Kasi Majili Kathalu | జరిగిన కథ : పితృదత్తకు కలలో కనిపించిన నాగరాజు వల్ల ఒక కుమారుడు కలిగాడు. ఆమె పెళ్లికాకముందే గర్భవతి కావడంతో.. అన్నలిద్దరూ ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయారు. కాళిదాసు వల్ల జరిగిన సంగతి తెలుసుకున్న భోజరాజు ఆమెను ఆదరించాడు. కానీ, ఆయన కొలువులోని నలుగురు ఉద్యోగులు ఒంటరిగా ఉన్న పితృదత్తపై కన్నువేశారు.
శుక్రవారం ఎప్పుడు వస్తుందోనని వాళ్లు నలుగురూ వెయ్యికళ్లతో ఎదురు చూడసాగారు. ఆరోజు రానేవచ్చింది. తెల్లవారగానే గడ్డాలు గీయించుకుని, మీసాలు దిద్దించుకున్నారు. అభ్యంగన స్నానాలు చేసి, చీకటి ఎప్పుడు పడుతుందోనని ఆత్రుత పడసాగారు. ఉన్నట్టుండి ఉదయం పదిగంటల వేళ.. వెంటనే రావాల్సిందని నలుగురికీ ఒక్కమారే భోజరాజు నుంచి వర్తమానం వచ్చింది.
తప్పనిసరై.. వెళ్లారు. వాళ్ల ముఖాలు చూస్తూనే.. “ఏమయ్యా! నేడు ఏకాదశి అని ఎరగరా? పర్వదినాన క్షౌరం చేయించుకోవచ్చునా?!” అని చివాట్లు పెట్టాడు భోజరాజు.
పురోహితుడు గడగడలాడుతూ.. “దేవా! నేడు పర్వదినమని ఎరగను. పంచాంగం చూడలేదు. తమరు సెలవిచ్చి పంపిస్తే, వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను” అన్నాడు.మిగిలిన ముగ్గురూ కూడా రాజుకు ఏదో చెప్పబోయారు. కానీ, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా..
“నేడు రంగగిరిలో రంగనాథస్వామి రథోత్సవం జరగబోతున్నది. మీరు నలుగురూ ప్రభుత్వం పక్షాన వార్షికం తీసుకుపోయి, స్వామికి అర్పించి రేపు సాయంత్రానికి తిరిగి రండి. మీకదే సరైన ప్రాయశ్చిత్తం. పొండి” అని పలికి, లోపలికి వెళ్లిపోయాడు.
ఆ మాట విని నలుగురికీ గుండెలు జారిపోయాయి. అక్కడే చతికిలపడి పోయారు. అందరి ముఖాలూ ఒక్కరీతిగానే వాడిపోయాయి. ఒకరి రహస్యం వేరొకరితో చెప్పుకోలేరు. తేలుకుట్టిన దొంగల్లా లోలోపలే బాధపడుతూ చాలాసేపు కూర్చుండిపోయారు.
చివరికి పురోహితుడు ముందుగా పెగల్చుకుని.. “అమాత్యపుత్రా! నువ్వు నాకు చిరకాల మిత్రుడివి. నాకో ఉపకారం చేసిపెట్టాలి. ఎరగక క్షౌరం చేయించుకున్న పాపానికి నేడంతా కటిక ఉపవాసం చేసి.. ప్రాయశ్చిత్త మంత్రాలు వల్లె వేసుకుంటాను. ఇందాక రాజుగారి ఎదుట నోరు విప్పి చెప్పలేకపోయాను. నేను ఈవేళ ఎక్కడికీ రాలేను. అందుచేత మీరు ముగ్గురూ బయల్దేరి వెళ్లండి. స్వామివారికి వార్షికం చెల్లించండి. నేను రేపు ధూపోత్సవం సమయానికి మిమ్మల్ని కలుసుకుంటాను” అన్నాడు.
అందుకు మంత్రిపుత్రుడు బెంబేలుపడుతూ..
“గురునందనా! నేను కూడా ఆమాటే నీతో చెప్పాలని అనుకుంటున్నాను. నా బదులుగా మీరు ముగ్గురూ వెళ్లొస్తే.. మీకు ఒక్కోళ్లకూ నూటపదార్లు ఇచ్చుకుంటాను” అన్నాడు.
“అయ్యబాబోయ్! నా వల్ల కాదు. పోనీ.. మన దండనాథుడు, గణకుడు వెళ్తారులే!” అని వాళ్లవైపు సాభిప్రాయంగా చూశాడు పురోహితుడు.
“అయ్యా! ఈవేళ రాత్రి మూడుజాముల వరకు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఆ తరువాత అయితే నేను వెళ్లగలను” అని చెప్పాడు దండనాథుడు.
“నేనైతే నాలుగుజాముల రాత్రి వరకు వెళ్లలేను మరి..” అన్నాడు గణకుడు.
“ఎలాగయ్యా మరి. నేను కనీసం ఒకటో జాము వరకైనా జాగారం చేసి తీరాలి!” విచారం వ్యక్తం చేశాడు పురోహితుడు.
“గురునందనా! ఆ జాగారం ఏదో రంగగిరిలోనే చేయకూడదా?! నేను రెండో జాముకల్లా బయల్దేరి మిమ్మల్ని కలుసుకుంటాను” అని నచ్చచెప్పబోయాడు మంత్రిపుత్రుడు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ఆనాడు పితృదత్తను దారిలో ఆటంకపరిస్తే, నలుగురినీ శుక్రవారమే రమ్మని చెప్పిందామె. కానీ ఒక్కొక్కరినీ ఒక్కొక్క జాములో రమ్మన్నది. వాళ్లు ఆ లెక్కలే మిగిలిన వాళ్లతో చెప్పారు కానీ, అసలు సంగతి మాత్రం విడమరిచి చెప్పుకోలేదు.
చివరికి నలుగురూ బాగా ఆలోచించుకుని, వార్షిక ధనాన్ని ఒక సేవకుడికి ఇచ్చి పంపారు. ఆ సేవకుడి చేతికి రాజపత్రాన్ని, వేరొక ఉత్తరాన్ని కూడా ఇచ్చారు. ఉత్తరంలో వివరాల ప్రకారం వార్షిక ధనం ముట్టినట్లుగా ఆలయ ప్రధానార్చకుడు సంతకం చేసి, ముద్ర వేసి పంపాలి. తాము ధూపోత్సవం సమయానికి రంగగిరికి వచ్చి మిగతా కార్యక్రమాలు చక్కపెడతారు.
ఈ రాజపత్రం తమకంటే ముందుగా భోజరాజుకు చేరిపోతే తమ విధులు సరిగ్గా నెరవేర్చినట్లు అవుతుంది. ఈ రాత్రికి తాము నిర్ణయించుకున్న కార్యక్రమమూ సజావుగా సాగిపోతుంది. అటువంటి ఏర్పాటు చేసుకున్న తరువాత నలుగురూ ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
రాత్రి మొదటిజాములోనే పురోహితుడు పితృదత్త ఇంటి తలుపు తట్టాడు. ఇద్దరు పరిచారికలు తలుపు తీశారు. వాళ్లను చూసి అతగాడు కొంచెం మొహమాట పడుతుంటే..
“అయ్యా! మిమ్మల్ని సిద్ధం చేయాలి. ముందుగా మీకు పీడ తొలగడానికి తలంటాలి. మీరిలా ఈ గదిలోకి వస్తే నలుగుపెట్టి తలంటుతాం” అని చెప్పారు.“ఇప్పుడెందుకు ఇవన్నీ. నేను ఇంటివద్ద స్నానం చేసే వచ్చాను” అన్నాడు పురోహితుడు.
“ఇది పితృదత్త కోరిక. మీరు కాదనకూడదు” అంటూ అతణ్ని లోనికి తీసుకువెళ్లారు.
స్నానాలగదిలో అంతా చీకటిగా ఉంది. బుడ్డిదీపం కూడా లేదు. కట్టుబట్టలు విడిచి, గోచీ పెట్టుకోమని పురోహితునికి సూచించారు పరిచారికలు.
అతనికి తలంటే నెపంతో.. ఎడ్లబండి చక్రానికి పూసే కందెనను ఒంటికి బాగా పట్టించారు. జిడ్డు తగలగానే ఆ శృంగార పురుషుడికి ఏదో అనుమానం తోచింది కానీ, మైకంలో పట్టించుకోలేదు. ఒకటోజాము పూర్తికావస్తుండగా తలుపు దబదబమని బాదిన చప్పుడైంది.
“అమ్మయ్యో! అగ్నిమిత్రులవారు వచ్చినట్లున్నారు. ఈ ముసలాయనకు రోజురోజుకూ చాదస్తం పెరిగిపోతున్నది. కుశలం కనుక్కోవడానికి ఇంతరాత్రివేళ రావడం ఎందుకు?!” అని నసిగిందొక పరిచారిక.
“ఇప్పుడేమిటి చెయ్యడం?! వెళ్లి తలుపు తీయండి” అన్నాడు పురోహితుడు.
“తీయొచ్చు కానీ, ఆయనకు అనుమానం జాస్తి. ఇల్లంతా తిరిగి చూసి, అంతా సరిగ్గా ఉందని నమ్మకం కలిగేదాకా ఇక్కణ్నుంచి కదలడు” అని చెప్పింది మరొక పరిచారిక.
“ఓరి నాయనో! ఏదో గుట్టుగా సాగించుకుందాం అంటే.. మొదటిరోజే నలుగురి నోళ్లలో నానిపోయేలా ఉన్నానే! ఆ అగ్నిమిత్రుడికి తెలిస్తే నాకీ ఊళ్లో నీళ్లు నిప్పులు పుట్టవు. అసలు అపశుకునాలు ఎదురైనప్పుడే బయల్దేరి రాకుండా ఉండాల్సింది” అని విచారించ సాగాడు పురోహితుడు.
“ఒక పనిచెయ్యండి. మీరిందులో దాక్కోండి. ఆయన వెళ్లగానే మిమ్మల్ని బయటికి తీస్తాను” అని చెప్పి, అక్కడే ఉన్న విడిచిన బట్టలు దాచుకునే చెక్కపెట్టెలోని ఒక అరలోకి దించారు పరిచారికలు. పైన తాళం వేశారు.
మంత్రిపుత్రుడు రానే వచ్చాడు. యథాప్రకారం మూడోజాము దాకా ఒంటికి నలుగుపెట్టే ప్రక్రియ కొనసాగింది. మళ్లీ తలుపు చప్పుడు కాగానే అతణ్ని కూడా భయపెట్టి.. ఆ చెక్కమందసానికి ఉన్న మరో అరలో అతగాణ్ని తోసి, తాళం పెట్టారు. ఇలా వరుసగా నాలుగో జాము పూర్తయ్యేసరికి నలుగురూ ఒంటికి ‘బండి కందెన’ను నలుగు పెట్టించుకుని, మందసంలో ఇరుక్కుపోయారు. తెల్లవారగానే అగ్నిమిత్రుడికి కబురు వెళ్లింది. జరిగిన సంగతినంతా ఆయనకు చెప్పింది పితృదత్త. అగ్నిమిత్రుడు బాగా ఆలోచించి, ఆ మందసాన్ని కూలీల చేత మోయించుకుంటూ భోజరాజు ఆస్థానానికి వెళ్లాడు.
“నిన్నరాత్రి మా పితృదత్త ఇంట్లో నాలుగు భూతాలు చేరాయి ప్రభూ! వాటినామె తెలివిగా ఒక మందసంలో ఇరికించింది. మీ సెలవైతే ఆ మందసాన్ని మీముందు ఉంచగలను. తమరే ఎలాగైనా వాటినుంచి మమ్మల్ని రక్షించాలి” అని విన్నవించాడు.
భోజరాజు ఆ మాటకు నవ్వి..
“భూతాలను వదిలించడానికి నేనెందుకయ్యా!? ఎవరైనా మాంత్రికుడి దగ్గరికి వెళ్లలేకపోయారా!?” అన్నాడు.
అందుకు అగ్నిమిత్రుడు.. “చూడబోతే అల్లాటప్పా భూతాలలాగా కనిపించడం లేదు ప్రభూ. చాలా పెద్ద ఎత్తున బలులు అవీ ఇవ్వాలేమో..” అని సందిగ్ధంగా ఆపాడు.
“ఏదీ లోపలికి తెప్పించు” అన్నాడు భోజరాజు. మందసం లోపలికి వచ్చింది. అది విడిచిన బట్టలు ఉంచుకునే చెక్కపెట్టె కనుక, చూడటానికి ఒక బోనులాగా ఉంది. అన్నివైపులా చెక్కబద్దీలు నిలువుగా నిలబెట్టి ఉన్నాయి. ఆ ఖాళీలలోనుంచి అందులో ఉన్నవాళ్లు కనిపిస్తున్నారు.
ఒంటినిండా కందెన పట్టించడం వల్ల వాళ్లనెవరూ గుర్తించలేకపోయారు. చూడగానే అందులో ఉన్నవి కోతులని కొందరు, కాదు భూతాలని మరికొందరు.. పిశాచాలేమో అని ఇంకొందరు వాళ్లలో వాళ్లు తర్కించుకోసాగారు. ఆ వాదనలు ఎంతకూ తెగలేదు.
చివరికి కొన్ని బలిక్రియలు నిర్వహించిన తరువాత, పెట్టె తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు. ఒంటిమీద గోచిగుడ్డలతో.. మసి నలుగులతో నలుగురు దోషులూ బయటికి వచ్చారు. భోజరాజు కాళ్లమీద పడ్డారు.
“న్యాయంగా అయితే మీకు మరణదండన విధించాలి. కానీ, మీ కుటుంబాలు వంశపారంపర్యంగా మమ్మల్ని సేవిస్తున్నాయి. మీ మీద క్రోధం కంటే.. మీ తండ్రులు మాకు చేసిన సేవ ఇప్పుడు ఈ క్షణంలో నా కళ్లముందు కదలాడుతున్న కారణంగా.. మిమ్మల్ని ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నాను. ఇక మీదట మీలో ఎవరైనా మా కంటబడితే.. వెంటనే పది కొరడా దెబ్బలు శిక్ష పడుతుంది. మా రాజ్యంలో ఎవరైనా మీకు ఉద్యోగాలిస్తే వారికి కూడా ఇదే వర్తిస్తుంది” అని కఠినంగా పలికి, లోపలికి వెళ్లిపోయాడు భోజరాజు.
నిజానికది సరైన శిక్ష కాదు. ఎటువంటి వారైనా సరే, జాలి తలిచి విడిచిపెట్టకుండా కనీసం వాళ్లను చెరసాలలో అయినా పెట్టి ఉండవలసింది. కానీ, స్వేచ్ఛగా వదిలేయడం వల్ల ఆ నలుగురూ తనమీద కక్షపెంచుకుంటారనే అనుమానం పితృదత్తకు కలిగింది. తన గురించి కంటే కొడుకు క్షేమం గురించి ఆమె ఎక్కువ బెంగ పడసాగింది.
పితృదత్త తన కొడుక్కు ‘ఫణిదత్తుడు’ అని పేరు పెట్టుకుంది. పదేళ్లలోపు వయసువాడే అయినా.. కాస్త కండపుష్టి కలవాడు. అభినవ భీముడని అందరూ పిలుస్తుండేవారు. ఉపాధ్యాయులు వాడికి సాధారణ విద్యతోపాటు సాముగరిడీలు చేసేవారు నేర్చే విద్యలైన లంఘనం, తాండవం, సంకోచనం, విస్తృతం.. వంటి వాటిలో శిక్షణ ఇస్తుండేవారు.
ఎంతటివాడైనా తల్లికి మాత్రం కొడుకే కదా!?
‘బడికి వచ్చిపోయే దోవల్లో దారికాచి కొడితే ఎవరు దిక్కు?! నాకు ఈ ఊరిలో అగ్నిమిత్రుడు తప్ప వేరే దిక్కు లేదు. పాపం ఆయన కూడా నాకోసమే ఊరివారితో గొడవలు పడుతున్నాడు. ఇప్పుడేమో నిప్పు చెంగున మూటగట్టుకున్నట్లు ఈ నలుగురితో విరోధం వచ్చిపడింది. ఇటువంటి స్థితిలో ఈ ఊరిలో ఉండటం మంచిది కాదు’ అని మనసులో తలపోసింది.
భోజరాజు పాలించే ధారానగరానికి ఈశాన్యంగా నూరు యోజనాల దూరంలో పాటలీపుత్రం ఉంది. ఒకనాడు తాను దాచుకున్న సొమ్ముతో పాటుగా, మరికొన్ని అత్యవసరమైన దినుసులు మూట కట్టుకుని.. కొడుకుతోసహా ఎవరికీ చెప్పకుండా ధారానగరాన్ని విడిచిపెట్టింది పితృదత్త.
“అమ్మా! మనం ఎక్కడికి పోతున్నాం?! నా చదువు పోతుంది కదే! ఉపాధ్యాయులతో చెప్పి రాలేదు. మళ్లీ తిరిగి వస్తే నన్ను చేర్చుకుంటారో లేదో” అన్నాడు ఫణిదత్తుడు సందేహిస్తూ.
“నాయనా! ఇప్పుడు మనం వెళ్లే పాటలీపుత్రంలో నా మేనమామలు ఉన్నారు. ఇకనుంచి మనం వారింట్లోనే ఉంటాం. నువ్వక్కడే చదువుకోవచ్చు” అని జవాబిచ్చింది పితృదత్త.
“అయితే మనం పాటలీపుత్రం ఎప్పటికి వెళతాం” అని అడిగాడు ఫణిదత్తుడు.
“బహుశా రెండునెలలు పడుతుందేమో” అని సమాధానం ఇచ్చింది తల్లి.వారి వెంట మూటలు మోయడానికి ఒక కూలివాడు ఉన్నాడు. అరణ్యమార్గాల గుండా ప్రయాణిస్తూ ఒకచోట వారు వంట చేసుకోవడానికి ఆగారు. పితృదత్త వంట చేస్తుండగా, పిల్లవాడు కాస్త దూరంగా ఆడుకుంటున్నాడు.
ఆ సమయం కనిపెట్టి, కొన్ని మూటలెత్తుకుని.. కూలివాడు పారిపోయాడు. పితృదత్త కేకలు పెట్టింది. ఫణి దత్తుడు వాణ్ని వెంబడించాడు.కొంతదూరం పోయిన తరువాత ఒకచోట పట్టుకున్నాడు. ఫణిదత్తుడు చిన్నవాడు కావడంతో కూలివాడు నిర్లక్ష్యంగా మాట్లాడసాగాడు. ఇంతలో ఆ దారిలో ముప్పై అయిదేళ్ల వయసులో ఉన్న బ్రాహ్మణుడొకడు వచ్చాడు.
ఆ కూలివాణ్ని గద్దించి, మూటలు విడిపించాడు. ఫణిదత్తుడితోపాటు వాటిని తీసుకుని, పితృదత్త వద్దకు వచ్చాడు. తన పేరు కామందకుడని, తాను కూడా పాటలీపుత్రమే వెళ్తున్నానని పితృదత్తకు ధైర్యం చెప్పాడు. వారితో పాటే ప్రయాణించసాగాడు.
(వచ్చేవారం.. గల్లంతైన ఫణిదత్తుడు)
అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ