Kasi Majili Kathalu Episode 86 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ‘కాశీమజిలీలు వట్టి కథలు కావు. వేదశాస్త్ర పురాణాలతో కూడిన భారతీయ విద్యా ప్రపంచంలో.. శ్రేష్ఠమూ, శాశ్వత స్మరణీయమూ అయిన వస్తువులనే కథారూపంగా మధిర సుబ్బన్నదీక్షిత కవి వీటిలో పొందుపరిచారు’ అని పండితుల అభిప్రాయం. ప్రస్తుతం మీరు చదవబోయేది పన్నెండు భాగాల కాశీమజిలీ కథల్లో.. పదకొండో సంపుటిలోనిది.
ధారానగరాన్ని భోజరాజు పాలిస్తున్న కాలంలో.. ఆ నగరంలోనే అగ్నిశిఖుడనే చాదస్తపు వేదపండితుడు ఉండేవాడు. అతను పూర్వాచారాలను ఆదరిస్తూ, కొత్త అలవాట్లను నిరసిస్తూ ఉండేవాడు. ఇతరులను యాచించకుండా ఉన్నంతలోనే కాలక్షేపం చేస్తుండేవాడు. భోజరాజు పండితులకు లక్షలకొద్దీ బహుమతులిస్తాడని తెలిసినా.. తన దరిద్రమే తనకు చాలనుకునేవాడు.నిత్యకర్మలు లోపం లేకుండా చేస్తుండేవాడు. అధ్యయనమే కాకుండా తన వద్దకు వచ్చిన శిష్యులకు వేదం బోధిస్తుండేవాడు. ఎవరి ఇంటికీ భోజనానికి వెళ్లేవాడు కాదు. అరుగు విడిచి ఎన్నడూ పొరుగింటికి వెళ్లి ఎరుగడు. అతని భార్యపేరు దేవదత్త.
ఒకనాడు ఆమె తమ శిష్యుడినొకణ్ని పిలిచి.. “అబ్బాయీ! మీ గురువుగారి చాదస్తం రోజురోజుకూ పెరిగిపోతున్నది. నాలుగురోజుల్లో మా మామగారి ఆబ్దికం రాబోతున్నది. ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రకారం భోక్తలు దొరకడం లేదని.. చాలాకాలంగా మీ గురువుగారు తండ్రిగారికి చటక శ్రాద్ధమే తప్ప.. యథావిధిగా చేయడమే లేదు. పితృదేవతల అనుగ్రహం లేకపోవడం వల్లనే మాకు సంతానం కూడా కలగడం లేదు. అందుచేత ఈసారైనా మీ గురువుగారి పట్టుమాన్పించి ఏదో ఒకవిధంగా తద్దినం పెట్టేలా చూడు” అని బోధించింది.
ఆ శిష్యుడు అగ్నిశిఖుని వద్దకు వెళ్లి.. “గురుదేవా! మీరు ప్రయత్నిస్తే ఈ ఊరిలో మంచి భోక్తయే లభించడా?! తండ్రిగారి ఆబ్దికం నెరవేర్చకుండా ఎంతకాలం ఆగుతారు?” అని ప్రశ్నించాడు. అందుకు అగ్నిశిఖుడు.. “కౌశికా! నాకైతే ఈ ఊరిలో అర్చించదగిన భోక్తలు లభించడం లేదు. నీ ఎరుకలో ఉంటే చెప్పు” అన్నాడు. “గురువుగారూ! ఆబ్దికానికి ఎటువంటి భోక్తలు కావాలో చెప్పండి?” అని అడిగాడు.
“రోగులను భోజనానికి పిలవకూడదు. వాళ్లకు మనం పెట్టిన అన్నం విషం కావచ్చు కనుక. వికలాంగులను పిలిచి కష్టపెట్టకూడదు. అయితే, ఈ ఊరిలో ఉన్నవారిలో దుర్జనులు, కృతఘ్నులు కానివారెవరూ కనిపించడం లేదు. అందరిలోనూ ఏదో ఒక లోపం ఉండనే ఉంటున్నది. భోక్తలుగా రావాలంటే.. తొలిగా జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి. ఆ తరువాత తాను నివసిస్తున్న సంఘక్షేమాన్ని కోరుకోవాలి. చిట్టచివరిగా వ్యక్తి ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. ఈ మూడురకాలుగా బతకు గడపడాన్నే ‘త్రిణాచికేత యజ్ఞం’ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దీనికి వైదిక ప్రక్రియలు కూడా ఉన్నాయి. వాటిని చేసినవాడు, వేదాంగాలు తెలిసినవాడు, అధ్యయనపరుడు, వేదార్థం ఎరిగి ఇతరులకు చెప్పగలిగేవాడు, బ్రహ్మచారి, యజ్ఞవేత్త, సత్యం పలికేవాడు, కళంకం లేని ప్రఖ్యాతమైన వంశంలో పుట్టినవారు.. ఇటువంటివారు ఏడుగురు కానీ, ఐదుగురు లేదా చివరికి ఇద్దరినైనా భోక్తలుగా నియమిస్తే పితృదేవతలు ఆనందిస్తారని శాస్ర్తాలు బోధించాయి. అటువంటివారు ఈ భరతభూమిలో నేటికీ అడుగడుగునా ఉన్నారని కొందరు చెబుతుంటారు. కానీ, మన దురదృష్టం కాకపోతే మన ఊరిలో అటువంటివాడే లేడేమిటో?!” అన్నాడు అగ్నిశిఖుడు బెంగగా.
“నాకొక రెండురోజులు గడువివ్వండి గురువుగారూ! ఎవరైనా దొరుకుతారేమో చూసి వస్తాను” అంటూ కౌశికుడు వెళ్లిపోయాడు. చాలా ప్రయత్నించాడు. కానీ, గురువు విధించిన నియమాల ప్రకారం ఎవరూ లభించలేదు. మూడోరోజున మధ్యాహ్నం తిరిగివచ్చి.. “గురువుగారూ! సాధారణ ప్రజలలో మీరు చెప్పిన విధంగా బతుకుతున్నవాళ్లు ఒక్కళ్లూ కనిపించలేదు. అయితే నిన్ననే మన శివాలయానికి ఒక యతి వచ్చారట. ఆయన పేరు జ్ఞానతీర్థులని, చాలా మహిమ కలవారని విన్నాను. ఈసారి వారిని అర్చిస్తారా?” అని అడిగాడు. అందుకు గురువు సంతోషించి..
“వెంటనే బయల్దేరుదాం పద” అన్నాడు.ఇద్దరూ శివాలయానికి వెళ్లారు. జ్ఞానతీర్థులకు నమస్కరించారు. “మీ ఆకారం చూస్తే శ్రోత్రియుల్లా ఉన్నారు. ఏం పనిమీద వచ్చారు?” అని అడిగాడు జ్ఞానతీర్థుడు.
“స్వామీ! మీరు జ్ఞానచక్షువులు. మీరు ఎరగని ధర్మాలుండవు. కర్మలు జ్ఞానానికి అడ్డుపడతాయంటారు కానీ, జ్ఞానం పొందడానికి కర్మలు ఉపయోగపడతాయని నేను నమ్ముతాను. ఆదిశంకరుని సిద్ధాంతం కూడా అదే చెబుతున్నది. నాకు మొదటినుంచీ కర్మలపై ఆసక్తి ఎక్కువ. కానీ శాస్త్రంలో చెప్పినట్లే యథాతథంగా కర్మలను నెరవేర్చాలంటే ఒక్కరే పూనుకుంటే చాలదు. ఇతరుల సహాయం కూడా అవసరం. రేపు మా తండ్రిగారి ఆబ్దికం. మా పూర్వపుణ్యం వల్ల మీరు లభించారు. దయచేసి మా ఇంటికి విచ్చేసి, భిక్ష స్వీకరించండి” అని ప్రార్థించాడు అగ్నిశిఖుడు.
ఆ యోగి నవ్వుతూ.. “నువ్వు వేదమూర్తివి. నీలాంటివారి అభిలాష తీర్చడం కంటే మాలాంటి వారికి వేరొక పరమార్థం లేదు. కానీ, రెండో భోక్తగా ఎవరిని పిలుస్తున్నావు?!” అని ప్రశ్నించాడు.
“అదే ఇంతవరకూ తేలడం లేదు స్వామీ!” అని నసిగాడు అగ్నిశిఖుడు.అప్పుడు ఆ యోగి కొంచెం ఆలోచించి..
“వైదికుడా! మారు మాట్లాడకుండా అంగీకరిస్తానని మాటిస్తే, నేనొక పేరు చెబుతాను” అన్నాడు.
“స్వామీ! మీకంటే నేనెక్కువ తెలిసినవాణ్ని కాను. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను” అన్నాడు అగ్నిశిఖుడు అంజలి ఘటించి.
జ్ఞానతీర్థుడు గంభీరంగా.. “కాళిదాసు పేరు నువ్వు వినే ఉంటావు. ఆయన్ను రెండో భోక్తగా నియమిస్తేనే నేను కూడా వస్తాను. లేదంటే లేదు” అని పలికి, లోపలికి వెళ్లిపోయాడు. ఆ మాట వింటూనే అగ్నిశిఖునికి ఒక్కసారిగా గుండె పగిలిపోయింది. కానీ, చేసేదేమీ లేక శిష్యునితో..
“కౌశికా! ఆ కాళిదాసుని మనం చూసి ఎరుగం. ఆయన చర్యలు విపరీతంగా ఉంటాయని అందరూ చెప్పుకొంటారు. ఇప్పుడేమిటి చేయడం” అన్నాడు.
“పదండి. ఎక్కడుంటాడో తెలుసుకుని, ఆయన్ను కలుసుకుందాం” అంటూ దారితీశాడు కౌశికుడు.ఎవరో ఎరిగున్నవారిని అడిగితే.. విలాసవతి అనే వేశ్యవద్ద కాళిదాసును కలుసుకోవచ్చని తెలిసింది. గత్యంతరం లేక గురుశిష్యులిద్దరూ వేశ్యావాటికకు వెళ్లారు. అటువంటి చోటుకు వెళ్లడం తొలిసారి కావడంతో ఏవగింపుతో పాటుగా అబ్బురపాటుకు, తెలియని మోహానికి కూడా గురయ్యారు. వాటినన్నిటినీ పక్కకు పెట్టి, విలాసవతి భవనాన్ని గుర్తించారు. వాకిట రాజభటులు కావలి ఉండటం చూసిన అగ్నిశిఖుడు బిత్తరపోయాడు. ముందుకు వెళ్లడానికి శంకించాడు. అప్పుడు కౌశికుడు ధైర్యం చేసి, కొంత సమాచారం తెలుసుకుని వచ్చాడు.
“గురువుగారూ! ఇటువంటి విషయాలు మీకు చెప్పవచ్చునో లేదో తెలియదు. కానీ చెప్పక తప్పదు. మన భోజరాజుగారికి, కాళిదాసుకు కూడా ఈ విలాసవతి ప్రియురాలేనట. రాజుగారు ఆమెను వలచారు. ఆమె కాళిదాసుని వరించింది. అదీ తేడా. ప్రస్తుతం భోజరాజుగారు ఈ ఇంటిలోనే ఉన్నారట. ఆయన బయటికి వెళ్లేవరకు మనం లోపలికి పోలేం” అని చెప్పాడు.
ఆ మాటతో అగ్నిశిఖుని ఒళ్లు మండిపోయింది.
“పగలూ రాత్రీ భేదం లేకుండా కామినులతో కూడేవాడు భోక్తగా వస్తే పితృదేవతలు హర్షిస్తారా? మనల్ని వంచించడానికే ఆ సన్యాసి అలా చెప్పి ఉంటాడు. పోదాం పద” అన్నాడు.
కౌశికుడు అతనికి నచ్చచెప్పాడు. “గురువుగారూ! యతీశ్వరునితో ఆడితప్పడం మహాపాపం. మీరిప్పుడు వెనక్కి వెళ్లిపోతే తద్దినం పాడైపోతుంది. ఓర్పు వహించండి” అని బతిమాలాడు. ఇంతలో భోజరాజు ఆ ఇంటినుంచి బయటికి వెళ్లిపోయాడు. తాము వచ్చిన సంగతి పరిచారికల ద్వారా తెలియచేసి గురుశిష్యులిద్దరూ లోనికి వెళ్లారు. కాళిదాసు మేడదిగి వచ్చాడు.
“ఎవరూ?” అని ప్రశ్నించాడు. ఆయన నోటినుంచి చెరకురసంతో చేసిన మద్యపు వాసన గుప్పుమంటూ కొట్టింది. అగ్నిశిఖుడు ముక్కుమూసుకుని తమాయించుకుని, వచ్చిన పనిని వినయంగా విన్నవించాడు. అంతా విన్న తరువాత.. “సరే వస్తాను!” అని పలికి, మళ్లీ మేడమీదకు వెళ్లిపోయాడు కాళిదాసు.
బయటికి వచ్చిన తరువాత.. “కౌశికా! ఇతడేనా కాళిదాసు?! ఇతని ముఖంలో బ్రాహ్మణ వర్చస్సు ఇంచుకైనా కనిపించడం లేదే.. వీడా మనకు భోక్త?! మన కర్మ కాలినట్లే ఉంది” అన్నాడు అగ్నిశిఖుడు బాధగా. “గురువుగారూ! మహాకవులు ఏం రాశారో చూడాలి. నెత్తిన పెట్టుకోవాలి. కానీ వారి చర్యలను అనుకరించకూడదు. వారు రాసిన బాటలో పయనించాలి కానీ, వారు నడిచిన బాటలో నడవాలంటే చాలా కష్టం. మహాత్ముల చరిత్రలు కడు విచిత్రాలుగా ఉంటాయి. మీరు మరేమీ ఆలోచించకండి” అని నచ్చచెప్పి, ఇంటికి తీసుకుపోయాడు కౌశికుడు.
తెల్లవారింది. అగ్నిశిఖుడు ఆబ్దికానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తొమ్మిది గంటల పొద్దెక్కిన తరువాత ముందుగా యతికి చెప్పి.. విలాసవతి ఇంటికి వెళ్లాడు. లోనికి కబురు వెళ్లిన కొద్దిసేపటికి కాళిదాసు బయటికి వచ్చాడు. అరుగుమీద నిలబడి తాంబూలరసాన్ని తుపుక్కున ఉమ్మివేసి, అగ్నిశిఖుణ్ని చూశాడు.
“మీరా!.. ఈవేళ మీ ఇంట్లో ఆబ్దికం కదూ!” అని ప్రశ్నించాడు. “అవునండీ. దయచేసి తమరు ఇంకేమీ తినకుండా మా ఇంటికి దయచేస్తే బాగుంటుంది” అన్నాడు అగ్నిశిఖుడు.. ఆచారం పాడైపోతున్నదనే బాధను లోలోపలే అణుచుకుంటూ. “సరే.. ఒక్క ఘడియలో వస్తాను. ఈలోగా పదిబిందెల వేడినీళ్లు సిద్ధంగా ఉంచండి” అన్నాడు కాళిదాసు. “సరేనండీ!” అంటూ ఇంటికి వచ్చాడు అగ్నిశిఖుడు. కొద్దిసేపటికి కాళిదాసు రానేవచ్చాడు. అగ్నిశిఖుని శిష్యులు అభిషేకిస్తుండగా.. మసిలిపోతున్న వేడినీళ్లతో స్నానం చేశాడు.
“జాము పొద్దెక్కేవరకు నన్ను కదిలించకండి” అంటూ ఒక గదిలోకి వెళ్లి, తలుపు వారగా వేసుకుని.. ధ్యానానికి ఉపక్రమించాడు. దాదాపుగా పన్నెండుగంటల వేళ యతీశ్వరుడు వచ్చాడు.
“కాళిదాసుగారిని కూడా పిలవండి. కార్యక్రమం ప్రారంభించవచ్చు” అన్నాడు. అగ్నిశిఖుడు లోనికి వెళ్లాడు. కాళిదాస మహాకవికి బాహ్యస్మృతి లేదు. ఆత్మయందు ఈశ్వర్య సాన్నిధ్యం కల్పించుకుని.. ధ్యానసమాధి నిష్ఠలో ఉన్నాడు. ఎంత పిలిచినా పలకలేదు. ఆ ఏకాగ్రత చూసిన అగ్నిశిఖుడు..
‘కొద్దిసేపు ముందువరకూ వేశ్యాసాంగత్యం చేసి వచ్చిన వ్యక్తి ఇతడేనా?’ అని ఆశ్చర్యపోయాడు. సంశయిస్తూనే ముందుకు వెళ్లి, కాళిదాసు వీపుపై చేయివేసి తట్టబోయాడు. అంతే.. నిప్పుల మీద వేసినట్లు చెయ్యి చురుక్కుమంది. “అబ్బా!” అని గట్టిగా అరిచి.. విదిలించి చూసేసరికి చెయ్యి బొబ్బలెక్కిపోయి ఉంది.
అగ్నిశిఖుడు కన్నీళ్ల పర్యంతమయ్యాడు.ఇంతలో కాళిదాసు నెమ్మదిగా కళ్లు విప్పాడు. అగ్నిశిఖుని బాధచూసి, అతని చేయి పట్టుకుని నెమ్మదిగా నోటితో ఊదాడు. ఆ మరుక్షణంలోనే కాలిన గుర్తు లేకుండా చెయ్యి మామూలు స్థితిలో కనిపించింది. అప్పుడు అగ్నిశిఖునిలో ఎక్కడాలేని భయభక్తులు ఒక్కసారిగా ఉదయించాయి. కాళిదాస మహాకవి పాదాలమీద పడ్డాడు. అటుపిమ్మట జ్ఞానతీర్థుని వైపు తిరిగి..
“మహాత్మా! ఈయన ఇంతటి మహానుభావుడని తెలుసుకోలేకపోయాను. మీవల్ల నేను ధన్యుడినయ్యాను. మా పితరులు నేటితో బ్రహ్మపదాన్ని ముట్టగలరు” అని స్తుతి చేయసాగాడు.
యతీశ్వరుడు చిరునవ్వు నవ్వి.. “కాళిదాస కవి అవధూత వంటివాడు. అతనికి సంకల్ప వికల్పాలు లేవు. జ్ఞానవంతుల్లో అటువంటి విజ్ఞాని లేడు. మహానుభావులు ఉన్మత్తుల్లా, జడుల్లా, మూగవారిలా, అజ్ఞానుల్లా కనిపిస్తుంటారు. వారి ఆత్మబలశక్తిని సామాన్యులు గ్రహించలేరు” అని పలికాడు.అగ్నిశిఖుడు సంతోషించి, ఆబ్దికాన్ని భక్తిశ్రద్ధలతో నెరవేర్చాడు. చివరిగా..
“నీకు ఉత్తమ సంతానం కలుగుగాక!” అని ఆశీర్వదించి, భోక్తలిద్దరూ వెళ్లారు.మహాత్ముల మాటకు తిరుగుండదు కదా! తొందరలోనే దేవదత్త గర్భం దాల్చింది. పండంటి కొడుకును కన్నది. అతనికి ‘సుమతి’ అని పేరు పెట్టుకున్నారా దంపతులు. ఆ తరువాత వారికి మరో కుమారుడు, కుమార్తె కూడా కలిగారు. రెండో కుమారునికి ‘ప్రమతి’ అని, కుమార్తెకు ‘పితృదత్త’ అని పేర్లు పెట్టుకున్నారు. వారు ముగ్గురూ అమిత తేజఃసంపన్నులై దినదినాభివృద్ధిగా పెరుగుతున్నారు. అయితే ఒక్కటే విచారం. కాళిదాసు వంటి ఆచారభ్రష్టుణ్ని భోక్తగా అర్చించినందువల్ల అగ్నిశిఖుని కుటుంబాన్ని ఊరంతా వెలివేసింది.
(వచ్చేవారం.. కొడుకును కన్న కన్యక)
-అనుసృజన: నేతి సూర్యనారాయణ శర్మ