తనతో వివాహ ప్రతిపాదనను ఇంద్రాణి విరమించుకున్నట్లు తెలిసి.. జాయపుడికి క్షణకాలం ఏమీ అర్థంకాలేదు. ముమ్మడి.. ఇలా తనపై పైచేయి సాధించాడా!? అంతలోనే.. నీలాంబ వేశ్యావాటికను ఎవరో దుండగులు తగులబెట్టినట్లు వార్త. పరుగున వేశ్యా వాటికకు వెళ్లాడు. కాలి సగం బూడిదైన నీలాంబ భవంతులను చూసి.. మ్రాన్పడిపోయాడు. కంటికి కనిపించని శత్రువులు తన చుట్టూ గంతులు వేస్తూ వికటాట్టహాసాలు చేస్తున్నట్లు అనిపించింది జాయపుడికి. వీళ్లు తనపై పైచేయి సాధించారా!? తనను ఓడించారా!?
ఆరోజు ప్రేరణ నృత్త కార్యక్రమం వద్ద మైలారభటులు సృష్టించిన హడావుడి ఇంతా అంతా కాదు. రుక్కమలాగే వాళ్లూ కూడా భైరవ ఆత్మాహుతి చేసుకున్నాడని భావించినట్లున్నారు. అప్పటి దృశ్యం మరోసారి మనోఫలకం మీదికొచ్చింది.కచ్చితంగా భైరవది ఆత్మాహుతి అని నూరుపాళ్లు నమ్మవచ్చు. ఆ ఉద్రేకం..
మైలారభటుల కోలాహలం, భైరవ తల నరుక్కోవడం అచ్చంగా ఆత్మాహుతి తంతులాగే జరిగింది.
జాయప సేనానిని ఓడించడమా!? అసంభవం. ఇటీవలే చేతిలో ఆయుధం లేకుండా.. కళ్లకు గంతలు కట్టుకుని వీడి సైనికుల్ని చిత్రవధ చేశాడే! మర్చిపోయారా!?
ఇలా దొంగదెబ్బ కొట్టగలరు. కానీ, దొంగదెబ్బ అయినా.. దెబ్బ దెబ్బే కదా!?
ముడుచుకుపోయాడు.. పురనివాసంలో కూర్చుండిపోయాడు. గతంలో తను ఎన్నడూ ఎరుగని ప్రచ్ఛన్నయుద్ధం.. దొంగ దెబ్బ!!
యుద్ధక్షేత్రం ఇప్పుడు జీవితం అయింది. జీవితం మీద యుద్ధతంత్రాలతో దొంగపోట్లు పొడుస్తున్నారు.
పోరాడాలి.. ఈ జీవిత పోరాటంలో ఓడిపోకూడదు.
లేచి నిలబడటానికి శక్తియుక్తులు కూడదీసుకుంటున్నాడు మహాయోధుడు జాయపుడు.
జీవన పోరాటం కంటే యుద్ధ పోరాటమే సులభం సుమా..!
యుద్ధ వాతావరణం మరింత ముసరడంతో ప్రేరణ నృత్త ప్రదర్శనలు కూడా ఎక్కువయ్యాయి. ఆ రోజు అనుమకొండలోనే సైనికవాడలో శ్రీ సిద్ధేశ్వరాలయం వద్ద ప్రేరణ ప్రదర్శన. ఆరోజు భైరవ మరింత ఉగ్రంగా ఉన్నాడు. అప్పటికే చాలాసార్లు భైరవను హెచ్చరించాడు జాయపుడు.
“ఉద్రేకంతో ఊగిపోతున్నావ్ భైరవా. కొంచెం తగ్గాలి. మనది నటన. సైనికులను యుద్ధ సంసిద్ధులను చేయడమే ఈ మన కళ ప్రధానోద్దేశం!”..
కానీ, ఆరోజు కూడా భైరవ ముందునుంచే చాలా ఉద్రేకంగా పూనకం పట్టినట్లు ఊగిపోతూ నటిస్తున్నాడు. ప్రజలు బాగా గుమిగూడారు. ప్రేక్షకుల్లో అరుపులు కేకలు ఎక్కువయ్యాయి. గుడిలో గంటలు తీవ్రంగా మోగిస్తున్నారెవరో. గుగ్గిలం వేశారు. శంఖాలు ఊదుతున్నారు కొందరు మైలారభటులు. శూలాలు ఒంటికి గుచ్చుకుని ఎగురుతున్నారు కొందరు. అదొక శైవ తిరునాళ్లలాగా ఉన్నది. మధ్య మధ్య భైరవ శరీరంపై విబూది పోస్తున్నారు. డమరుక శబ్దం పెరిగిపోతున్నది. ముగింపునకు వచ్చేసరికి గజ్జెలధ్వని నిజమైన వీరభద్రుని వికటాట్టహాసంలా.. గుడిప్రాంగణం దాటి ఆ వీధినంతా ఉద్వేగంతో ఊపేస్తున్నది.
నృత్తం శ్రుతి తప్పుతున్నదేమోనన్న భావన జాయపునిలో కలిగింది. కొంత ఉద్రిక్తత తగ్గించాలి అనుకున్నాడు. అప్పుడే నృత్తమాడుతున్న భైరవ.. జాయపుని దగ్గరికొచ్చి, అతని నడుముకున్న ఒర నుంచి ఖడ్గాన్ని లాగి పుచ్చుకున్నాడు. ఆ ఖడ్గంతో నృత్తం చెయ్యసాగాడు. మరొకరి దగ్గరున్న శంఖం లాక్కుని తీవ్రస్వరంతో పూరించసాగాడు. వాద్యబృందం మరింత రెచ్చగొట్టేలా రుంజలు, కాహళులు, డముకులు, తప్పెట్లు.. తీవ్రస్థాయిలో వాయించసాగారు.
ఉన్నట్టుండి పెద్ద పెట్టున అరిచాడు భైరవ..
“హరహర మహాదేవా.. ఓం.. ఓం.. ఓం.. హరోం హర!”.
చటుక్కున తన శిరస్సును ఖడ్గంతో తెగ నరుక్కున్నాడు. అతని తల ఎగిరి అంతరాలయం ముందు పడింది.
మతిపోయింది జాయపునికి. రక్తం చివ్వున చింది కాకతి, జాయపుల దుస్తులపై పడింది.
పిచ్చికేక వేసింది కాకతి. భయభ్రాంతురాలై వణికిపోతున్నది. మళ్లీ కేక.. మళ్లీమళ్లీ కేక.. కేక!
ఉన్మత్తులైన ప్రజలు అతని ఆత్మాహుతిని మరింత ఉన్మత్తస్థాయికి తీసుకెళ్తున్నారు. అతని మొండెం నుంచి పొంగుతున్న రక్తాన్ని దోసిలిపట్టి ఉద్రేకంతో ఊగిపోతూ ఒంటికి రాసుకుంటూ చిందులు వేస్తున్నారు.
ఇద్దరూ పరుగున ఆ శిరస్సు వద్దకు వెళ్లారు.
“ద్రోహి.. కాకతి నా భార్య. నాకు కాబోయే భార్య! దానిని మలినపరిచావ్. ఇంతకింతా అనుభవిస్తావ్!”..
భైరవ అన్నమాటలు జనం ఎవ్వరికి అర్థం కాలేదు కానీ జాయపునికి, కాకతికి స్పష్టంగా వినిపించాయి. కాకతి పెద్దగా పిచ్చెత్తినట్లు అరిచింది. మళ్లీ అరిచింది. దిక్కులు పిక్కటిల్లేలా మళ్లీ మళ్లీ అరిచింది. చేతితో నోటిపై కొట్టుకుంటున్నది. రుక్కమలా వెర్రివెర్రిగా అరుస్తూ ఊగిపోతున్నది..
ఆమెకు ఏదో చెప్పబోయాడు జాయపుడు. ఆమె అలా అరుస్తూ వినకుండా వేగంగా గుడిలోకి పరుగుపెట్టింది.
జీవితంలో అత్యంత క్లిష్ట సంఘర్షణలో జాయపుడు.
లలితాంబ ఉదంతం తగ్గుముఖం పట్టకముందే.. మరో బలమైన దెబ్బ! జీవితం కుప్పకూలిపోయేలా గుండెను చీల్చేసింది భైరవ ఆత్మాహుతి.
అసలు ఏం జరిగిందో అర్థం కావడానికి వారంరోజులు పట్టింది జాయపునికి.
హిమాలయాలు ఎందుకు ఎక్కాడో తెలియక ఎక్కి, ఎలా జారిపడ్డాడో తెలియక జారి, హిమనదంలో పడి.. చలిలో ముడుచుకుపోయినవాడిలా తన పురనివాసంలో ముడుచుకుపోయి మూల కూర్చుండిపోయాడు.
భైరవ మైలారభటుడు అని.. ప్రాపంచికాన్ని వదిలి తన కళాభిజ్ఞతను శివపాదార్చనకే తర్పణచేస్తూ, పవిత్ర జీవితం గడుపుతున్నాడని భైరవపై గొప్పగౌరవం జాయపునికి.
ఆ తొలిరోజు అంతటి విషాదంలోనూ అన్నం పెట్టిన గొప్ప కుటుంబంగా.. రుక్కమను, భైరవను అభిమానిస్తూ జాయపుడు వారి గ్రామంవెళ్లి ఆ కుటుంబంలో ఒకడిగా కలిసిమెలిసి నాట్యాలతో, ప్రదర్శనలతో తనలోని కళను ఆ కుటుంబంతో, ఆ గ్రామంతో పెనవేసి అల్లుకున్నాడు. ఆ అల్లికలో భాగమే కాకతి.
ఆమెను మొదటిసారి చూసినప్పుడు యవ్వనోల్బణం వల్ల నచ్చినా.. తర్వాత తర్వాత కూడా ఆమె తనతో మానసిక, శారీరక సాన్నిహిత్యం పెరిగేలా పెనవేసుకుంటుందని అర్థమవుతున్నా.. శారీరకంగా ఏకమవుతామని ఊహించలేదు. కానీ జరిగింది. కాకతిని వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఇంద్రాణి తిరస్కరించడంతో అక్క, బావగారిని ఒప్పించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు.
ఆ సమయంలో ఇలా.. ఈ హఠాత్ పరిణామం జరుగుతుందని కనీసం ఊహించలేదు.
భైరవ ఆత్మాహుతి జాయపుణ్ని తీవ్రంగా ప్రభావితంచేసింది. ఎప్పుడూ లేనంతగా చలించిపోయాడు.
గతాన్ని మొత్తంగా అవలోకిస్తే.. ఈ మొత్తం ఇద్దరి ప్రయాణంలో కాకతి ఎప్పుడూ తాను భైరవకు కాబోయే భార్యనని చెప్పలేదు. రుక్కమ కూడా ఈ పెళ్లి ఆలోచన ఆమె మనసులో ఉన్నట్లు మాటకైనా అనలేదు. ఇద్దరి కుటుంబాల మధ్య అటువంటి ఆలోచనలు, చర్చలు జరిగినట్లు చెప్పడానికి జాయపునికి ఒక్క సంఘటన కూడా గుర్తు రావడంలేదు. ఏమాత్రం ఈ అంశం చెవినపడినా.. తన సాన్నిహిత్యం తగ్గించుకునేవాడు. నిజానికి ఇంద్రాణి, ముమ్మడి మధ్య ఏదో ఉన్నదని గాలివార్తగా తెలిసినప్పుడే ఆమెతో సాన్నిహిత్యం తగ్గించుకున్నాడు.
ఎంత పని జరిగింది?!కాకతి గుర్తొచ్చింది.
ఆ రోజు గుడిలోకి పరుగెత్తి పోయింది. మళ్లీ కనిపించలేదు. ఎలా ఇంటికి చేరిందో.. ఈ సంఘటనను ఎలా తీసుకుందో.. ఎంతగా కుమిలిపోతోందో!? ఉరికిపడే జలపాతం లాంటి కాకతి ఊహాతీతమైన ఈ సంఘటనతో నివ్వెరపోయి ఉంటుంది. మధ్యలో ఆమె బలి అయ్యింది పాపం!!
అయినా భైరవ ఇంత తీవ్రనిర్ణయం ఎలా తీసుకున్నాడు?! ఊహాతీతం!!
అసలు ఎంత ఉన్నతుడు?! ఎంత ఉదాత్తంగా ఉంటాడు.. అతనికి కాకతిపై మనసుందని ఎప్పుడూ చిన్నమాటగా కూడా చెప్పినవాడు కాదు. అలా ఊహించుకోవడానికి కూడా ఆస్కారం ఇచ్చినవాడు కాదు. తనను ‘నటరాజా!’ అని పిలిచేవాడు. నాట్యమన్నా, శివభక్తి అన్నా తన్మయత్వంతో ఊగిపోతాడు. ప్రాణాలు పెడతాడు. ఇప్పుడూ పెట్టాడు. కానీ, అది తనకు చావు మరక అంటించి!!
అసలు ముందు కాకతిని కలవాలి. అయ్యనవోలు వెళ్లి రుక్కమను, వెన్నియను పరామర్శించాలి!
మూడోజాము అవబోతున్నది. సూర్యుడు నడినెత్తికి వచ్చాడు.
బయల్దేరాడు జాయపుడు. నాలుగోజాము దాటాక చేరాడు అయ్యనవోలు. ఊరంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే ఊరిలో ఆముదపు దీపాలు వెలిగిస్తున్నారు. పంచాయతీ చావిడి వద్ద తప్ప రాత్రుళ్లు ఎక్కడా వీధి దీపాలు ఉండవు. రాత్రి తొలిజాములోనే తిని నిద్రపోతారు గ్రామస్తులు. పండుగ, జాతర, వినోద కార్యక్రమాలు ఉంటే తప్ప ఎవ్వరూ రాత్రి బయట తిరుగరు.
రుక్కమ ఇల్లు ఊరి మధ్యగా ఉంటుంది. ప్రవేశించి రెండువీధులు తిరిగాక ఆమె ఇల్లు కనిపిస్తుంది. ఇంటి ముందుకు వెళ్లాడు. దూరంగానే చిన్నదీపపు వెలుగులో బీభత్సంగా భయపెడుతున్నది ఆ ఇంటి వాతావరణం. తలుపులు తెరచి ఉన్నాయి. లోపలి నుంచి దీపపు వెలుగు పలుచగా కనిపిస్తున్నది. ఏదో భయం జాయపుణ్ని వెంటాడుతున్నది.
ఎదురుగా పద్మాసనం వేసుకుని జుట్టు విరబోసుకుని కూర్చుని ఉంది రుక్కమ.
మూలగా తెల్లజిల్లేడు కొమ్మ పాతి ఉండగా.. దానిముందు ప్రమిదలో దీపం వెలుగుతున్నది. భైరవ చనిపోయి వారంరోజులు అవుతున్నది. బహుశా అతని అపరకర్మలన్నీ పూర్తయ్యేవరకు ఆ జ్యోతి వెలుగుతూ ఉండవచ్చు.
“రా.. జాయపా రా! నా కొడుకు చూశావా.. శైవ సన్నిధికి చేరాడు. ఇప్పుడు కైలాసగిరిలో ఉన్నాడు. ఆ రుద్రదేవుడే వాణ్ని ఆవహించి తనతో తీసుకుపోయాడు!”.
స్థిర గంభీరగాత్రంతో, తొణికిసలాడే ఉద్వేగంతో అన్నది రుక్కమ. బుర్ర తిరిగిపోయింది జాయపునికి.
ఈమె ఇలా భావిస్తున్నదా!?
ఆరోజు ప్రేరణ నృత్త కార్యక్రమం వద్ద మైలారభటులు సృష్టించిన హడావుడి ఇంతా అంతా కాదు. రుక్కమలాగే వాళ్లూ కూడా భైరవ ఆత్మాహుతి చేసుకున్నాడని భావించినట్లున్నారు. అప్పటి దృశ్యం మరోసారి మనోఫలకం మీదికొచ్చింది. కచ్చితంగా భైరవది ఆత్మాహుతి అని నూరుపాళ్లు నమ్మవచ్చు. ఆ ఉద్రేకం.. మైలారభటుల కోలాహలం, భైరవ తల నరుక్కోవడం అచ్చంగా ఆత్మాహుతి తంతులాగే జరిగింది.
కానీ.. కానీ చనిపోతూ అతనన్న మాటలు తను విన్నాడు. అతని భార్య కాబోయే కాకతిని తను మలినం చేశానని స్పష్టంగా అన్నాడు. అది కాకతి కూడా విన్నది. ఇందులో సందేహంలేదు. ఆ తర్వాత కాకతి గుడిలోకి పరిగెత్తింది. అప్పుడే జనం చుట్టుముట్టడంతో ఇవతలికి కదలక తప్పలేదు. ఈలోగా కొండయ, నాట్యమిత్రులు భైరవ మొండెం, తల తీయడం చూశాడు. అక్కడ ఉండలేక వచ్చేశాడు.
ఇప్పుడు ఉద్వేగాన్ని అణచుకుని రుక్కమ ముందు కూర్చున్నాడు.
“పెద్దమ్మా.. భైరవ అలా చేస్తాడని నేను ఊహించలేదు. ఊహిస్తే..”
“అది ఆ రుద్రుడి ఆజ్ఞ. నువ్వెలా ఊహిస్తావ్ జాయపా..” అంటూ వికటాట్టహాసం చేసింది.
“నా కొడుకు ఆ శివుడాజ్ఞను అమలు చేశాడు. అంతే..” పడిపడి నవ్వుతున్నది.
అప్పుడు లోపలికొచ్చాడు వెన్నియ, కాకతి తండ్రి. తలగుడ్డ తీసి ముఖం కప్పుకొని బావురుమన్నాడు.
“దేవుడు అన్యాయం చేశాడు జాయప దేవరా.. బంగారంలాంటి వాడు నా మేనల్లుడు. కూతురినిచ్చి చేస్తే కాకతి కళ్లముందే ఉంటుంది అనుకున్నా. నా మనసులో మాట అక్కతో చిదంబరం గుడి వద్ద ప్రస్తావించా.. అక్క కూడా ఒప్పుకొన్నది.. కానీ కానీ..” చేతులు బేలగా ఊపుతూ ఏడ్చాడు.
ఇప్పుడు విన్నాడు తొలిసారి పెళ్లిముచ్చట.
ఇది వెన్నియ మదిలో ఆ దక్షిణావర్త యాత్రలో పుట్టి ఉండాలి. అతడు తన మనసులో మాట అక్కకు చెప్పగా రుక్కమ సంతోషంతో భైరవకు చెప్పింది. అతడు ఆశలు పెంచుకున్నాడు.
కానీ, ఈ సంగతి కాకతికి తెలియకపోవచ్చు. తెలిస్తే తనతో అంత చనువుగా ఉండేది కాదు. చిదంబరంలో నటరాజ విగ్రహం చూశానని.. భలే ఉన్నదని.. దానిని చూస్తుంటే జాయపుడు నృత్తం చేస్తున్నట్టే ఉన్నదని చెప్పి మురిసిపోయింది.
వెన్నియ వెనుక ఎవరైనా ఉన్నారా అని వెనక్కువాలి చూశాడు.
చిక్కని చీకటి!! ఆమె.. కాకతి ఎక్కడ?
(సశేషం)
-మత్తి భానుమూర్తి
99893 71284