ఒకప్పుడు వేలాది భారీ ట్రక్కులు నడిచి నడ్డి విరిగిన రోడ్డుపై.. వాటినుంచి జారిపడి ఇంకా మిగిలిన ఖనిజాల అవశేషాలను తొక్కుకుంటూ.. దుమ్మూ, ధూళీ రేపుతూ భారంగా జోడా నుంచి కియొంజర్ వైపుగా కదులుతున్నది ఓ ముసలి ట్రక్కు. అందులో ఇరవైమంది దాకా కూర్చుని ఉన్నారు. ఎవరి ముఖంలోనూ సంతోషం లేదు. జీవితంలో ఓడిపోయినవాళ్లలా ఉన్నారు.
యుద్ధం ముగిశాక మిగిలిన మరుభూమిలా ఉంది. రోడ్డుకు ఇరువైపులా వదిలేసిన ట్రక్కులు, ఎక్స్కవేటర్లు.. సగం కాలిన కాష్టంలా ఉన్నాయి. దారి పొడుగూతా లాడ్జిలు, మెకానిక్ షెడ్లు, చిన్న చిన్న హోటళ్లు, వాటిని ఆనుకుని కిళ్లీ కొట్లు.. అన్నీ మూతపడినవే! ఈ రోడ్డు అనే కాదు.. ఒరిస్సా రాష్ట్రంలో మూతపడిన గనులు ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇవే దృశ్యాలు. అవన్నీ చూస్తుంటే ట్రక్కులో కూర్చున్నవాళ్లకు తమ గతం, వర్తమానం గుర్తుకు వచ్చి.. తెలియని భవిష్యత్తు గురించి కడుపులో దేవినట్టయింది. మైనింగ్ జరుగుతున్న రోజుల్లో జన సందోహంతో, కేరింతలతో తిరునాళ్లలా ఉండేది ఆ ప్రాంతమంతా. కాసుల, మందుగ్లాసుల, చేతిగాజుల గలగలలూ. బడా కంపెనీలతో సహా అందరూ అనుమతి ఇచ్చినవాటికి ఎన్నోరెట్ల వైశాల్యంలో తవ్వుకుని తరలించేశారు. గనులు అక్రమంగా తవ్వారని, మైనింగ్ ఆపేయమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చి నాలుగేళ్లవుతున్నది. తిరునాళ్లలో వందల బాంబులు పేలినట్టయింది. ట్రక్కులో కూర్చున్నవాళ్ల జీవితాలన్నీ అప్పుడే ఛిన్నాభిన్నమయ్యాయి.
చిన్నగా చినుకులు మొదలై.. ఓ మోస్తరు వర్షం పడుతున్నది. ఎవ్వరూ ఆగుదామని కానీ, ఒంటిపై గుడ్డ కప్పుకొనే ప్రయత్నం కానీ చేయలేదు. చిన్నపాటి వర్షాలకు చెట్టు కిందో, గోడవారో ఆశ్రయం చూసుకునే.. తడిస్తే జలుబు, జ్వరాలు తెచ్చుకునే శరీరాలు కావవి. బతుకు
దెరువు కోసం రోజూ పరుగులెత్తవలసిన వాడితో ఎండా, వానా కూడా స్నేహం చేస్తాయి. వారిలో ఎవరిని కదిలించినా ఒక కన్నీటి కథే.‘మా కథలు మేమే చెప్పుకొంటాం!’ అంటున్నారు వాళ్లంతా.
సాహు :నా పేరు అశోక్ సాహు. మాది కియొంజర్ జిల్లా. నేను దుబాయిలో సూపర్వైజర్గా కొన్నేళ్లు పనిచేశాను. కొంత డబ్బు వెనకేసుకున్నాక కుటుంబానికి దూరంగా ఉండలేక, 2009లో మా రాష్ర్టానికి తిరిగొచ్చేశాను. మా ప్రాంతమంతా మైనింగ్ కార్యకలాపాలతో చాలా సందడిగా ఉండేది. ఎటు చూసినా డబ్బే!
ఒకటి, రెండు ట్రక్కులు ఉన్నవాళ్లు ఖనిజం తోలడానికి తమ బండ్లను కాంట్రాక్టర్లకు అప్పజెప్పేవాళ్లు. నా స్నేహితుడు పట్నాయక్ జీతానికి పనిచేసే ట్రక్కు డ్రైవర్. ఒక కాంట్రాక్టర్ దగ్గర నమ్మకంగా పనిచేసేవాడు. రాబడి చూసి కాంట్రాక్టర్ సలహా మీద వాడు అప్పుచేసి రెండు బండ్లు కొనుక్కుని, ఒక డ్రైవర్ను పెట్టుకున్నాడు.
దుబాయి నుంచి వచ్చి.. ‘ఏం చెయ్యాలా?’ అని ఆలోచిస్తున్న నేను కూడా.. మూడు ఎక్స్కవేటర్లు కొని అద్దెకిచ్చాను. సరిగ్గా సంవత్సరానికి అక్రమ మైనింగ్ అంటూ కోర్టు రాష్ట్రంలోని అన్ని గనులపైనా నిషేధం విధించింది. ఇవ్వాల్సిన డబ్బులో కొంత కాంట్రాక్టర్లూ ఎగ్గొట్టారు. ఇలాంటి వందలాది ట్రక్కులు, ఎక్స్కవేటర్లకు పనిలేక, వేలంలో అమ్ముడుపోక ఇలా రోడ్డు పక్కన అనాథ శవాల్లా పడి ఉన్నాయి.
నేనూ నా ఎక్స్కవేటర్లను ఎక్కడో అక్రమంగా పుట్టిన బిడ్డల్లా ఇక్కడే వదిలేశాను. అప్పు ఇచ్చిన బ్యాంక్ వాళ్లు స్వాధీనం చేసుకుని వేలం వేసినా సగం బాకీ కూడా తీరలేదట. మిగిలిన మొత్తం వసూలుకు కోర్టులో కేసు వేశారు.
‘బడా కంపెనీలకైతే వేలకోట్లు రుణాలు తీసుకొని.. వ్యాపారం దెబ్బతిన్నా, కంపెనీ వాడు దెబ్బేసినా బ్యాంకుల వాళ్లు అంతగా పట్టించుకోరు. కొంత మొత్తం వసూలు చేసి.. మిగిలిన మొత్తం మాఫీ చేస్తారు’ అని దాస్బాబు చెప్పాడు. అలా ఎగ్గొట్టినవాళ్లు ఇప్పటికీ విలాసవంతమైన భవనాల్లో జీవిస్తూ, ఖరీదైన కార్లలోనే తిరుగుతున్నారు. ఇదెలా సాధ్యం?
నా పరిస్థితే కొంత మెరుగు. పట్నాయక్కు అన్నీ అప్పులే. బండ్లన్నీ అప్పులవాళ్ల పరమైపోయాయి. కానీ, అవి కొనేవాళ్లే లేక రోజూ వచ్చి బండబూతులు తిడుతూ, ఇంట్లో చేతికందిన సామాను పట్టుకుపోయారు. వాడి కథ నేనెందుకు చెబుతున్నానంటే.. వాడే చెప్పుకోవడానికి ఇప్పుడు లేడు. ‘ఈత కొట్టడానికి బైతరిణీ నదికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు’ అంటారు ఇంట్లోవాళ్లు. అలా చెప్పకపోతే ఇన్సూరెన్స్ రాదు కదా! వాడు రాసిపెట్టిన ఉత్తరం దాచిపెట్టేశారు. కొందరు తెలివితక్కువ వాళ్లు ఉరేసుకున్నారు. పురుగుల మందు తాగారు.
విత్తనాల్లాంటి మమ్మల్ని మా ప్రమేయం లేకుండానే బడా కంపెనీలు అనబడే కలుపు మొక్కల మధ్యకు ఎవరు విసిరారు? బతుకుదామని ఆశపడి చిగురించి లేత కొమ్మలైన మా మనుగడ పరిస్థితి ఏమిటి?
మాఝి :
నా పేరు నారాయణచంద్ర మాఝి. నేను గనుల్లో పనిచేసేటోడిని. గనులు మూతపడి చాలా రోజులు పని లేకపోవడంతో, మా యజమానిని బామాలి ఆయనదే మూతపడిన స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీగా కుదురుకున్నాను. నేను చేసిన అప్పులు, నా అవసరాలు మీనవడి ఇరవైవేల కోసం ఫ్యాక్టరీలో బిల్లెట్లు దొంగతనం సేసి దొరికిపోయినాను. ఆర్నెల్లు జైలు సిచ్చ అనుభవించి, ఈ మధ్యే బైటికొచ్చినాను.
‘ఇన్ని వేల కోట్ల ఖనిజం అక్కరమంగా తరలిపోనాది కదా! కోరటు ఏం సెప్పింది బాబూ!’ అని దాస్బాబును అడిగినాను.‘దండిగా జరిమానాలు ఏసారు.. అదంతా ప్రభుత్వానికి జమ అయ్యి, ఆపై ప్రజలకు చేరతాది’ అని అన్నాడు దాస్బాబు. జరిమానాలు ఏసారే తప్ప.. ఒక్క యజమానికి కానీ, పెబుత్వ అధికారికి కానీ జైలు సిచ్చ పడలేదే! అని ఆశ్చర్యమేసినాది. అంటే దొంగతనం సేసిన సొమ్ము ఎనక్కి ఇచ్చేత్తే.. జైలుకు ఎల్లక్కర్లేదన్నమాట. ‘నా దగ్గరా సొమ్మంత వసూలు సేసినా.. మరి నాతో ఊచలు ఎందుకు లెక్కెట్టించినారు?’ అనేది నా ప్రశ్న. సదూకున్నోడు కదాని సాహుబాబుని అడిగినాను. ‘నువ్వో వ్యక్తి సొమ్ము దొంగతనం చేశావు. వాళ్లు ప్రజల సొమ్ము దిగమింగారు.. అదే తేడా!’ అన్నాడు.
బారిక్ :
నా పేరు గోపాల్ బారిక్. మా ఊళ్ల చుట్టూ గనులు వెలిశాక దేవతలకు మొక్కినట్టు మేమూ వాటికి మొక్కినాం. మా చేతి వృత్తులు, మా తెలివితేటలు, మేం చేసేటి ప్రయోగాలు.. అన్నీ ఈ కొత్త ఉద్యోగాలతో మట్టికొట్టుకు పోయినాయి. వచ్చిన డబ్బుతో జలసాలు, నేరాలు, అక్రమ సంబంధాలు, విడాకులు పెరిగినాయి. మా జిల్లానుంచి లక్షల కోట్ల ఖనిజం తవ్వుతారు. మా ఊళ్లను ముంచెత్తిన దుమ్మూ, ధూళీ మా ఊపిరితిత్తుల్ని, ఒంటిని తినేసినాయి. మా పొలాలు పండవు. మంచినీళ్లు దొరకవు. మందు దొరుకుతాది. గనులు తవ్వితే కలిగే నస్టాలను పూడ్సడానికి కంపెనీలు ఏం చెయ్యాల్నో కాయితాల మీన ఉంటై. గమనించాల్సిన ప్రబుత్వం నిదరోతా ఉంటది. మైనింగ్ కోసరం కొంపా, గోడూ లాకున్నవాల్ల గోస యేరే! గనులుంటేనే పనులు. బడా కంపెనీలు తప్పుడు లెక్కలు చూపించినాయని, ఎక్కువ తవ్వుకెళ్లి పోయినారని గనులు మొత్తంగా మూసేసి.. మా ఊరి జనాల నోట్లో మళ్లీ మట్టికొట్టినారు.
మా తమ్ముడిదీ నాలాంటి బతుకే. తను మాత్రం బేవార్సుగా తిరుగుతూ ఏ చింతా లేకుండా కాలం యెల్లమారుస్తున్నడు. కనీసం నా భార్య నాలుగిళ్లలో పనులు చేస్తాది. మా మరదలు అయితే రోగిష్టిది. ఏ పనీ చెయ్యలేదు పాపం! మరి సంపాదన ఎలా అంటారా? ఎదిగిన వాడి కూతురు సంపాయిస్తంది. ఏం చేస్తందని మాత్రం అడగమాకండి. నా నోటితో సెప్పలేను. నాకూ కూతురే కదా అయ్యేది. తనే కాదు. మా ఊళ్లో చాలామంది అమ్మాయిలు అదే చేస్తారు. ‘బతకాలి కదా!’ అంటారు.
కలి పురుషుడు నాలుకను ఒక చేత్తో, పురుషాంగాన్ని రెండో చేత్తో పట్టుకుని వచ్చినాడని చెబుతారు కదా! నాలుక రుచి తీరగానే మగాడికి రెండో చేత్తో పట్టుకున్నదాని ఆకలి మొదలవుతాది. పాపం ఆడదానికి కడుపు నిండాలంటే.. ఆ ఆకలి తీర్చేదానికి మగాడి పక్కన పండాలి.
మాకీ దుస్థితి ఎందుకు కలిగినాది? మా ఉద్యోగాలు ఎందుకు పోయినయి? కస్టపడి పనిచేసే చేతులకు ఆదరువు చూపించే బాద్యత ఎవురిది?
నాయుడు :
నా పేరు అప్పల్నాయుడు. మాది సికాకుళం జిల్లా. ట్రాక్టర్తో మట్టి తోలే పని. మా ఊరు ఒరిస్సా రాష్ర్టానికి సరిహద్దులో ఉంటది. మా అత్తోరిది ఒరిస్సా రాష్ట్రమే! అంచేత రాకపోకలూ ఎక్కువే. మావోడొకడు అక్కడ గనుల్లో జేసీబీ తిప్పుతా.. బాగా సంపాయించాడు. వాడి సలహామీదనే మేమూ ఇక్కడ చేరాం. మాలాంటి తెలుగు వాళ్లూ బాగానే ఎగబడ్డారు. నేను డ్రైవర్గా పనిసేస్తానే.. అప్పులు సేసి మరీ మాయావిడతో హొటేలు పెట్టించిన. మా బామ్మర్ది పక్కనే కిళ్లీకొట్టు పెట్టేడు. గనులతోపాటు మా బతుకుదారీ మూసుకుపోనాది. ఇదే మా తెలుగు సిన్మా హీరో అయితే అక్రమ గనుల్ని బాంబులేసి పేల్చేసి, యజమానుల్ని సంపేసి వాళ్ల ఆస్తులన్నీ మాకు రాసిచ్చేటోడు. నా పెళ్లాం సాహుబాబుతో ఆళ్ల బాసలో సెప్పుకొని ఏడ్సింది.
‘అన్నా! నాకు నలభై ఐదు దాట్నాదా? మా ఆంధ్రాలో మా కులపు ఆడోళ్లకు పదేనేలు ఇత్తన్నారా? మా ముసిలోల్లిద్దరికీ కలిపి నెలకి నాలుగేలు పెన్సనా? నా పెనిమిటి ఆటొ తోలతా ఉండుంటే పదేలా. మా బొట్టిలిద్దర్నీ ఇస్కూలికి పంపతా ఉంటే ముప్పై ఏలా? పని సెయ్యకుండా తిని తొంగున్నా సమ్మచ్చరానికి లచ్చ రూపాయలు వచ్చి పడేటియి. ఈ ముదనట్టపోడు ఈడ్నేదో నొల్లేసుకుందావని తెచ్చి పడేసిండు. ఇక్కడ ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు సేసుకున్నవేగానీ.. ఊరక వచ్చిపడే సొమ్ము ఆసించలే. మరి మా బతుకులు ఇలా ఎందుకు కాలినయ్?’..
బేరాలు బాగున్నాయని స్థలం లీజుకు తీసుకుని, పెద్ద షెడ్డు వేసి భారీగా అడ్వాన్సులు ఇచ్చి కుర్రాళ్లను పెట్టుకుని.. నష్టపోయిన ట్రక్కుల మెకానిక్ రత్నాకర్ ముదులి, గనుల మూసివేతతో మూతపడిన పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు.. ఇలా ట్రక్కులో ఉన్న మిగిలిన అందరిదీ తలా ఒక కథ, అదే వ్యథ.
‘మనమెందుకు నష్టపోవాల? మనమేమైనా గంజాయి పండించినామా? సరుకు నల్లబజారులో అమ్ముకున్నమా? గనులు అక్రమంగా తొవ్వినమా? పుకార్లు నమ్మి అత్యాశతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన జనాలు కాము మనం. మన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?’ ఈ ప్రశ్నలు వాళ్లను తొలిచేస్తున్నాయి.“దీనికంతటికీ కారణం ఏట్రా? మన బతుకులిలా ఎందుకు తగలడ్డాయ్?” అడిగాడు ఒకడు.
“దాస్బాబునే నిలదీయాల్రా!” అన్నాడు మరొకడు.
అందుకే మూకుమ్మడిగా బయలుదేరారు. ఉపాధి పోయి, వ్యాపారాలు నష్టపోయి జీవితాలు అగమ్యగోచరంగా తయారైనపుడు.. వీళ్లంతా ఏ గమ్యం వైపు వెళ్తున్నారు? ఏ ప్రశ్నను సంధించడానికి వెళ్తున్నారు? తమ జీవితాలు గాడిన పడటానికి ఏం సమాధానం కోరుకుంటున్నారు?
తమ ప్రశ్నకు సమాధానం దాస్బాబు చెప్పాలని వాళ్ల మొండిపట్టు. దాస్ బాబు అంటే.. బిశ్వజిత్ దాస్. ఎవరీ బిశ్వజిత్ దాస్?
దాస్ బాబు :
నమస్కారం. నా పేరు బిశ్వజిత్ దాస్. కియొంజర్ జిల్లా కేంద్రంలో నేనొక పాత్రికేయుడిని.
దోపిడీ, దొంగతనాలు, ఆక్రమణలకు గురికాకుండా డబ్బు బ్యాంకుల్లో, బంగారం, దస్తావేజులు లాకర్లలో. ఖాళీ స్థలానికి ప్రహరీ. వస్తువులకు ఇన్సూరెన్స్. ఇంటికి సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు.. మనిషికి తనది అనేసరికి ఎన్ని జాగ్రత్తలో! అదే ప్రభుత్వ సొమ్మును ప్రజలు తమ సొమ్ముగా భావించరు. తమదిగా తాదాత్మ్యం చెందరు. వాటివల్ల నేరుగా, ఇప్పటికిప్పుడు తమకు వచ్చే, కనిపించే రాబడి ఏమీ ఉండదు. భవిష్యత్ తరాల గురించి చింత ఉండదు. ఇలాంటి ఆస్తులు, సంపద అన్యాక్రాంతం కావడం సులభం. వీటిని నిత్యం పహరా కాస్తూ, కంట కనిపెట్టుకునుండే కాపలాదారులు కొంతమంది ఉంటారు. బతుకుపోరాటంలో ఎవరికివారు తలమునకలై ఉంటే.. సమాజం కోసం శంఖారావం పూరించేవాడు ఒకడుంటాడు. అలాంటి వాళ్లల్లో నేనూ ఒకడినని అందరూ అంటారు.
రాజకీయ నాయకుల అండదండలతో నిబంధనల్ని అతిక్రమించి, తుంగలో తొక్కి, ప్రభుత్వాధికార్లను బాగా మేపి.. ఒడిశా రాష్ట్రమంతటా ఒక దశాబ్దం పాటు అడ్డంగా, అక్రమంగా మైనింగ్ చేసి, కొన్ని కంపెనీలు వేల కోట్లకు పడగలెత్తాయి. ఇదే మేము బయటపెట్టాం. తవ్వినకొద్దీ ఖనిజం అయినా అయిపోతుంది కానీ.. నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ రాశి ఎత్తు, వైశాల్యం మానవమాత్రుడు కొలవలేనంతగా ఉన్నాయి. న్యాయస్థానం ఉత్తర్వులతో మైనింగ్ చాలా సంవత్సరాలు దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది.
మానసిక, శారీరక ఉద్వేగాల్లాగే.. ఆర్థిక ఉద్వేగం అని ఒకటుంటుంది. అది ఉత్తేజంలానే కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్, షేర్లు.. అలాగే మైనింగ్. ప్రగతిరథం పరుగులెడుతున్నట్టే కనిపిస్తుంది. అది వాలులో అదుపు లేకుండా జారిపోతోందనీ, తమను ఎక్కడో కింద పడేసి తొక్కుకుంటూ వెళ్లి ఆగిపోతుందనే ఎరుక సామాన్య ప్రజలకు కలగదు. అవకాశాలు ఎలా వస్తున్నాయనేది అసంగతం. సామాన్య ప్రజలతో సహా అందరూ పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. అనుమతి ఇచ్చిన దానికన్నా ఇన్ని రెట్ల అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుని ఉంటే.. పాపం వాళ్లీ పెట్టుబడులు పెట్టేవాళ్లే కాదు.
మనం, మన పిల్లలు బాగుంటే సరిపోతుందా?
ముని మనవళ్లు, వాళ్ల ముని మనవళ్లు బతకొద్దా? మన ముత్తాతలు, మన పూర్వికులు ఇలానే స్వార్థంతో ఆలోచించి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి? మనం సంపాదించిన దాంట్లో అంతా ఖర్చు పెట్టెయ్యం కదా! దాచిపెట్టుకుంటాం కదా! మరి ఇది కూడా ప్రకృతి ఇచ్చిన సంపద కాదా? కనీసం మనం సంపాదించింది కూడా కాదని వాళ్లకు చెప్పేవాడిని. ‘అధర్మయుద్ధం చేస్తున్నవాడికి కాకుండా క్షతగాత్రులకు నీతి బోధిస్తున్నానా?’ అనిపించేది నాకు. విచ్చలవిడి మైనింగ్ వల్ల దెబ్బతినే ప్రకృతి సమతుల్యత, మానవ సంబంధాలు.. వీటి గురించి చెప్పినా వాళ్లకు అర్థం కాదు.
ప్రభుత్వపరంగా తీసుకునే అరకొర చర్యలు, న్యాయస్థానాల్లో జరిగే జాప్యం, అహేతుకమైన నిర్ణయాలు మీకు తెలియంది కాదు. మైనింగ్ ఆగిపోవడంతో పరిశ్రమలు మూతపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది జీవితాల్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసింది. మొదటి రెండు, మూడేళ్లలోనే ఉపాధి కోల్పోయి, వ్యాపారాల్లో పెట్ట్టిన పెట్టుబడులు నష్టపోయి, చేసిన అప్పులు తీర్చలేక చితికిపోయిన వాళ్లు వేలల్లో ఉన్నారు. ‘ఎవరు చేసిన తప్పు.. ఎవరు బలయ్యారు?’ అది తల్చుకుంటేనే వేదనగా ఉంటుంది.
అలా నష్టపోయిన సాహులాంటి వాళ్లు..
“మీతో పని ఉంది సార్! వస్తున్నాం..” అని ఫోన్ చేస్తే, వాళ్లకోసం ఎదురు చూస్తున్నాను.
జోరు వర్షం. గమ్యస్థానం చేరిన ట్రక్కునుంచి వాళ్లంతా కిందికి దిగారు. అప్పటికే ఆ చుట్టుపక్కల నివసించే ఓ పదిమంది అక్కడ వేచి ఉన్నారు. దాస్బాబు ఇంటి తలుపు తట్టారు. వాళ్లను చూసి దాస్బాబు ఆశ్చర్యపోయాడు.
‘ఇంత వర్షంలో ఇంతమంది కలిసి ఎందుకు వచ్చారో? ఏమైనా జరిగిందా?’ అనుకున్నాడు.
వాళ్లల్లో చాలామంది తనకు తెలిసినవాళ్లే.
“ఏంటి సాహూ? ఇలా వచ్చారు?” అడిగాడు దాస్బాబు.
“మిమ్మల్ని ఒకటడగాలని వచ్చాం బాబు!”.
“అడగండి!”.
ముప్పై కంఠాలు ఒక్కటై.. సాహు గొంతు నుంచి బాణంలా సూటిగా.. గాలి హోరును అధిగమించి, వర్షపుధారను చీల్చుకుంటూ వెలువడిందో ప్రశ్న!
ఆశ్రయమిస్తున్న చెట్టుపైనే పడిన పిడుగులా ఉందా ప్రశ్న.
‘కాళీయమర్దనం ఎందుకు చేశావ్?’ అని కృష్ణుడిని ఆబాల గోపాలం నిలదీసినట్టుందా ప్రశ్న!
దాస్బాబుకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది.
తాము పోరాటాలు చేస్తూ సమన్యాయం, పారదర్శకత అనే సామగ్రితో కడుతున్న ప్రజాసౌధం కుప్పకూలినట్టయింది.
ప్రజల ఉమ్మడి సంపదను దోచేస్తూ, అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్న రాజకీయ నాయకుల, బడాబాబుల, అధికారుల చర్యలకు వత్తాసు పలుకుతూ, న్యాయాన్ని ప్రశ్నించే గొంతుకలుగా ఎందుకు మారాయి?
‘మాకు బతుకుదెరువు ముఖ్యం.
ఏ దారైతేనేంటి’ అనే నిస్సహాయత వాళ్లను
ఆ ప్రశ్న వేయడానికి ఉసిగొల్పింది.
ఇంతకూ ఏమిటా ప్రశ్న?
“గనులు అక్రమంగా తవ్వితే తప్పేంటి
దాస్బాబూ?”.
అనిసెట్టి శ్రీధర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసరావుపేట. బి.ఎస్సీ చేశారు. 1990 నుంచీ కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 32 కథలు రాశారు. పలు కథలు ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 15 కథలతో 2008లో తీసుకొచ్చిన ‘కొత్త బంగారులోకం’ కథా సంపుటిని కారా మాస్టారు ఆవిష్కరించారు. మరో 16 కథలతో సరికొత్త సంపుటిని ఈ ఏడాది తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2011లో ‘నివేదన’ కవితా సంపుటిని తీసుకొచ్చారు. పలు ప్రముఖ పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ‘పాతసామాను’, ‘మద్దతు’, ‘జనజీవన స్రవంతి’, ‘శాహా వర్సెస్ మాహా’ కథలకు బహుమతులు అందుకున్నారు. ‘కొత్తబంగారు లోకం’ కథకు సి.పి.బ్రౌన్ అకాడమీ నుంచి బహుమతి దక్కించుకున్నారు. 1993లో వచ్చిన ఇరవై ఉత్తమ కథల్లో ఒకటిగా ఈయన రాసిన ‘నెత్తురు కూడు’ కథ ఎంపికైంది.
అనిసెట్టి శ్రీధర్