జరిగిన కథ : ఒకనాడు.. గజశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టమని జాయపుడికి సూచించాడు చక్రవర్తి గణపతిదేవుడు. ‘తప్పకుండా బావగారూ..’ అంటూ, ఆ పనిపై పడ్డాడు జాయపుడు. అనుమకొండ చుట్టూ ఉన్న పాతిక గజ స్థావరాలన్నిటినీ సందర్శించాడు. అక్కడ ఏనుగులకు ఇస్తున్న యుద్ధశిక్షణ చూశాడు. ఇప్పటికే అతని శిక్షణలో ధీర.. ‘కాహళి’ కూజితం వినగానే పాతికమందినైనా చంపేసేలా రూపుదిద్దుకున్నది.
ఇప్పుడు ఒక్క ఏనుగుకు కాదు.. ఏనుగుల మంద.. పది నుంచీ యాభైవరకు ఉన్న మందకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు జాయపసేనాని. ఒక దళంలో ఉన్న ఏనుగుల మంద మొత్తం.. తన కూజితాల ప్రకారం యుద్ధక్షేత్రంలో ఎలా ప్రవర్తించాలో.. తదనుగుణమైనఆజ్ఞలను నేర్పుతున్నాడు.
ఎంతదూరాన ఏనుగుల మంద ఉన్నా..జాయపుని బూరశబ్దం వినిపిస్తే చాలు.. తదనుగుణంగా ప్రవర్తిస్తాయి.
శత్రువును తొక్కితొక్కి చంపేస్తాయి. తొండంతోఎత్తి అవతలకు విసిరేస్తాయి. ‘మిత్రుడు’ అనే సంకేత కూజితం వినిపిస్తే చాలు.. కాపాడి ఈగ వాలకుండా స్కంధావారం చేరుస్తాయి.
సాధారణంగా ఏనుగు సాధుజంతువు. కానీ, మందగా ఏనుగులు అత్యంత క్రూరమైనవి. ఊహాతీతమైన విలయాన్ని, విధ్వంసాన్ని సృష్టించగలవు. వంద నివర్తనాల పంటభూమిని లిప్తలకాలంలో పాడు చేయగలవు. వందలమంది మహాయోధులను కూడా చుట్టుముట్టి.. వారి రథాలు, ఆయుధాలను లెక్కజేయక తొక్కితొక్కి చంపగలవు. కావాల్సింది సరైన ఆజ్ఞ.. మార్గదర్శనం!
జాయపసేనాని శిక్షణలో కాకతీయ ఏనుగుమందలు సృష్టించబోయే విధ్వంసకాండను చూడాలంటే మరో యుద్ధం ఏదో రావాల్సిందే!!
జాయప గజశిక్షణాశాలకు వచ్చిన సంగతి చక్రవర్తికి తెలియజేశాడు గజసాహిణి కొమరయ. తన మాటను గౌరవించి గజశాలకు వెళ్లిన జాయపపై గణపతికి అభిమానం పొంగగా.. తంత్రిపాలుడు ముచ్చనాయకుడు, రుద్ర సేనాని..
‘హమ్మయ్య.. గజశిక్షణ ఇక ఓ గాడిన పడుతుందిలే!’ అని నిట్టూర్చారు.
తర్వాత జాయపుడు పట్టణ భవన నిర్వహణ నియోగ అధికారి కొండపెద్దిని కలిశాడు.
“రాజనగరి లోపల ఉండటం.. చెప్పకూడదు గానీ, నాకూ చక్రవర్తులవారికి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నది పెద్దిగారు. దయచేసి నాకు రాజనగరి బయట.. ఏదైనా భవంతి వసతిగా ఏర్పాటుచేయండి. వీలయితే అంగళ్ల చతుష్పథం వద్ద అయితే గజశిక్షణశాలలకు వెళ్లడానికి వసతిగా ఉంటుంది. చిత్తగించగలరు”.
“అదెంత భాగ్యం సేనాని జాయపా! తప్పకుండా..” అన్నాడు కొండపెద్ది.
అంగళ్ల చతుష్పథం వద్ద మంచి మిద్దె ఉన్న భవంతిని జాయపుడికి కేటాయించాడు కొండపెద్ది. మరునాడు కొండపెద్దిని కలిసి హత్తుకున్నాడు. “మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడంలేదు. చాలా చాలా పెద్ద ఇబ్బంది తొలగించారు. మరో చిన్న విషయం. ఈ సంగతి.. అదే.. నాకు బయట భవంతిని కేటాయించినట్లు చక్రవర్తిగారికి తెలియకూడదు సుమా! అది మీ బాధ్యత..” అన్నాడు.
ఇది రహస్యంగా ఎందుకు ఉంచాలో.. ఎలా ఉంచాలో తెలియక లోలోన కుళ్లిపోయాడు కొండపెద్ది.
జాయపుని మిత్రబృందం ఇకపై అంగళ్లవీధిలో రాతిబండపై కూర్చోకుండా.. అదే అంగళ్లవీధిలోని రాజభవంతిలో కూర్చుంటారన్నమాట! ఇప్పుడు జాయపునికో భవంతి.. రాచనగరు బయట!
మరో పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు జాయపుడు. అది అతని వివాహం.
ఉదయం జాయపుడు కనిపించగానే నారాంబ అతని వంక కళ్లప్పగించి చూస్తుంది. రాత్రి పొద్దుపోయేవరకు ఎప్పుడు ఎదురైనా.. అదే చూపు! ఆ చూపులకు అర్థం జాయపునికి తెలుసు.
“వివాహం సంగతి ఏమిటి?”. అంగీకారంగా తల ఊపితే.. ఆమె సిద్ధం చేసుకున్న జాబితా ఉంది. వందమంది వధువుల వివరాలున్న జాబితా. అవన్నీ వేదపఠనంలా అప్పజెప్పగలదు. తలవంచుకుని మాట్లాడి.. తలవంచుకుని వెళ్లిపోతుంటాడు. అయితే ఇటీవల గణపతిదేవుని చూపులు కూడా నారాంబ చూపుల్లాగే కనిపిస్తున్నాయి జాయపుడికి.
ఇంట అక్క అయితే.. బయట బావగారు. చూపుల్లో మాత్రం ఒక్కటే అభ్యర్థన!!
“మొన్నటికి మొన్న చాలా ముఖ్యమైన సమావేశంలో ఉండగా ఎవరో విదేశీ వణిజులు.. పేరు.. పేరు గుర్తు రావడంలేదు. ఆయనకు కుమార్తె ఉన్నదట. ‘జాయప సేనానులవారి సంగతి ఏమిటి దేవరా!?’ అన్నాడు!”.
“ఆ.. నాకు చెప్పకుండా ఎవ్వరికీ మాటివ్వకండి. మన నగరిలోనే బోలెడు సంబంధాలు. మీ సోదరులట. అక్కడెక్కడో పాకనాడు ప్రధానమంత్రి గారట.. వారి అమ్మాయి. అబ్బ.. చిదిమి దీపం పెట్టొచ్చు!”.
“అయితే నూనె ఎందుకు అయ్యవంశం వారికి!? కోడలి అందాన్ని చిదిమి దీపం పెట్టుకోవచ్చన్నమాట!”.
పకపకా నవ్వుతాడు. నిత్యమూ.. ప్రతిరాత్రి ఆ దంపతుల మధ్య ఇదే చర్చ.. ఇదే సంభాషణ. గతంలో పెద్దల నివాసాలకు అతిథిగా వెళ్లినప్పుడు కూడా ఇదే అంశం. ముచ్చట్ల నడుమ..
‘మా బంధువుల్లో తగిన అమ్మాయి ఉంటే బావుండును. జాయపుణ్ని బంధువుగా చేసుకుందుము..’ అన్న భావనలు వారి ముఖాలలో కనిపించేవి.
రాజనగరి నివాసులలో కూడా అవే భావనలు.. పెళ్లి.. వివాహం.. పాణిగ్రహణం!!
ఎవరు చూసినా పెళ్లి ప్రశ్నలే.. ఎవరు పలకరించినా పెళ్లి పలకరింపులే!
రాజప్రాసాదం కేంద్రంగా తన జీవితాన్ని లిఖించుకునే ప్రయత్నాలు ఓ కొలిక్కిరాకుండానే ఈ వివాహ ప్రతిపాదనలు జాయపుణ్ని చిరాకు పరుస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థంకాని గందరగోళం. అప్పుడో వ్యక్తి గుర్తుకువచ్చాడు. నాగంభట్టు!!
మరునాడు సంధ్యవేళకు నాగంభట్టు నివాసానికి వెళ్లి, రాజప్రాసాద జీవితంలోని గందరగోళమంతా ఏకరువు పెట్టాడు జాయపుడు.
“ఆ రోజుల్లో వీధుల్లో తిరిగినా.. సుబుద్ధిమామ ఇంటి అరుగులపై పడుకున్నా హాయిగా ఉన్నాను. కానీ, రాజప్రాసాదంలో ఆ ప్రశాంతత లేదు. ఏమిటో నాకేమీ అర్థం కావడంలేదు గురుదేవా!”.
ఇద్దరూ నాగంభట్టు ఇంటిముందున్న చిన్నపాటి ఉద్యానవనంలో కూర్చున్నారు. చల్లగాలి ఒళ్లంతా నిమురుతున్నది. తులనాత్మక ఆలోచనలపై చందమామ లేతనవ్వులతో వింజామర వీస్తున్నాడు. వసారాలో సంజెదీపం మౌనంగా ఆత్మీయంగా రెప్ప వెయ్యకుండా చూస్తున్నది. అప్పటివరకూ జాయపుడితో ఆడిన నాగంభట్టు పిల్లలు.. తండ్రి ఆజ్ఞపై లోపలికి వెళ్లినా, లోపలినుంచి తలుపు చాటుగా జాయపుణ్ని చూస్తున్నారు.
“నువ్వు ద్వంద్వ భావనలతో ఘర్షణ పడుతున్నావు జాయపా! వద్దు. అలాంటి తులనాత్మక చర్చ వద్దు. నీలో నువ్వు మదనపడటం అనవసరం. నువ్వు ప్రాథమికంగా రాజప్రాసాద బిడ్డవే కదా. ఆ ధోరణిలోనే ఆలోచించు. ప్రవర్తించు. మాతో అనుమకొండ వీధులలో గడిపిన ఏడేళ్లు ఓ అనుభవపాఠం మాత్రమే. నువ్వు గొప్ప ఆలోచనాపరుడివే కాదు.. నిర్వహణాదారుడివి కూడా. యుద్ధవీరుడివే కాదు.. యుద్ధతంత్రుడివి కూడా. నాట్యకారుడివేకాదు.. నాట్యజ్ఞానివి కూడా. నువ్వు ఈ సమాజానికి చేయాల్సింది చాలా ఉంది. కళాభాషలో చెప్పాలంటే.. దేశీ, మార్గి సామాజిక జీవితాలు రెండిటినీ అద్భుతంగా మేళవించగల మహామేధావివి నువ్వు. అసందిగ్ధ ఆలోచనలు మదిలోనికి రానివ్వకు. నీ నుంచి ఈ సామ్రాజ్యానికి గొప్ప ప్రతిష్ఠను ఆశిస్తున్నాను”.
ఏదో చెప్పబోయాడు జాయపుడు.
“తక్షణమే నువ్వు నిర్వహించాల్సింది నీ వివాహం. అక్కా బావ నిర్ణయించిన రాచరిక యువతిని వివాహం చేసుకో. నీలోని ద్వంద్వం పూర్తిగా తొలగిపోతుంది.
విజయోస్తు!!”.
మరునాడు నారాంబ ఎప్పటిలాగే చూపుల ప్రశ్నార్థకాలు సంధించగానే.. మృదువుగా నవ్వాడు.
ఎప్పుడూ నిర్వికారంగా ఉండే తమ్ముని ముఖంలో కదలాడుతున్న సిగ్గు దొంతరలను పసిగట్టి దగ్గరకొచ్చింది.
చేతులు రెండూ పట్టి ముఖంలోకి చూస్తూ..“ఏదో మార్పు నీముఖంలో కనిపిస్తున్నది. చెప్పరా జాయా.. ఏమిటి విషయం?”.
కాసేపు వంకరలు తిరిగి..
“నీ ఇష్టం అక్కా! నువ్వు బావగారు నిర్ణయించిన అమ్మాయి నాకు కూడా సమ్మతం కావాలి సుమా..” అన్నాడు.
ఆనంద జలపాతమేదో మీదికురికినట్లు ఉక్కిరిబిక్కిరై పోయింది నారాంబ. నీటి దెబ్బలకు తల్లడిల్లిపోయింది.
అక్క వద్ద సుముఖత వ్యక్తంచేసేశాడు చాలు.. ఇక వాళ్లు నిర్ణయించిన అమ్మాయిని అంగీకరించడమో.. తిరస్కరించడమో.. ఓ చిన్ననిర్ణయం.. ఈల వేసుకుంటూ బయటికి కదిలాడు జాయపుడు.
“నాట్యాచార్యులకు వందనాలు.. శుభవార్త!”.
కోట బయట శ్రీవాకిలి నియోగభవంతి వద్ద
ఆపాడు అంకమరట్ట. మాంచి ఉత్సాహంగా ఉన్న జాయపుడు
హాయిగా నవ్వి..
“చెప్పుచెప్పు.. ఏమిటా శుభవార్త??” అన్నాడు.
“మీరు చెప్పిన ఆ అయ్యనవోలు అమ్మాయి తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చారు!”.
కొయ్యబారిపోయాడు జాయపుడు. ఓ లిప్తకాలం అయోమయం.. రెండులిప్తల కాలంలో తేరుకున్నాడు.
“నిజంగా శుభవార్తే అంకమా! అయితే నేను అయ్యనవోలు వెళ్తాను తక్షణమే!”.
“లేదు స్వామీ.. ఆమె అనుమకొండలోనే ఉన్నదట. భైరయ చెప్పాడు. అనుమకొండలో ఆ నివాసం ఎక్కడో తెలియదు కానీ, పద్మాక్షి దేవాలయంలో నిత్యమూ రంగపూజనం నిర్వహిస్తున్నారట. బంధువులామెతో కలిసి”.
పద్మాక్షి దేవాలయం. ప్రత్యూషవేళ..
సాక్షాత్తూ అమ్మవారే మునగదీసుకు నిద్రిస్తున్నట్లున్నది దేవళం.. ఆముదపు దీపాల వెలుగులో.
వెలుగులేకున్నా స్పష్టాస్పష్టమైన చీకటిలో నిబిడీకృతమైన కాంతి. అప్పటికే నలుగురు గుడిసానులు కుచ్చిళ్లు నడుముకు దోపి.. దేవళమంతా ఊడ్చి కల్లాపి చల్లి రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. వారి పెదవులు ఏవేవో భక్తిపాటలు ఆలపిస్తుండగా.. కన్నులు అరమూతలై ఉన్నాయి.. మహాదేవిని కొలుస్తూ. అనంతరం పురోహితులు వేదం పఠిస్తూ అంతరాలయ ద్వారాలు తీశారు. వాద్యకారులు సిద్ధమై సన్నాయి, మృదంగాదులతో సంగీతార్చన మొదలు పెట్టగా.. గజ్జెలు ఘల్లుమన్నాయి. దివిటీ వెలుగులో పద్మాక్షమ్మ నగుమోము ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తున్నది. బయటి నుంచే.. దేవాలయ ప్రహరీపై నుంచి తలెత్తి చూపులతో వెతుకుతున్నాడు జాయపుడు.
అదిగో కాకతి!! స్థానకం తీసుకుని నృత్య నమస్కారం చేసింది కాకతి. వేదమంత్రాలు వల్లిస్తున్న పురోహితుడు..
“నృత్యం దర్శయామి” అన్నాడు. గజ్జె కదిపింది కాకతి. ఆ నాట్య సమ్మోహనానికి పద్మాక్షమ్మ రెప్పవెయ్యడం మర్చిపోయింది.
జాయపుడు కూడా! ఆమె పారిజాతం అరగంటపాటు ప్రదర్శించింది. పారిజాతం అంటే కృష్ణుడు – సత్యభామల ప్రేమ ఇతివృత్తం. వారిద్దరి మధ్య ప్రేమ, విరహం, దూరాలు, కోపతాపాలు.. ఈ కలాపవిద్య చాలా లలితంగా ఉంటుంది.
దేవునిలో లీనమై చేసిన అద్భుత నృత్య భోగం.. నిత్య నృత్యోత్సవం. ప్రతిరోజూ ఇలా ఏ గుడిలో అయినా ఆ దేవదేవుడికి రంగపూజ.. ఆనాటి నిత్యపూజలలో భాగంగా ఆరుసార్లు తప్పకుండా చెయ్యాల్సిందే! నృత్యంతోపాటు లోపల అర్చన పూర్తయ్యింది. అనంతరం కుంభహారతి ఇచ్చి, పుష్పాంజలి సమర్పించి అద్దమోహరి ప్రక్రియ పూర్తిచేసి.. ముక్తాయింపుగా కేళిక ప్రదర్శించింది కాకతి. కాకతి ఏకాగ్రత.. జాయపుణ్ని అబ్బురపరచింది.
‘ఆమెకున్నంత నిజాయతీ తన కళాభిజ్ఞతలో ఉన్నదా!?’ అని లిప్తకాలం జాయపుడు ఆత్మశోధనలో పడ్డాడు.
పూజాదికాలు ముగించుకుని గుడి బయటికి వచ్చిన రేణుకకు, కాకతికి ఎదురుగా జాయపుడు!!
అశ్వపు అంకెంలో కాళ్లు పెట్టి.. చేత కళ్లెంపట్టి కూర్చుని ఉన్నాడు జాయపుడు.
మగతనపు శలాక వంటి పాలరాతి విగ్రహానికి జరీ పూవులు, ముత్యాలు కూర్చిన హొంబట్టు పట్టుపంచె కట్టి.. మెడలో రుద్రాక్షమాల.. కొత్తగా కొనలుతీరిన తూనీగ మీసాలు.. యర్ర గోరంచుల తెల్ల ఉత్తరీయం కంచుకం మీదుగా, నడుబంధంగా చుట్టి అందులో వజ్రాలు పొదిగిన చురకత్తి.. పక్కగా వేలాడుతున్న వెండివర్ణపు కరవాలపు ఒర.. సాక్షాత్తూ మన్మథుడే దివినుంచి భువికి దిగివచ్చి తన ఎదుట ఉచ్చైశ్రవంపై సాక్షాత్కరించినట్లు.. రేణుక రెప్పవేయడం మర్చిపోయింది. పూలసజ్జె చంకలో పెట్టి జాయపుణ్ని రెప్పవెయ్యకుండా గుడ్లప్పగించి చూస్తున్నది రేణుక. కాకతి ఆమెను కదిపింది.
“అత్తమా.. ఏమిటా పరధ్యానం?”. రేణుక అదే పరధ్యానం.. అదే జాయప ధ్యానం..
(సశేషం)
– మత్తి భానుమూర్తి 99893 71284