన్నాయ్. నువ్విలా అధైర్యపడితే ఎలా?”.. ధైర్యం చెప్పింది రోహిణి.
డిన్నర్ తర్వాత తమ గదిలోకి వెళ్లారు భార్యాభర్తలు. గదిలో వాతావరణం గంభీరంగా ఉంది. బయట వర్షం వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. చల్లటి గాలి ముఖానికి తగలడంతో కిటికీ వేయడానికి వెళ్లిన రోహిణి.. కిటికీలోంచి బయటికి చూస్తూ అలాగే నిల్చుండి పోయింది.
“ఏంట్రా! అలా నిల్చుండిపోయావ్?” అడిగాడు రఘోత్తమ్.
“మావయ్యగారు గుర్తొస్తున్నారండీ”.
“నాన్నను నాకంటే నువ్వే ఎక్కువ గుర్తు చేసుకుంటావ్ రోహిణీ”.
“ఒక అనాథను తీర్చిదిద్ది.. తన కోడలిగా కూడా చేసుకున్నారు కదా!”.
“అమ్మానాన్న లేని వాళ్లందరూ అనాథలేనా? మనం భూమ్మీద కొచ్చినప్పటినుంచీ ప్రకృతి సదా మనకు తోడుగానే ఉంటుంది” చెప్పాడు రఘోత్తమ్.
“అమ్మెవరో తెలీదు. నాన్న ఎవరో తెలీదు. ఊహ తెలిసే నాటికే ఆశ్రమంలో ఉన్నాను. నెలకొకసారి మావయ్యగారు వచ్చేవాళ్లు. ‘నీ కేర్టేకర్ వీరేనమ్మా!’ అని పరిచయం చేసింది వార్డెన్. మావయ్యగారు మంచి బట్టలు, తినుబండారాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు. ‘నన్ను మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు కదా అంకుల్’ అని అడిగానోసారి.
‘నిన్ను ఇంత శ్రద్ధగా చూసుకొనేవాళ్లు ఎవరూ అక్కడ ఉండరమ్మా’ అని చెప్పారు.
మళ్లీ నేను అడగలేదు. డిగ్రీ పూర్తయ్యాక..
‘పీజీ చేస్తావా?’ అని అడిగారు.
‘మీ ఇష్టం!’ అన్నాను.
అప్పటికే నేను ఆశ్రమం నుంచి హాస్టల్కు షిఫ్ట్ అయ్యాను. అందరూ సెలవు రోజుల్లో సొంతిళ్లకు వెళ్తే.. నేను వెళ్లడానికి ఏ ఇల్లూ లేక హాస్టల్ గదిలోనే ఒక మూలన ముడుచుకొని కూర్చొనేదాన్ని. ఒకరోజు మావయ్యగారు వచ్చారు.
‘సివిల్స్ కోసం నిన్ను ఢిల్లీ పంపిస్తున్నాను’ అని చెప్పారు.
‘నేనా?’ అన్నాను ఆశ్చర్యపోతూ..
‘నేకేం! నీ స్టడీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. నీ టాలెంట్కు ‘సివిల్స్’ సాధించడం పెద్ద కష్టమేం కాదు’ అన్నారు.
ఆయన మాటలను కాదనలేదు. రెండేళ్ల తర్వాత సివిల్ సర్వీస్ సాధించాను. ఒక జిల్లాకు జాయింట్ కలెక్టర్ అయ్యాను. ఒకరోజు నా బంగ్లాకు వచ్చారు. ఆయన కాళ్లకు నేను ఎప్పట్లా నమస్కారం చేశాను. నా భుజాలు పట్టి పైకి లేపి..
‘నీకు పెళ్లి కళ వచ్చిందమ్మా!’ అన్నారు.
మీ ఫొటో చూపించి..
‘నాకొడుకు రఘోత్తమ్. ఐఐటీ కాన్పూర్లో ఎంటెక్ చేశాడు. నా ఆరోగ్యం సహకరించడం లేదని నా రాజకీయ వారసుడిగా వాణ్ని ఎన్నికల్లో నిలబెట్టాను. నిజానికి వారసత్వ రాజకీయాలు నాకు నచ్చవు. కానీ, నా కొడుకు అయితేనే గెలుస్తాడని పార్టీ పెద్దలు అనడంతో నేను మౌనం వహించక తప్పలేదు’ అని చెప్పారు.
ఫొటోలో చూడగానే మీరు నాకు నచ్చారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి, శాసనసభ్యులుగా ప్రజాజీవితంలో ఉన్న మిమ్మల్ని కాదనడానికి నాకు ఏ కారణం కనిపించలేదు. నాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన మావయ్యగారు.. నాకు దైవ సమానులు. ఆయన మాట కాదనడం నాకు సాధ్యం కాని పని. అలా మీరు నా జీవితంలోకి వచ్చారు. మావయ్య గారిని మించిన ప్రేమ మీరు నిరంతరం చూపుతూనే ఉన్నారు. ఏనాటిదో మన బంధం. కానీ, తరచూ నేను అనాథనని గుర్తుకొస్తూ ఉంటుంది. ఈరోజు హాసినిని చూస్తే.. నా గతం అంతా నా కళ్లముందు ఒకసారి కదలాడింది. తనకూ తండ్రెవరో తెలీదు.. నాకూ నా తండ్రి ఎవరో తెలీదు”.. చెప్పడం ఆపింది రోహిణి. ఆమె కళ్లలో కన్నీళ్లు. కదిలిపోయాడు రఘోత్తమ్.
“నువ్వు అనాథవి కాదు రోహిణీ? నీకు నేనున్నా” అన్నాడు. భర్త నుదుటిని ముద్దాడింది రోహిణి.
“హాసిని లాంటి వారికి మన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది..” అన్నాడు ఆమెను దగ్గరికి తీసుకుంటూ.
రోహిణి అతని గుండెలపై తల పెట్టింది.
“మావయ్యగారు తన ఆఖరి రోజుల్లో నా దగ్గర ఒక మాట తీసుకున్నారు”.
“ఏ విషయంలో?”.
“జోగిని వ్యవస్థను సమూలంగా తుడిచేయాలని ఆయనెప్పుడూ చెబుతుండేవారు. ‘ఒక సివిల్
సర్వెంట్గా వాళ్ల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి నువ్వు పని చేయాలి తల్లీ!’ అని చెప్పారు. అందుకే.. నేను ఏరి కోరి సోషల్ వెల్ఫేర్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రవ్యాప్తంగా వాళ్ల పునరావాసం కోసం పనిచేస్తున్నాను. ఇదే మావయ్య గారికి నేనిచ్చే నివాళి అని భావిస్తున్నాను. హాసిని లాంటి తండ్రిపేరు చెప్పుకోలేని అమ్మాయిలు, తండ్రెవరో తెలియని వాళ్లు.. ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నించాలి”.. అన్నది భావోద్వేగంతో.. “తప్పకుండా!” అన్నాడు రఘోత్తమ్.
రోహిణి నిద్రపట్టక అటు వైపు తిరిగి కదలాడుతుంటే.. రఘోత్తమ్ ఇటువైపు తిరిగి ఆలోచనలో పడ్డాడు. అతనికీ నిద్రపట్టడం లేదు. లేచి వెళ్లి కిటికీ దగ్గర నిల్చున్నాడు. చల్లటి జల్లు కురుస్తూనే ఉంది.
‘అనాథ అన్న ఫీలింగే రోహిణిని దహించి వేస్తున్నది. ఇంక తన జన్మరహస్యం తెలిస్తే.. ఇంకా ఎంత కుంగిపోతుందో!?’ అన్న ఆలోచన.. రఘోత్తమ్ను నలిబిలి చేస్తున్నది. ఒక్కసారిగా గతం కళ్లముందు కదలాడింది.
“ఏం మాట్లాడుతున్నారు మీరు?” అన్నది
కిరణ్మయి.
“వేరే ఎవర్ని చేసుకున్నా.. తన లైఫ్ చాలా డిస్ట్రబ్ అవుతుంది..” అంటూ ఆగాడు సర్వోత్తమ్ రావు.
“ఏదో దిక్కులేని పిల్లను దేశోద్ధారకుడిలా చదివిస్తున్నారంటే.. చూసీ చూడకుండా వదిలేశాను. ఇప్పుడు ‘ఇంటికి కోడలిగా తెస్తా’ అంటే, ఎలా ఊరుకుంటాను?”.. కిరణ్మయి హూంకరించింది.
“తను ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్. అనాథ కాదు”.
“నా కొడుక్కు ఏ ఆఫీసర్ అవసరం లేదు. జనం పేరుతో వాడి బంగారు భవిష్యత్ను నాశనం చేసి, రాజకీయాల్లోకి దింపారు. ఇప్పుడు వాడి వ్యక్తిగత జీవితం కూడా నాశనం చేస్తారా?”.
కిరణ్మయి తన మాట వినేలా లేదని అతనికి అర్థమైంది. తీవ్రమైన మానసిక వ్యధతో.. సర్వోత్తమ్ రావుకు గుండెపోటు వచ్చింది. డాక్టర్లు ఆపరేషన్ అవసరం అన్నారు. ఆపరేషన్కు వెళ్లేముందు కొడుకును పిలిచాడు. ఒక నిమిషం ఇద్దరి మధ్య మౌనం నడిచింది.
“ఏంటి నాన్నా! ఇంత మథన పడుతున్నారు?”
అడిగాడు రఘోత్తమ్.
“రోహిణిని పెళ్లి చేసుకోరా!”.
“అమ్మా, మీరూ మాట్లాడుకోవడం నేను విన్నాను నాన్నా. నాలాంటి పొలిటీషియన్ని పెళ్లి చేసుకోవడానికి తనే ఆలోచించాలి”.
“నీకేం రా.. నువ్వు బంగారానివి”.
“ముందు మీరు ఆపరేషన్కు వెళ్లి రండి నాన్నా”.
“ఆ ఆపరేషన్ టేబుల్పైనే ప్రాణాలు పోయినవాళ్లు చాలామంది ఉన్నారు. నాకు మాటివ్వు..” అంటూ చెయ్యి చాపాడు సర్వోత్తమ్ రావు.
“మీరు తనకు చారిటీ చేశారని తెలుసు నాన్నా! బట్.. నౌ షీ ఈజ్ యాన్ ఆఫీసర్. బలవంతంగా మన నిర్ణయాలు అవతలి వాళ్లపై రుద్దకూడదు కదా నాన్నా!?”.
కొడుకు వైపు అదోలా చూశాడు.
“తనకు అభ్యంతరం లేకపోతే నేను సంతోషంగా చేసుకుంటాను నాన్నా! కానీ, నాదో సందేహం”.. అంటూ ఆగాడు రఘోత్తమ్.
‘ఏంట్రా?’ అన్నట్టు చూశాడు తండ్రి.
“తను ఇప్పుడు పెద్ద ఆఫీసర్. ఆమె కులాన్ని, మతాన్ని చూడకుండా ఎవరైనా చేసుకుంటారు. అలాంటిది.. మన ఇంటికి కోడలుగా రావాలని ఎందుకు పట్టుబడుతున్నారో తెలుసుకోవచ్చా?” అడిగాడు.
ఒక నిమిషం తటపటాయించాడు సర్వోత్తమ్ రావు.
“తన గురించి ఒక రహస్యం నాకు మాత్రమే తెలుసురా! అది ఏ రోజైనా ఒక ప్రశ్నగా మారొచ్చు. ఏ మార్గంలోనైనా బయటికి వస్తే.. ఈ పురుషాధిక్య సమాజంలో తన వివాహ జీవితం దెబ్బతింటుందని నేను భయపడుతున్నాను” చెప్పాడు సర్వోత్తమ్ రావు.
ఆసక్తిగా తండ్రి ముఖంలోకి చూస్తూ..
“ఏంటి నాన్నా.. ఆ రహస్యం?” అడిగాడు
రఘోత్తమ్.
కొడుకు కళ్లలోకి చూస్తూ..
“మీ నాన్న ఇంతకాలం బయట తిరుగుతున్నాడంటే.. అది రోహిణి తల్లి దయేరా” అన్నాడు.
ఇంకా ఆశ్చర్యపోయాడు రఘోత్తమ్.
“అవును రా! ఆ రోజు నేనే స్వయంగా జీపు నడుపుకొంటూ ఓ గూడేనికి వెళ్లాను. తిరిగి వెనక్కి వచ్చే సమయానికి చీకటిపడింది. జీపు లైట్లు కూడా సరిగ్గా వెలగడం లేదు. ఊరి పొలిమేర దాటగానే.. గడ్డిమోపు నెత్తిన పెట్టుకొని ఒక మహిళ రోడ్డు పైకి వచ్చింది. నేను ఆమెను గమనించలేదు. జీపు తగిలి కిందపడి తీవ్రంగా గాయపడింది. తను నిండు గర్భిణి. నా ముఖంలో కంగారు చూసి.. ‘మీరు కావాలని నాకు బండి తాకించలేదు కదా దొరా! ఈ దెబ్బలతో నన్ను గూడెంలోకి తీసుకెళ్తే.. మావాళ్లు కోపంలో మిమ్మల్ని కొట్టి చంపినా ఆశ్చర్యంలేదు. నన్ను బేగిన దవాఖానకు తీసుకెళ్లండి దొరా!’ అని వేడుకుంది. వెన్నులో చలీ, జ్వరం మొదలైంది. ఎలాగోలా హాస్పిటల్కు తీసుకెళ్లేసరికి రక్తం చాలాపోయింది. ఎవరో ఒకర్నే బతికించే అవకాశం ఉందని చెప్పారు డాక్టర్లు. కొన ఊపిరితో ఉన్న ఆమెకు విషయం చెప్పాను. ‘నన్ను బతికించక పోయినా సరే.. నా బిడ్డను మాత్రం బతికించండి’ అని వేడుకుంది. యాక్సిడెంట్ కేసు కావడంతో హాస్పిటల్ సిబ్బంది ఇచ్చిన కంప్లయింట్తో
అప్పటికే పోలీసులు వచ్చారు. ఆ నిమిషం.. నా వల్లే ప్రమాదం జరిగిందని తను చెప్పి ఉంటే, జైల్లోకెళ్లి ఊచలు లెక్కపెట్టుకొనే వాణ్ని. ఎవరో రోడ్డుమీద బండితో గుద్దేసి పోతే.. నేనే కాపాడి తీసుకొచ్చి, దవాఖానలో చేర్చానని చెప్పింది. తన పేరు, ఊరు.. ఏ వివరాలు కూడా చెప్పలేదు. ఆపరేషన్ థియేటర్లోకి పోయే కాసేపటి ముందు..
‘మీ ఆయన పేరు చెప్పమ్మా! నీకేమైనా అయితే నీ బిడ్డను తండ్రి దగ్గరికి చేరుస్తా’ అన్నాను.
ఇప్పటి వరకూ ఆమె జన్మరహస్యం ఎవరికీ చెప్పలేదు. రోహిణికి చెబితే తల్లిని యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తిగా.. నన్ను అసహ్యించుకుంటుందేమోనని భయం. పైగా విషయం మన ప్రత్యర్థులకు చేరితే.. రాజకీయ జీవితం సమాధి అవుతుందేమోనని మరో భయం.
కళ్లలో ఊపిరి నిలుపుకొన్న ఆమె ఎగశ్వాసతో..
‘మా బిడ్డలకు తండ్రులెవరో మాకే తెలియదు దొరా! మావి ఊరుమ్మడి బతుకులు.. నేను జోగినిని’ అన్నది.
షాక్ అయ్యాను.
‘నా బిడ్డను మళ్లీ మా గూడానికి చేర్చమాకు దొరా! ఆడపిల్ల పుడితే దాన్ని కూడా మావాళ్లు జోగినిగా మారుస్తారు. ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి పుణ్యం కట్టుకోండి’ అని నా చేతులు పట్టుకుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిన ఆమె.. మళ్లీ బయటికి రాలేదు”..
సర్వోత్తమ్ కళ్లలో నీళ్లు..
“ఆ బిడ్డను ఇంటికి తీసుకు రావడానికి మీ అమ్మ ఒప్పుకోదని తెలుసు. పైగా లేనిపోని అభాండాలు వేస్తుంది. నెత్తుటిగుడ్డుని హాస్పిటల్లోనే ఉంచి.. ఆమె శవాన్ని పోలీసుల సాయంతో ఖననం చేయించాను. నాకు తెలిసిన ఆశ్రమంలో పసికందును చేర్చాను. ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను దహించి వేస్తూనే ఉంది. ఇప్పటి వరకూ ఆమె జన్మరహస్యం ఎవరికీ చెప్పలేదు. రోహిణికి చెబితే తల్లిని యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తిగా.. నన్ను అసహ్యించుకుంటుందేమోనని భయం. పైగా విషయం మన ప్రత్యర్థులకు చేరితే.. రాజకీయ జీవితం సమాధి అవుతుందేమోనని మరో భయం. మనం రోహిణికీ, ఆమె తల్లికీ రుణపడి ఉన్నాం నాయనా! ఈ విషయాలేవీ మీ అమ్మకు తెలియవు. ఒక దుర్మార్గ పూరిత వ్యవస్థకు రోహిణి తల్లి బలైంది. మన వల్లే రోహిణి అనాథగా మారింది. తను తెలివైన అమ్మాయి మాత్రమే కాదు. ఉన్నత సంస్కారవంతురాలు. మనం అండగా ఉండాలి. మన ఇంటి కోడలిగా చేసుకుని కాపాడుకోవాలి!”..
చెప్పడం ఆపాడు సర్వోత్తమ్ రావు. అప్రయత్నంగా తండ్రి చేతిలో చేయి వేశాడు రఘోత్తమ్.
“ఏంటీ అక్కడ నిల్చొన్నారు?”.. రోహిణి మాటలతో గతంలోంచి బయటపడ్డాడు రఘోత్తమ్.
వెనక్కి తిరిగి, ఆమె ముఖంలోకి చూస్తూ..
“ఎందుకో నిద్ర పట్టలేదు రోహిణీ!” అన్నాడు.
“హాసిని గురించి ఆలోచిస్తున్నారా?” అడిగింది.
“అవును. తనను కూడా నీకులానే మంచి ఆఫీసర్ని చేయాలి” అన్నాడు స్థిర సంకల్పంతో.
“మిమ్మల్ని చూస్తుంటే మావయ్యే గుర్తొస్తున్నారు”.. అంటున్న రోహిణి ఐఏఎస్ పెదవులపై.. సంతోషంతో కూడుకున్న చిరునవ్వు మొలిచింది.
మరుసటి రోజు.. హాసినిని దత్తత తీసుకుంటున్నట్టు మీడియాలో ప్రకటించాడు రఘోత్తమ్.
తటవర్తి నాగేశ్వరి
తటవర్తి నాగేశ్వరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా గౌరవరం. ఎంఏ (తెలుగు) చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్లో మేనేజర్గా పదవీ విరమణ పొందారు. 2012 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ.. ‘తదనంతరం’ ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వీక్లీలో ప్రచురితమైంది. ‘దాడి’ కథ.. రమ్యభారతి సాహిత్య మాస పత్రిక నిర్వహించిన కథల పోటీలో బహుమతి దక్కించుకున్నది. శ్రీకళ్లేపల్లి వెంకటశాస్త్రి శత జయంతి పురస్కార కథల పోటీలో ‘నవ్వు నవ్వించు’ కథకు బహుమతి అందుకున్నారు. మొదటి నవల ‘మమజీవన హేతునా’.. ‘స్వాతి’ మాస పత్రికలో అనుబంధ నవలగా ప్రచురితమైంది. ‘నవ్య’ వీక్లీ, ‘తురగా’ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన పోటీలో ‘కల్కి’ సీరియల్కు తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వివిధ పత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీల్లో సంధ్యారాగం, సత్యభామ, గురి, అమ్మరుణం, అమ్మకోసం తదితర కథలకు బహుమతులు అందుకున్నారు.
తటవర్తి నాగేశ్వరి
99897 73549