‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో ప్రత్యేక బహుమతి పొందిన కథ.
ఈరోజే నా ఉద్యోగానికి ఆఖరు రోజు. నా సహోద్యోగులంతా కలిసి నేను పనిచేసే బల్లముందే వీడ్కోలు సభకు ఏర్పాట్లు చేశారు. నా పని గంటలు పూర్తయ్యి, కంపెనీకి తిరిగి ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఇచ్చేశాక.. కార్యక్రమం ప్రారంభమయింది.
సహోద్యోగులు ఒక్కొక్కరుగా మాట్లాడుతూ.. ఇన్నేళ్ల నా సర్వీసులో.. రోజువారీ కూలీ మొదలు ఆపరేటర్లు, టెక్నీషియన్లు, ఇంజినీర్లకు నేను చేసిన సాయం, వారి అభివృద్ధి కోసం నేను తీసుకున్న చొరవను గుర్తు చేసుకున్నారు. కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత నాతో సన్నిహితంగా పనిచేసిన సహచరుడు మూర్తి మాట్లాడాడు.
“రాజాగారు నాకు ఈ ఉద్యోగానికి ముందునుంచీ తెలుసు. సామాన్యమైన ఆర్థిక పరిస్థితులతో జీవితం ప్రారంభమైనా స్వయంకృషితో పైకొచ్చి, తనతోపాటు సహచరులనూ ముందుకు తీసుకెళ్లిన నాయకుడు. ఈయన తండ్రి నిజంగా సామ్యవాదాన్ని ఆచరించాలని ప్రయత్నించిన అతికొద్దిమందిలో ఒకరు. సొంత ఆస్తులకూ, అవసరానికి మించి డబ్బు కూడబెట్టడానికి వ్యతిరేకి. కనుకే తోచిన సాయాలు చేసుకుంటూ తనకోసం కానీ, పిల్లల కోసం కానీ ఏమీ వెనకేసుకోలేదు. ఆ ధోరణితోనే భార్యకూ, పిల్లలకూ వారసత్వంగా ఏమీ ఇవ్వలేకపోయారు. అటువంటి పరిస్థితులలో రాజాగారు అన్ని అడ్డంకులనూ ఎదుర్కొని, ఇంత పైకి రావడానికి కారణం.. ఆయన మనోబలమూ, తెలివి తేటలే! అలాంటి మనిషితో పనిచేయడం నా అదృష్టం” అన్నాడు.
దీపావళికి సరుకులు కొన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆవిడ పిల్లలకు కూడా మాతో సమానంగా సరుకులు తీసుకొస్తే మేము అలిగేవాళ్లం. మేము తినే ఫలహారాలు వారికి కూడా పెడితే కోపగించుకునే వాళ్లం. నెమ్మదిగా మాలో ఆయన కోరుకున్న మార్పు వచ్చింది. అందువల్ల మాలో జీవితం పట్ల ఇంకా ఉత్సాహం పెరిగింది.
రాజు మాట్లాడుతూ.. “తండ్రి బుద్ధులతోనే రాజాగారు కూడా ప్రతిరోజూ ఒక తెలియని వ్యక్తికి సాయం చేసే వ్రతాన్ని చిన్నప్పటి నుంచీ పాటించారు. కానీ, ఆయన తండ్రిలా ఉన్నదంతా అందరికీ పంచి పిల్లలను రోడ్డుమీద పడేయకుండా కొంచెమైనా దాచుకోవాలి” అన్నాడు.
ఇక కర్మాకర్.. “ఆయన ఇంకా చదువుకోవాలని అనుకున్నా పెద్దల బలవంతంతో పెద్ద చదువులు వదిలి ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదివి ఎంతో ఎదిగారు. మనందరికీ ఆదర్శమయ్యారు. ఇక్కడ వారి సాయం తీసుకోని వారు ఒక్కరు కూడా లేరనేది పచ్చినిజం. స్వయంకృషితో పైకొచ్చిన రాజాగారు ఉద్యోగ విరమణ చేసినా ఇంకా ఎంతో ఎదుగుతారు” అని కరతాళ ధ్వనుల మధ్య చెప్పాడు. ఎందరో మాట్లాడాక నావంతు వచ్చింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పుకొన్నాక నా వైపునుంచి మాట్లాడటం మొదలుపెట్టాను.
“మీరందరూ నాకు కూడా తెలియని ఎన్నో మంచి విషయాలను గుర్తుకుతెచ్చి మరోసారి నా సంతృప్తికరమైన జీవితాన్ని గుర్తుచేశారు. నిజానికి మీరందరూ సంస్కారవంతులు కనుక నన్నెంతో పొగిడారు తప్ప.. నేను మీరందరూ చెప్పినంత గొప్పవాడిని కాను. మన ఇంటి అరుగు ఒకరికి కూర్చోవడానికి చోటిస్తే.. మన ఇంటి చెట్టు నలుగురికి నీడనిస్తే సంతోషించడం మనమంతా పాటించే పద్ధతే కదా! నా దృక్పథానికి సరిపోయేలా నా ఆఖరు పనిదినంలో ఆఖరు గంట వరకూ నేను నా బాధ్యత నిర్వహించే వరకూ వేచి ఉండి, నాకు సౌకర్యంగా నా దగ్గరికే మీరొచ్చి ఈ వేడుక ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు” అని చెప్పి ముగించబోయాను.
“రాజాగారూ! ముప్పై ఏళ్లకు పైగా మాతో పనిచేసి, మీరు ఇంత క్లుప్తంగా ముగిస్తే కుదరదు. మీ అనుభవాలను చెప్తారనీ.. ఈరోజు కూడా మీనుంచి ఏమైనా తెలుసుకుందామని అనుకునేవాళ్లం ఎందరో ఉన్నాం. దయచేసి మరికొంచెం సేపు మాట్లాడండి” అన్నాడు నూకరాజు. “మీ సహనానికి సంతోషం. నాకూ చెప్పుకోవాలనే ఉంది. మీకు ఒక అరగంట ఎక్కువ సమయం కాదనుకుంటే ఇంతవరకూ ఎవరికీ చెప్పని ఎన్నో విషయాలు ఈరోజు చెప్పాలని అనుకుంటున్నాను”.. అని మొదలుపెట్టాను.
మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నాన్నకు మాతోపాటు తన తమ్ముళ్లతోనూ, చెల్లెళ్లతోనూ ఉన్న బాధ్యతల వల్ల నాకు ఆయనతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఎందరో ఇంటికి వచ్చేవారు. వచ్చినది ఎవరైనా నాన్న తలుపు వరకూ వచ్చి స్వాగతం చెప్పడం, ఆ అతిథుల్ని ఒక్కక్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా వారితో గడిపి.. వారు వచ్చినప్పుడు ఎంత మర్యాద చూపారో అదే స్థాయిలో వెళ్లేవారికి వీడ్కోలు ఇచ్చేవారు. వచ్చినవారికి జరిగే మధ్యతరగతి స్థాయి మర్యాదలు కూడా అందరికీ సమానమే. ప్రెసిడెంట్ రాధాకృష్ణగారు వచ్చారు.. ఆరుద్రగారు వచ్చారు, యువ రాజకీయ నాయకుడిగా ఉన్న వెంకయ్య నాయుడు గారూ వచ్చారు. ఎప్పుడో మా ఇంట్లో పనిచేసిన గోవిందమ్మ వచ్చేవారు. ఆయన దగ్గరికి సందేహాలతో విద్యార్థులు వచ్చేవారు. మా కాలేజీలో వడ్రంగి పనిచేసే జోగారావు వచ్చేవారు. మా వీధిలో దొంగతనం చేసి దెబ్బలు తింటుంటే, నాన్న రక్షించిన పాషా వచ్చేవారు. అందరికీ ఒకే మర్యాద.
దీపావళికి సరుకులు కొన్నప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆవిడ పిల్లలకు కూడా మాతో సమానంగా సరుకులు తీసుకొస్తే మేము అలిగేవాళ్లం. మేము తినే ఫలహారాలు వారికి కూడా పెడితే కోపగించుకునే వాళ్లం. నెమ్మదిగా మాలో మార్పు వచ్చింది. అందువల్ల మాలో జీవితం పట్ల ఇంకా ఉత్సాహం పెరిగింది. మనవారు అనుకున్న వారి దగ్గర ఎంతో సర్దుకుని బతికే మనం.. ఎక్కువమందిని మనవారు అనుకుంటే మరింత సంతోషంగా బతకగలం కదా!
ఎలాంటి సాయమైనా నాన్న చేయగలరా లేదా అనే సంకోచం లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. అంతేకాదు నాన్నకేవో తరతరాల ఆస్తులు ఉన్నాయనీ, అందుకే ఎవరికైనా సాయం చేసేస్తున్నారనీ అనుకోవడం విన్నాను. ఆయనకు జీతం తప్ప మరే సంపాదన లేదనీ, ఆఖరికి తన దగ్గర ప్రతిరోజూ సందేహాలు తీర్చుకునే విద్యార్థుల నుంచి కూడా ఏమీ తీసుకోరనీ చెప్పినా వారు నమ్మరు. ఎందుకంటే ఈ లోకంలో తెగబలిసిన వారు తప్ప ఎవరూ ఊరికే సాయం చేయరని లోకం నమ్ముతుంది కాబట్టి.
నేను ఉన్నత విద్యలో ఆఖరు సంవత్సరం పరీక్షలకు ప్రతిరోజూ నలుగురు స్నేహితులతో కలిసి చదువుకుంటూ ఉండేవాడిని. అలాగే నా స్నేహితుడి ఇంటికే వెళ్తున్నపుడు ఓ రోజు నాన్న.. “ఈ రోజు వెళ్లకపోతే ఏమైనా నష్టమా?” అని అడిగారు.“మేమందరం ఒక్కొక్క అంశం చదువుకుని ఒకరికొకరం వివరించుకుంటున్నాం. నేనీరోజు వెళ్లకపోతే మిగిలిన వారికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది” అని నేను బయల్దేరాను. అదేరోజు నా తమ్ముడు రాత్రి ఆటకు సినిమాకు వెళ్లాడు. ఎప్పుడూ లేనిది బస్సు ఎక్కేవరకూ టార్చ్లైట్ సాయంతో వాడిని దింపి వచ్చారు నాన్న. ఆ అర్ధరాత్రే.. గుండెపోటుతో ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆ రోజే నాన్న శాశ్వతంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతారని తెలిసి ఉంటే ఇద్దరం ఇంట్లోనే ఉండే వాళ్లమేమో! జరిగిన నష్టం నాకు తెలియడానికి, అందువల్ల కలిగిన అపారమైన నష్టం అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. పరీక్షలు మానెయ్యాలనుకున్నా.. అన్నయ్య బలవంతంగా రాయించాడు.
ఏ రోజుకారోజు చదువుకునేలా మాకు దినచర్య అలవాటు చేయించి, వర్షాలు వచ్చినా, బందులు జరిగినా కుంగకుండా కళాశాలకు వచ్చి పాఠాలు చెప్పిన గురువుల ఆశీస్సులతో, ఎన్ని కష్టాలలోనైనా పక్కన నిలబడి చదువులో సాయం చేసిన మిత్రుల సహకారంతో నేను పాసయ్యాను. బంగారు పతకమూ దక్కించుకున్నా.
కానీ, ఆ ఆనందం పంచుకోవడానికి నాన్న లేరు. ఆ విషాదంలో ఉన్న మిగిలినవారు కూడా నిర్లిప్తంగా ఉండిపోయారు. ఈ వాతావరణంలోనే ఉన్నత చదువుల కోసం నాకు ఖరగ్పూర్లో సీటొచ్చింది.
..ఇంతలో నాన్న మాటలు గుర్తుకొచ్చాయి.‘మనం చేసిన సాయం నుంచి ఏదైనా ఆశిస్తే.. అది సాయం కాదు. వ్యాపారం. ఎవరికి ఏం కుదిరితే అంతే సాయం చెయ్యగలరు’.. ‘నిజమే! నాకు రూమ్లో వంట చేసుకోవడానికి ఇతనే సాయం చేశారు. నడిచివెళ్తున్న నాకు మంచి బేరంతో సైకిల్ ఇప్పించి, నాకు చదువుకోవడానికి ఇంకాస్త సమయం మిగిలేలా చేశారు.
నాన్నకు రావాల్సిన పించన్ కోసం తిరుగుతున్నాను. నేను ఏ ఆఫీస్కు వెళ్లినా అందరూ లేచి నిల్చొని, నాన్నలేని లోటును గుర్తు చేసుకొని నాకు వీలైనంత సహాయం చేశారు. ఓరోజు పించను ఆఫీస్కు వెళ్లాను. ఆ సమయంలోనే పర్వతాలరావు అనే నాన్న సహోద్యోగి కొడుకు గిరి కూడా అదే పనిమీద వచ్చాడు. వాళ్ల నాన్న కూడా ఇంచుమించు అదే సమయంలో పోయారు. అతణ్ని చూడగానే గుమస్తా కళ్లెర్రజేసి..
“నిన్ను ఈవారం రావద్దని చెప్పాను కదా! మళ్లీ మళ్లీ వచ్చి ఎందుకిలా విసిగిస్తావ్?” అని గట్టిగా అరిచాడు.
‘నాకుకూడా అదే గౌరవం పడుతుందేమో?!’ అని నా గుండె గతుక్కుమంది.
‘నేనింకా మొదటిసారే వచ్చాను కదా!’ అనుకుంటూ, భయం భయంగా అతని దగ్గరికి వెళ్లి, అన్ని కాగితాలూ అతని ముందుపెట్టాను.
గిరి వెళ్లాక కూడా అవే ముఖ కవళికలతో, కోపంగా ఉన్న అతని ముఖంలో.. నన్ను చూడగానే ఒక్కసారిగా మార్పు వచ్చింది.
“మీరా బాబూ! మీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు చేయగలిగింది చేద్దాం! రిటైర్ అయ్యి పించనుకోసం వచ్చేవారయితే వాళ్లే తిరుగుతారు గానీ, పుట్టెడు దుఃఖంలో ఉన్న మీరిలా రాకూడదు. పని పూర్తయ్యాక మీ ఇంటికే వస్తాను” అన్నారు.
ఊహించని ఆ మంచితనానికి నేను ఆశ్చర్యపోయాను. ఏమిటీ విచిత్రం? అనుకున్నాను.
“నేను వారంలో ఖరగ్పూర్ వెళ్లిపోవాలండీ” అన్నాను దుఃఖం అణచుకుంటూ.
“అలాగా! పరవాలేదు బాబూ. ఈ లోపలే పనైపోతుంది. కాకపోయినా నేను ఇంటికి వచ్చి ఇస్తాను లెండి” అన్నారతను. మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరించి ఇంటికి వెళ్లాను.
మొదటిసారి ఒక్కడినే వేరే ఊరికి వెళ్లాల్సిరావడం వలన చాలా దిగులుగా ఉంది. నన్ను స్టేషన్ వరకూ సాగనంపడానికి వచ్చే సందర్భం కాదు కనుక.. బంధువులంతా అమ్మ దగ్గరే ఉండిపోయారు. ఒంటరిగా రైలెక్కాక బెంగ ఇంకా పెరిగింది. ఇంతలోనే పదిమంది కుర్రాళ్లు వచ్చారు.“నువ్వు ఖరగ్పూర్కే కదా! పద మనవాళ్లంతా ఎస్-ఫోర్ కోచ్లో ఉన్నారు” అని నన్ను తీసుకుపోయారు. వాళ్లతో కబుర్లు చెప్పుకొంటూ బాధను మరిచిపోయాను. బెంగను మరిచిపోవడానికి అందరితో స్నేహం చేసుకుని, నాకు ఏమాత్రం సమయం మిగలకుండా ఏదో ఒక వ్యాపకంలో పడిపోయాను.
నా స్నేహితులు కేవలం నా వయసువారే కాదు. రీసెర్చ్ స్కాలర్స్, ఉద్యోగంలో సెలవు తీసుకుని నాలాంటి చదువులు చదివేవారు, కొత్తగా చేరిన కుర్ర గురువులు, మెస్ ఉద్యోగులు, మా కళాశాల ఉద్యోగులు అందరూ స్నేహితులే.
ఇంత హడావుడిలోనూ బాధ్యత మరిచిపోలేదు. ఇంత చదువుకుంటూ సంపాదన లేకుండా ఉండకూడదని తెలుసు కనుక నా డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకున్నాను.
వరుసగా ఇంటర్వ్యూలకు ఉత్తరాలు వచ్చాయి. అందులో మొదటిది.. రాష్ట్రీయ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చింది. ఢిల్లీకి మొదటిసారి ప్రయాణం చేశాను. మొదటిసారి ముఖాముఖి సమావేశానికి వెళ్లేటప్పుడు భయం వేసింది. ఆ పెద్దగదిలో అయిదుగురు పెద్దవారు కూర్చుని ఉన్నారు. మధ్యలో ఉన్నాయన వాళ్లకు నాయకుడిలా ఉన్నారు.
నన్నేవో ప్రశ్నలు వేశారు. అడిగిన నాలుగైదు ప్రశ్నలకు సమాధానం బాగానే చెప్పాను. నేను జవాబులు చెప్తున్నపుడే ఆయన నా దరఖాస్తు పరిశీలిస్తున్నారు. మరేమీ ప్రశ్నలు అడగకుండా.. నన్నిక వెళ్లవచ్చని అన్నారు.
ఆయన పక్కనున్నతను.. “ఇంకా బొగ్గు నిర్వహణ, ఓడల్లో విద్యుత్తు ఉత్పత్తి చేయడం అవన్నీ అడగలేదు కదా!” అంటుంటే..
“చాలు.. మనకు వచ్చిన జవాబులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు” అంటూ ముందుకు వంగి ఏదో రాసుకున్నారాయన.
నేను అయోమయంగా ఖరగ్పూర్ వచ్చేశాను. నెల రోజుల తర్వాత ఆ సంస్థలో నియామకం అయినట్టు తెలియజేస్తూ ఉత్తరం వచ్చింది. సంతోషంతో ఉప్పొంగిపోయాను. చేరడానికి ఏమేమి కావాలో వారు పంపిన పెద్ద కాగితాల కట్టలో ఉన్నాయి. వారు జమ చేసిన పూచీకత్తు పత్రం మీద నేను రెండేళ్లు ఉద్యోగం వదలకుండా ఉంటానని నిర్ధారిస్తూ ఒకరి సంతకం అవసరం.
“అరే! ఇక్కడ నీకెవరు సంతకం పెడతారురా!?” అన్నాడు మిత్రుడు సాయి.
“ఒరేయ్! ఇక్కడ నాకున్న వందల మిత్రులలో ఆదాయపు పన్ను కడుతూ చదువుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు కచ్చితంగా సాయం చేస్తారు” అన్నాను నిశ్చింతగా.
“అదీ నిజమే!” అన్నాడు సాయి.
అందరిలో మంచి స్నేహితుడైన యోగీంద్రనాథ్ దగ్గరికి వెళ్లాను.
“నాకు ఉద్యోగం వచ్చింది!” అని చెప్పాను.
“సంతోషం! ఇంత మంచి వార్త ఇలా సులువుగా చెప్తావా? మిఠాయిలేవీ?” అన్నారతను.
“అవి కూడా ఉన్నాయండీ” అంటూ అతని చేతికి రెండు మిఠాయిలు ఇచ్చాను.
“ఇది కరెక్ట్!” అని అతను తింటుంటే..
“ఒక చిన్న చిక్కొచ్చిందండీ. మీకేం కష్టం కాదనుకోండి! నేను రెండేళ్లు ఉద్యోగం వదలనని పూచీకత్తు పత్రం మీద మీరొక సంతకం పెట్టాలి” అని ఎంతో నమ్మకంగా అతని చేతిలో కాగితాలు ఉంచి కలాన్ని చేతికిచ్చాను. యోగీంద్ర ఆ కాగితాలను అటూ ఇటూ తిరగేస్తున్నాడు. పది నిమిషాలైనా.. మళ్లీమళ్లీ కాగితాలను తిరగేస్తాడు తప్ప.. సంతకం పెట్టడేమిటి? అలాగే అటూ ఇటూ చూసి కాగితాలు వెనక్కి ఇచ్చేస్తూ..
“నా దగ్గర ఆదాయపు పన్ను అంకె లేదయ్యా! గుర్తు లేదు. అది లేకుండా నేను సంతకం పెట్టినా చెల్లదు” అన్నారు.
“మీరు పనిచేస్తున్న సంస్థ పేరు రాస్తే సరిపోతుందేమోనండీ!”.
“అబ్బెబ్బే అలా కాదు. మీకే ప్రమాదం. ఇంకెవరినైనా అడగండి” అన్నారు. నాకు ఒళ్లు మండింది. ‘అతని థీసిస్ కోసం నేను ఎంతో సాయం చేశాను. ఇప్పుడు నాకు సాయం చెయ్యాల్సి వచ్చేసరికి అర్థం లేని కారణాలు చెప్తున్నారు’ అనుకున్నాను. ఇంతలో నాన్న మాటలు గుర్తుకొచ్చాయి.
‘మనం చేసిన సాయం నుంచి ఏదైనా ఆశిస్తే.. అది సాయం కాదు. వ్యాపారం. ఎవరికి ఏం కుదిరితే అంతే సాయం చెయ్యగలరు’..
‘నిజమే! నాకు రూమ్లో వంట చేసుకోవడానికి ఇతనే సాయం చేశారు. నడిచివెళ్తున్న నాకు మంచి బేరంతో సైకిల్ ఇప్పించి, నాకు చదువుకోవడానికి ఇంకాస్త సమయం మిగిలేలా చేశారు. ఇప్పుడు నేనడిగిన సాయం.. ఆయన వల్ల కాదేమో లే.. ’ అనుకొని అతని గదిలోంచి బయటికి వచ్చాను.
“ఏమయ్యా బావున్నావా” అన్నారు రామకృష్ణ. రామకృష్ణగారు మా కాలేజీలో అధ్యాపకుడు. ఇక్కడ రీసెర్చ్స్కాలర్. ఆయన ముక్కు పొడవుగా వంపులు తిరిగి ఉంటుందని అందరూ ‘చిలక మాస్టారు’ అని చెప్పుకొనేవారు.
“బాగానే ఉన్నానండీ” అంటూ ముందుకు నడిచాను.
ఈ సారి చిన్మయి బెనర్జీ దగ్గరికి వెళ్లాను. ముందు ఉద్యోగం వచ్చిందని చెప్పి, మిఠాయిలు ఇచ్చి నెమ్మదిగా విషయం చెప్పాను.
“అయ్యో! మా జ్యోతిష్కుడు ఈ ఏడాది ఏ పత్రం మీదా సంతకాలు చేయవద్దన్నాడే!” అన్నారు బెనర్జీ.
“ఇది ఆస్తుల లావాదేవీ కాదు కదా!?”.
“ఏమో! ఆయన ‘సంతకం వద్దు’ అన్నాడంటే వద్దనుకోవడమే మంచిది కదా!”.
“నిజమేనండి!” అని గది బయటికి వచ్చాను.
మరో రెండురోజుల్లో నాకు అర్థమయ్యింది. ఒక్కరు కూడా నాకు సహాయం చెయ్యడానికి ముందుకు రావడం లేదు. మా ప్రొఫెసర్లను కూడా అడిగి లేదనిపించుకున్నాను. ఒక్కొక్కరూ వారి నిస్సహాయతకు చెప్పిన కారణాలు వినూత్నంగా, వైవిధ్యంగా.. కథలు రాసుకోవడానికి ఎంతో అనువుగా ఉన్నాయి. నేను ఉద్యోగంలో చేరడానికి ఆఖరు రోజు దగ్గర పడుతున్న కొద్దీ.. నాలో ఆందోళన పెరుగుతున్నది.
వేసవికాలం ఎండల్లో నేను పిచ్చోడిలా తిరుగుతుంటే.. మళ్లీ చిలక మాస్టారు (రామకృష్ణ గారు) నాకు ఎదురొచ్చారు.
“ఏమయ్యా బావున్నావా?” అని ఆప్యాయంగా పలకరించారు.
అసలే నా పని ఏమవుతుందో అనే ఆందోళనతో తిరుగుతున్న స్థితిలో ఆయనకు ప్రతినమస్కారం కూడా చేసే ప్రయత్నం చేయకుండా ముందుకు వెళ్తూంటే..
“ఏమయ్యా రాజా! చాలారోజుల నుంచి చూస్తున్నాను. చేతిలో ఫైల్ పట్టుకుని తిరుగుతున్నావు. ఏమిటి విషయం?” అన్నారతను.
ఇక తప్పదని విషయం చెప్పాను.
“ఉద్యోగం వచ్చిందా! చాలా మంచిది. ఫామ్ నింపుకొని రా.. సంతకం పెట్టేస్తాను” అన్నారాయన. ఊహించని ఆ మాటకు ఆశ్చర్యపోతూ, అయినా ఒకింత అనుమానంతోనే..
“చాలా థాంక్స్ సర్. అందులో ఏమి రాసుందో ఒకసారి చదివితే మంచిదేమో” అన్నాను.
“అవసరం లేదు. బసవరాజు గారి కొడుకువి. నువ్వేమీ మోసం చెయ్యవులే. చెయ్యలేవు. రేప్పొద్దున్నే మా ఇంటికి వచ్చేయ్. భోజనం చేసి వెళ్దువు గాని. ఇలా ఎండలో తిరగకు” అన్నారు.
ఆయనకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియక ఇబ్బందిగా నుంచుంటే..
“మీ నాన్న అయితే ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఎంతోమందిని నమ్మి సహాయం చెయ్యలేదూ. మరి ఆయన శిష్యుడిగా నేను మరోలా ఉండలేను కదా! రేపు ఇంటికి వచ్చేయ్” అని నన్నింకా ఇబ్బంది పెట్టకుండా, అక్కడినుంచి కదిలారు చిలక మాస్టారు. కాదుకాదు.. రామకృష్ణ మాస్టారు.
నాన్న మరో సందర్భంలో చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
‘మనం ఒకరికి అప్పు ఇస్తే వారు తీర్చేయడం మన వ్యావహారికం. కానీ, దేవుడి లెక్కలు చాలా సంక్లిష్టమైనవి. నీకు సాయం చేసే వారు నీనుంచి సాయం పొందిన వారే కానక్కరలేదు!’.
సమస్య ఆ విధంగా పరిష్కారం అయ్యింది కనుక అన్ని డాక్యుమెంట్లు తీసుకుని ఢిల్లీ వెళ్లాను. ఇరవై అంతస్తుల భవనంలో వెతుక్కుని మానవ వనరుల అధికారి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్లాను. నేను వెళ్లేసరికి అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు.
“కష్టం శాస్త్రిగారూ! రోజుకు వందమంది పైగా చేరుతున్నారు. అప్పుడప్పుడూ నేను ఉండను” అంటున్నారు రాధాకృష్ణ.
అవతలి నుంచి ఎవరో మాట్లాడుతుంటే.. మళ్లీ సమాధానంగా..
“సరే నా ప్రయత్నం చేస్తాను” అని అతను చెప్తుంటే.. నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఆయన ముందు ఉంచాను.
ఆ ఆర్డర్పైనే కనిపిస్తున్న నా పేరు చూడగానే అతను..
“ఒక్కసారి ఆగండి శాస్త్రిగారూ! అతను ఇప్పుడే వచ్చాడు” అని చెప్పి,
“మిస్టర్ రాజా! సీతారామశాస్త్రి గారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు” అన్నారు.
“ఆయనెవరు?” అన్నాను అయోమయంగా.
“ఆయనకు మీరు తెలుసు. మాట్లాడండి” అంటూ ఫోన్ అందించారు.
నేను అయోమయంగా ఫోన్ తీసుకుంటే.. అవతల నుంచి,
“నేను సీతారామశాస్త్రిని మాట్లాడుతున్నాను” అన్నారు ఎవరో.
ఆయనెవరో తెలియక నేను మౌనంగా ఉంటే..
“మీ నాన్న, నేనూ స్నేహితులం. సాయంత్రం మా ఇంటికి రా” అని ఇంటిదారి చెప్పారు.
నేను వెతుక్కుంటూ ఆయన ఇంటికి వెళ్లేసరికి.. నన్ను ఇంటర్వ్యూ చేసిన జట్టుకు నాయకుడే సీతారామశాస్త్రి గారని అర్థమయ్యింది. నాలో నాన్న పోలికలు గమనించగానే, ఆయన నా దరఖాస్తు పరిశీలించి మరెక్కువ ప్రశ్నలు వేయకుండా ఉద్యోగానికి ఎంపిక చేసి ఉండొచ్చని నాకు అర్థమయ్యింది. ఆ మాటే అంటే ఆయన నవ్వేసి..
“చదువులో బంగారు పతకం కూడా సంపాదించుకుని ఉత్తీర్ణుడివైన నిన్ను ఎన్నుకుంటే ఎవరూ ప్రశ్నించలేరు” అన్నారు. కానీ.. నిజం నిజమే. ఈ ఉద్యోగం నాన్న చలవే!
వాళ్ల పిల్లలను పరిచయం చేశాక.. వాళ్లు లోపలికి వెళ్తే, ఎందుకో వాళ్ల రెండో అమ్మాయి అక్కడే ఉండి నాతో చాలాసేపు మాట్లాడింది. తను బొద్దుగా ఉన్నా కొన్నాళ్లు సరదాలు వదులుకోకూడదనే ప్రస్తుతం ఎటువంటి వ్యాయామాలు చెయ్యడం లేదనీ, ఒక్కసారి తలుచుకుంటే అవన్నీ పెద్దకష్టం కాదనీ ఇంకా ఏమేమో మాట్లాడింది. తర్వాత మా అన్నయ్యకు ఇంకా పెళ్లి కాలేదనే విషయం కూడా పెద్దవాళ్లు తెలుసుకున్నారు. అప్పుడు వారి ముఖంలో కొంచెం నిరాశ కనిపించింది. ఆ వయసులో నాకు అర్థం కాకపోయినా.. వారు నాకు పిల్లను ఇవ్వాలనుకున్నారని తర్వాత తెలిసింది. ఏ ఆస్తీలేని నన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటే అందులో నా గొప్పతనం కన్నా నాన్న మంచితనమే కారణమని త్వరలోనే అర్థమయ్యింది.
ఆ తర్వాత నాకు ఫరక్కాలో పోస్టింగ్ వచ్చినప్పుడు ఊరుకాని ఊరిలో భాషరాక కొట్టుమిట్టాడుతున్న నన్ను ఆదుకున్నది.. నాన్న శిష్యులు చంద్రశేఖర్ గారే! ఇలా చెప్పుకొంటూ పోతే చాలానే ఉంది. కానీ, అనుక్షణం నాతోపాటు నాన్న మంచితనం దన్నుగా వస్తూనే ఉంది.
“నామీద ఎంతో ప్రేమతో కొందరు మా తండ్రి మాకు వారసత్వంగా ఏ ఆస్తీ ఇవ్వకుండా వెళ్లిపోయారని అన్నారు. వారి ఆప్యాయతకు సంతోషించినా.. వారి మాటను మాత్రం ఒప్పుకోలేను. పదవీ విరమణ రోజు ప్రతివారూ వారెంత స్వయంశక్తితో పైకొచ్చారో, ఎంతో కొంత కల్పించి కూడా చెప్తారు. నేను కూడా అంతేనేమో.. కానీ, నేను నిజాయితీగా చెప్పాలనుకున్నది ఒకటే. నేను సంపాదించింది ఏమిటంటే.. నాన్న ఆశీర్వాదం. ఆయనిచ్చిన జన్మ. మా నాన్న నేనెప్పటికీ కోల్పోని వారసత్వాన్ని ఇచ్చారు. ఆయన మంచితనమే నాకు తరగని ఆస్తిగా మిగిలింది. ఆయన బాటలోనే నడిచి నేను కూడా మీలాంటి ఎందరో ఆప్తులను సంపాదించుకున్నాను. ఈ ఆస్తినే నేను నా పిల్లలకు వదిలివెళ్తాను. అలా అని మీరందరూ నాకేదో ప్రతిఫలంగా మా పిల్లలకు సాయం చేస్తారని నా ఉద్దేశం కానే కాదు. నాన్న చెప్పినట్టు దేవుడి లెక్కలు వేరే ఉంటాయి” అని ముగించాను. నా ఉపన్యాసానికి ఎలా స్పందించాలో తెలియక నిశ్శబ్దంగా ఉన్న ఆ సభకు నమస్కరించి, నెమ్మదిగా వేదిక నుంచి దిగుతుంటే.. నాన్న నా పక్కనే నడుస్తూ ఇంకా నా వెనకే ఒక దన్నుగా వస్తున్నట్టు అనిపించింది.
రాజమోహన్ ఇవటూరి
రాజమోహన్ ఇవటూరి స్వస్థలం విశాఖపట్నం. ఆంధ్ర విశ్వ విద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. టెక్ మహీంద్రాలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేసి, 2021 నుంచి సొంత సంస్థను నడుపుతున్నారు. 1994 నుంచి కథలు రాస్తున్నారు. మొదటి కథ ‘ఓ తమ్ముడి కథ’.. రచనలో ప్రచురితమయింది. ఇప్పటివరకూ యాభైకి పైగా కథలు రాశారు. తిక్క శంకరయ్య కథ.. విమర్శకుల ప్రశంసలు పొందడంతోపాటు ‘మిసిమి’ పత్రికలో అచ్చయ్యింది. ఓ తమ్ముడి కథ, అవ్వగారు కథలకు బహుమతులు దక్కాయి. వీరి తండ్రి జ్యేష్ఠ పేరిట ఏర్పాటుచేసిన ‘జ్యేష్ఠ లిటరరీ ట్రస్ట్’ ఆధ్వర్యంలో 1990 నుంచి ఏటా ఉత్తమ కథ, ఉత్తమ కథా సంకలనాలకు పురస్కారాలు అందిస్తున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తకాలను ప్రచురిస్తున్నారు. తన స్వీయ అనుభవాల నుంచే.. ‘వారసత్వం’ కథకు ప్రాణం పోశారు రచయిత రాజమోహన్.
…? రాజమోహన్ ఇవటూరి
98661 00175