జిల్లా కలెక్టర్ను అయ్యాక.. దాదాపు పదిహేనేళ్ల తరువాత.. మొదటిసారి మా ఊరికి వెళ్తున్నాను. ఎప్పుడో నానమ్మ చనిపోయాక.. ఊరికి దూరమయ్యాను. పదిహేనేళ్ల కింది పల్లెలా లేదు. సిమెంటు రోడ్డు మీద.. ఇరువైపులా చెట్లతో, వరిపొలాల పచ్చదనంతో నిండింది.‘గొల్లపల్లికి స్వాగతం’ అనే గ్రామపంచాయతీ బోర్డు కనిపించగానే.. నా శరీరం పులకించిపోయింది.
దూరంగా చెరువుకట్ట కింద ఒక పెద్ద వేపచెట్టు.. పక్కనే పోచమ్మగుడి. వాటిని చూడగానే కళ్లు చెమర్చాయ్.
నేను మూడో తరగతి చదువుకుంటున్నప్పుడు, అర్ధరాత్రి వచ్చే కరెంటుతో పొలానికి నీళ్లు పెట్టబోయి.. ఆ చెట్టు దగ్గరే కరెంట్ షాక్తో చనిపోయాడు నాన్న.
“సార్.. మీరేదో ఎగ్జయిట్ అవుతున్నారు” అన్నాడు.. కార్లో పక్కకు కూర్చున్న పీఏ.
“ఏం లేదు రాజు!” అన్నాను.
అతని చేతుల్లో పెద్ద గిఫ్ట్ ప్యాక్ కొంత ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది.
“సార్! అడుగుతున్నానని అనుకోకండి. ఈ గిఫ్ట్ ప్యాక్ ఎవరికోసం. అసలు దీంట్లో ఏముంది?” అన్నాడు.
అలా అడగడం అరగంటలో అది నాలుగోసారి.
చిన్నగా నవ్వి ఊరుకున్నాను.
ఇంకా రెండు కార్లు మా ముందర.. నాలుగు కార్లు వెనుకా అనుసరిస్తున్నాయి.
ఆ పచ్చని పొలాలను చూస్తుంటే వాటి మధ్యలో ఎండిపోయిన చింతచెట్టును చూసి.. బాల్యంలోకి వెళ్లిపోయాను.
శీనుగాడు, వేణుగాడు, రాజేష్గాడు, స్వాతి, రెండు జెళ్ల రాధిక, నేను, రమేష్గాడు.. పొద్దున్నే ఆ చింతచెట్టు కింద చేరి రకరకాల ఆటలు ఆడుకునే వాళ్లం. అది కూడా పెండదొబ్బుడు ఆట ఎక్కువ ఆడుకునేవాళ్లం. ఏగిలివారంగనే మందోట దగ్గరికి పరిగెత్తేవాళ్లం.
మందోట దగ్గర సొట్టలుపడ్డ తట్టలు పట్టుకొని, పెండను నింపుకొనే వాళ్లం. శేషుగాడు అయితే బర్రె పెండ వేసేందుకు తోక లేపంగానే.. అక్కడ తట్ట పట్టుకొని నిల్చుండేవాడు. పెండ భూమి మీద పడకముందే పట్టుకొనేవాడు. ఒకరితో ఒకరం పెండతో కొట్టుకునే వాళ్లం. స్కూల్ టైం అయ్యేంతవరకూ చెరువులో ఈతకొట్టి.. పెండ తట్టలు పట్టుకొని ఇంటికెళ్లి, స్కూల్బ్యాగులు జబ్బకేసుకొని బడికి వెళ్లేవాళ్లం.
కాట్రావుల పండగ వస్తే మా అల్లరి అంతాఇంతా కాదు. మేమంతా ఒకసారి పెండదొబ్బుడాట ఆడుకుంటున్నప్పుడు.. ఒక్కసారిగా ఆ డప్పుల చప్పుడు విన్పించింది.
“ఎల్లుండి పీరీల పండుగ గదా! అజీమొద్దీన్ పెద్దపులి వేషం వేసిండట”.. వేణుగాడు చెప్పగానే నా నిక్కర్ తడిసిపోయింది.
“ఏ.. గా పుర్రెలకు భయపడతార్రా! వీడైతే లాగులోనే ఉచ్చ పోసుకున్నాడు” శీనుగాడు నవ్విండు.
రాధిక అయితే భయంతో ఏడవడమే మొదలెట్టింది.
“మా ఇంట్లో పులులు చాయ తాగుతాయ్. నన్నయితే ఏమనయ్!” రాజేష్గాడు గంభీరంగా చెప్పాడు. కానీ, లోలోపల వాడు కూడా మస్తుగా భయపడుతున్నాడు.
“నా బాధ అది కాదురా.. పోయినసారి మా అవ్వ అజీమొద్దీన్తో ‘డెచ్చ’ కొట్టిచ్చింది. మూడు రోజులు భయంతో జ్వరం వచ్చింది!” భయంతో గొంతు వణుకుతుండగానే చెప్పాను.
ఆ రోజు.. అందరం ఒకరి చేతిని ఒకరం పట్టుకొని, డప్పుల శబ్దం దూరమైనాక ఇళ్లలోకి పోయాం.
పీర్ల పండుగ రోజు రాత్రి అయితే అజీమొద్దీన్ విశ్వరూపం కనిపించేది. పూనకం వచ్చినట్టు ఆడేవాడు. అరుచుకుంటూనే.. నిప్పుల గుండం మీద నుంచి ‘అసైదుల్ల!’ అంటూ దూకేవాడు. బెల్లం, కుడుకలు, బత్తీసల దండలను నాతోటి వేయించేది నానమ్మ.
‘ఓహో జాంబియా ఓలంపెల్లి జాంబియా నాతోటి మాట్లాడు నాంపెల్లి జాంబియా!
దులా.. దులా.. అసైదులా’.. పాటలతో ఊరంతా హోరేత్తేది.
ఒకసారి మా దోస్తు శీనుగాని అమ్మ.. వాడికి జ్వరం తగ్గకపోతే పీరీల పండగ రోజు పెద్దపులి వేషం వేయిస్తానని మొక్కుకున్నదట. ఆ రోజు శీనుగాడు పులి వేషం వేస్తే.. నేను తోక పట్టుకున్నాను. రాజేష్గాడు, వేణుగాడు వచ్చి పిర్రలు గట్టిగా గిచ్చి పోయేవాళ్లు. తెల్లారిపోయి చూసేసరికి రెండు పిర్రలు నల్లగా కమిలిపోయి కనిపిస్తే.. వాళ్లమ్మ మస్తు తిట్టింది.
ఓసారి ఒకాయన ధైర్యం చేసి.. అజీమొద్దీన్ పిర్ర గిల్లాడట. వాణ్ని ఊరంతా మొనగాడిలా చూసిందట. కానీ, అజీమొద్దీన్ వాణ్ని దొరకపట్టుకొని కింద పడేసి.. పొర్లించి పొర్లించి.. పెయ్యంత పసుపు రంగు పూసిండట. అజీమొద్దీన్ వెంట మరో నలుగురు పెద్దపులి వేషం వేసేవారు.
మా ఇంటికి అజీమొద్దీన్ వచ్చినప్పుడు.. పుర్రె తీసి.. 14వ శతాబ్దం నాటి పీరీల విశిష్టత గురించి చెప్పేవాడు. అది పండుగ కాదనీ.. 74 మంది త్యాగధనుల ఫలితమే ఈ తొమ్మిది రోజుల స్మారక దినాలని చెబితే.. ఆ వయసులో అర్థంకాకపోయేది. అశుర్ఖానా నుంచి.. నిప్పుల గుండం వరకూ చెప్పేవాడు.
దూలా ఆడుతూ.. మట్కీలు తీసేవరకు.. దురంకారులైన రాజ్యాధిపతులపై తిరుగుబాటు చేసిన హసన్ హుసేన్ల గురించి ఉద్వేగభరితంగా చెప్పేవాడు.
‘పీర్ అంటే.. 74 మంది ధర్మయుద్ధవీరుల స్మారకదినం!’ అని చెప్పేవాడు.
పీరీల పండుగను గమనిస్తే.. తెలంగాణా ఉద్యమానికి ఏదో పేగుబంధం పెనవేసుకున్నట్టు అన్పించేది. అస్తిత్వం కోసం దీక్షలతో తమను తాము హింసించుకోవడం.. బలిదానాలు చేసుకోవడంలాంటి సంఘటనలు ఆవేదనా భరితంగా స్మరించేవాడు.
నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అజీమొద్దీన్ చెప్పిన హసన్ హుసేన్ల ఉద్వేగమే గుర్తొచ్చేది. అందుకే నాకు తెలంగాణ ఉద్యమ సమయంలో అజీమొద్దీన్ పదేపదే యాదికొచ్చేవాడు.
దూలా ఆడుతూ.. మట్కీలు తీసేవరకు.. అన్నిటినీ పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమ పార్శ్వాలు కొన్ని కనిపిస్తాయి. తెలంగాణకే పరిమితమైన ఈ పెద్దపులుల పండుగ ఇక్కడి మత సామరస్యానికి ప్రతీక. చివరిదైన 9వ రోజునాడు మట్టికుండలో కలిపిన బెల్లం నీళ్లను.. మలీద ముద్దను అజీమొద్దీనే పంచేవాడు. రాగిరేకుల్తో చేసిన పంజా, హస్త, నెలవంకల్ని.. ఊదుపొగల మధ్య ఊరేగించి.. అందరూ‘అస్సయిదులా ఆరతి.. కాళ్ల గజ్జెల గమ్మతి!’.. అంటుంటే తనూ గంతులేసేవాడు. గుండెలు బాదుకుంటూ మాతం నిర్వహించేవాడు.
అసలు అజీమొద్దీన్ బతికున్నాడా!?.. చనిపోయాడా!?..
నన్ను.. నా మనసును.. అజీమొద్దీన్ ఆవహించాడు.
“సార్.. ఊరొచ్చింది!” కొంచెం గట్టిగానే అన్నాడు పీఏ.
‘సుస్వాగతం.. గొల్లపల్లి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా’.. పెద్ద అక్షరాలతో స్వాగత తోరణం.
అది చూసి ఉద్వేగంగా కోటు సర్దుకుని కూర్చున్నాను.
“ఒకప్పుడు కరెంటు, రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు మండల కేంద్రం. ఊర్లన్నీ మారిపోయాయి.. సార్” పీఏ రాజు అన్నాడు.
“నా చిన్నప్పుడే మూడు వేల ఓటర్లున్న విలేజ్ అది. ఇప్పుడు ఎంత ఎదిగింది” అన్నాను.
“ఇంతకూ ఇది మీ అమ్మమ్మ ఊరా!? నానమ్మ ఊరా సార్” అడిగాడు రాజు.
“నానమ్మ ఊరే! అమ్మమ్మ ఊరు పక్కన ఉన్న చిల్వాకోడూర్! ఇప్పుడు వాళ్లెవరూ లేరు. అంతా చనిపోయారు” అని చెప్పాను.
“ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్లాలి? అన్నట్టు.. ఈ గిఫ్ట్ ప్యాక్ ఎవరికి సార్?” మళ్లీ అడిగాడు.
నేను వస్తున్నట్టు తెలియగానే.. ఊరంతా బంతిపూల దండల తోరణాలతో నిండిపోయింది.
పొలిమేరలోనే.. డప్పు చప్పుళ్లతో ఎదురు వచ్చారు. ఊరంతా పండుగ వాతావరణం. గ్రామపంచాయతీ దగ్గర కారాగింది.
సర్పంచ్, మండల అధ్యక్షులు, జడ్పీటీసీ అందరూ.. తమ ఊరి బిడ్డ కలెక్టర్ అయినందుకు, ఆనందంతో ఉపన్యాసాలు ఇచ్చిన తరువాత నాకు సన్మానం చేశారు.
నాకు ఉద్వేగంతో గొంతు తడబడి ఎక్కువ మాట్లాడలేకపోయాను. చివరగా ఇలా అన్నాను.
“నేను కలెక్టర్ కాకముందు రెండేళ్లు ఫారెస్ట్ అధికారిగా పనిచేశాను. అప్పుడు పెద్దపులి పేరు వినగానే.. నాకు అజీమొద్దీన్ ముఖమే కళ్ల ముందు కదలాడేది. మిమ్మల్ని.. మరీ ముఖ్యంగా ఆయనను చూడాలని వచ్చాను”.
సర్పంచ్ నా చెవిలో మెల్లగా చెప్పాడు.
“అతను ఎవరి కోసం బతుకుతున్నాడో అర్థం కాదు గానీ.. ఇంకా బతికే ఉన్నాడు సార్..” అని.
నా మాటలు విని కొందరు ఆశ్చర్యంగా ముఖాలు పెట్టారు.
నా పీఏ రాజు అయితే.. గిఫ్ట్ పట్టుకోలేక సతమతం అవుతున్నాడు.
“నేను ఫారెస్ట్ రేంజర్గా ఎంపికైనప్పుడు.. ఒకసారి అడవిలోకి వెళ్లి ట్రాన్క్విలైజర్లో మత్తుమందుతో పెద్దపులిని పడగొట్టే డ్యూటీ పడింది. నేను ఒక చెట్టు మీద గన్ పట్టుకొని కూర్చున్నాను. పెద్దపులి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చింది. దాన్ని చూడగానే అజీమొద్దీనే గుర్తొచ్చాడు. చేతుల్లోని గన్ జారిపోయింది. ఆ పులిని ట్రాన్క్విలైజ్ చేయడానికి కూడా మనసు ఒప్పుకోలేదు. ఆజానుబాహుడైన అజీముద్దీన్ నాకు డెచ్చా కొట్టి.. ‘భయపడొద్దు!’ అన్నట్టు వీపులో తట్టి.. నన్ను ఎత్తుకొని డప్పుల శబ్దంలో ఎగిరేశాడు. పసుపు రంగుతో నా బట్టలు తడిసిపోయేవి” అంటూ చెప్పాను.
నా ఉపన్యాసం ముగిశాక.. అందరూ డప్పులతో అజీమొద్దీన్ ఇంటికి బయల్దేరారు. కొందరు డాన్సులు చేస్తున్నారు.
ఊర్లో నలుగురైదుగురు పెద్దమనుషులు నా దగ్గరికొచ్చి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఒకరిద్దరు తమకు పింఛన్ రావట్లేదని, మరికొంత మంది ధరణిలో తమ పేర్లు లేవని వినతిపత్రాలు ఇచ్చారు.
నాతోపాటు వచ్చిన అధికారులు ఆ విన్నపాలు తీసుకున్నారు. ఆ ఊరేగింపు ఒక శిథిలమైన పెంకుటిల్లు దగ్గరికి రాగానే ఆగిపోయింది. నేను నిమిషాల్లోనే పోల్చుకున్నాను.
అది అజీమొద్దీన్ ఇల్లని..
సగం తెగిన నులకమంచంలో.. వయసు అయిపోయి, అస్థిపంజరానికి తోలు తొడిగినట్లు అచేతన స్థితిలో.. ఆజానుబాహుడైన అజీమొద్దీన్!
ఒకప్పుడు తన పులివేషంతో ఊరంతా గడగడలాడించిన అజీమొద్దీన్..
సర్పంచ్ చెబుతున్నాడు.
“సార్.. అజీమొద్దీన్ భార్య చనిపోయి ఏడేళ్లయింది. ఇద్దరు కొడుకులు ఉంటే.. హసన్ దుబాయిలో చనిపోయాడు. హుస్సేన్ మస్కట్లో పోయిండు. అప్పటినుంచి చూసుకునేందుకు ఎవరూ లేరు. ఇంకో నాలుగు రోజులు అయితే ఈ ముసలోడు కూడా చనిపోతాడేమో!?”.
నేను అజీమొద్దీన్ పడుకున్న నులకమంచం దగ్గరికి వెళ్లాను.
మంచం పట్టెపై కూర్చున్నాను. నా పీఏ అర్థం చేసుకొని వాటర్ బాటిల్ అందించాడు.
మూత విప్పి ఒక బుక్క నీళ్లు అజీమొద్దీన్ నోట్లో పోశాను. గొంతు తడారిపోయిందేమో.. మెల్లిగా లేచి కూర్చున్నాడు.
ఊరంతా నిశ్శబ్దంగా, ఆశ్చర్యంగా చూస్తున్నది.
ఆడవాళ్లు, పిల్లలైతే.. ఉత్కంఠతో విస్మయంగా చూస్తున్నారు.
“హే కౌన్ బేటా?” అని మాత్రం అడగ్గలిగాడు అజీమొద్దీన్.
“కందుకూరి వెంకయ్య మనవణ్ని తాతా!” అన్నాను.
ఆయన పెదాలు కూడా వణుకుతున్నాయి.
“ఓ.. నేను పీర్ల పండక్కి డెచ్చగొడితే లాగు తడుపుకొనేటోనివి కదా!?” అని బోసి నవ్వు నవ్వాడు.
“అవును తాతా! నేనిప్పుడు నిజం పెద్దపులికి కూడా భయపడటం లేదు” అన్నాను ఒకింత గర్వంగా.
“ఒకసారి పెద్దపులి వేషం వెయ్యవా తాతా?” అని అడిగాను.
“పాంచ్ దిన్ సే అన్నం తినలేదు బేటా! అయినా నీ కోసం ఆడతా!” అంటూ నులక మంచం నుంచి వణుకుతూ లేచాడు.
నా గిఫ్ట్ తెమ్మని పీఏకు సైగ చేశాను. అతను నాకు ప్యాకెట్ అందించాడు. ఊరంతా ఆశ్చర్యంగా చూస్తున్నది.
“తాతా.. ఇది నీకు” అన్నాను.
వణుకుతున్న చేతులతోనే కవర్ చించి.. దాంట్లో ఉన్న పెద్దపులి పుర్రె తీశాడు.
ఊరంతా చప్పట్లతో మోగిపోయింది..
అజీమొద్దీన్ కళ్లు చెమ్మగిల్లాయి. పుర్రె మీద రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి.
“ఎన్ని రోజులైంది బేటా..” అంటూ, ఆత్రంగా.. ఆప్యాయంగా.. ఆనందంగా ఈ పుర్రెను తడిమాడు.
“తాతా.. ముందు ఇవి తిను!” అంటూ,
వేరొక సంచీలో తెచ్చిన మలీద ముద్దలు, బెల్లం నీళ్లు అందించాను.
వణుకుతున్న చేతులతో గబాగబా తిన్నాడు.
ఆ పుర్రెను మెల్లిగా ముఖానికి తగిలించుకొని మంచంలోంచి లేచాడు.
డడ్డనకడం.. డడ్డనకడం..
డప్పుల శబ్దానికి అజీమొద్దీన్ కాళ్లు లయబద్ధంగా ఆడుతున్నాయి.
ఆ వృద్ధుడిలో ఏనుగంత బలం ఎక్కడినుంచి వచ్చిందో కానీ.. ఇంట్లో నుంచి వాకిట్లో వరకు పెద్దపులిలా ఎగురుతున్నాడు.
ఊరంతా చప్పట్లు..
నేను కూడా కలెక్టర్ని అని మర్చిపోయి కొంతసేపు ఎగిరాను.
అరగంట గడిచింది. దగ్గరికి రమ్మని సైగ చేశాడు.
నేను వెళ్లాను.
పెద్దపులి పుర్రెతో నా నుదుటి మీద డెచ్చగొట్టాడు.
డప్పుల శబ్దం మరింత పెరిగింది. ఆ తర్వాత ఆ పుర్రెలోనే అతని ఊపిరి ఆగిపోయింది. నిజమైన పెద్దపులిలా కుప్పకూలాడు. నివ్వెరపోయాను. పుర్రె తీశాక.. ఆ వృద్ధుడి ముఖంలో వెయ్యి చంద్రుల వెన్నెల వెలుగులు.
ఒక ఆనందం.. గంభీరత! అతని ముఖంలో ఒక దర్పం.. ఒక తేజస్సు!
‘నా రాకతోనే అతను చనిపోయాడా!?’ అన్న అనుమానం కొందరికి వచ్చినా… అజీమొద్దీన్ శవపేటిక నేనూ ఎత్తుకున్నాను.
ఒక ప్రవక్తను భుజాలపై మోసినంత తృప్తి.
అతని అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాను.
ఇప్పటికీ నా దృష్టిలో అతడొక పెద్దపులే!
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో రూ.3 వేల బహుమతి పొందిన
కథ.
“సార్.. అజీమొద్దీన్ భార్య చనిపోయి ఏడేళ్లయింది. ఇద్దరు కొడుకులు ఉంటే.. హసన్ దుబాయిలో చనిపోయాడు. హుస్సేన్ మస్కట్లో పోయిండు. అప్పటినుంచి చూసుకునేందుకు ఎవరూ లేరు. ఇంకో నాలుగు రోజులు అయితే ఈ ముసలోడు కూడా చనిపోతాడేమో!?”.
కందుకూరి వెంకట నరేందర్ మూడు దశాబ్దాల రచనా ప్రస్థానంలో.. ఎన్నో వైవిధ్యమైన కథలు అందించారు కె.వి. నరేందర్. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ ఈయన స్వస్థలం. ఇదే మండలంలోని రాఘవపట్నం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 180 కథలు, 4 నవలలు, 45 కవితలు, 4 నాటికలు, 18 వ్యాసాలు రాశారు. కొన్ని ఏకాంశ కథా సంపుటాలు తీసుకొచ్చారు. ‘గర్భగుడి’ నాటికకు నంది పురస్కారంతోపాటు, 2016లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ తెలంగాణ రచయిత అవార్డు, దశాబ్ది ఉత్సవాల్లో విశిష్ట కథా రచయిత పురస్కారం అందుకున్నారు. గత ఏడాది ‘నమస్తే తెలంగాణ – ముల్కనూర్’ కథల పోటీలో ‘వృత్తి’ కథకు బహుమతి దక్కించుకున్నారు. అవ్వ, బర్రె, ముంపు, వృత్తి, నడిపోడు నాకిష్టం, దొర మల్లా వచ్చిండు, ముంపు కథలు శాతవాహన విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశాలుగా చేరాయి. ఇద్దరు పరిశోధకులు ఈయన రచనలపై పీహెచ్డీ చేశారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ ‘డెచ్చ’ కథ రాసినట్లు రచయిత చెబుతున్నారు.
-కందుకూరి వెంకట నరేందర్
94404 02871