జరిగిన కథ : పుళిందపుడితో కలిసి నడుస్తున్న జాయపుణ్ని ఓ పదిమంది బలాఢ్యులు చుట్టుముట్టి.. కళ్లకు గంతలు కట్టి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే, తనను అక్కడికి తీసుకొచ్చింది ముమ్మడినాయకుడేననీ, అందుకు పుళిందపుడు సహకరించాడని గుర్తించాడు జాయపుడు. పిష్టపుర యుద్ధం జరిగిన ఐదేళ్ల తర్వాత.. జాయపునిలోని యుద్ధవీరుడు తిరిగి మేల్కొన్నాడు. కారు చీకట్లోనే.. ఎవ్వరూ ఊహించనంత వేగంగా లేచి, ఆ ఆగంతకులందర్నీ పుష్టిగా కుమ్మాడు
జాయపుడు. ఆ తర్వాత గుర్తొచ్చింది జాయపునికి.. తన కంచుకంలో గజ్జెల పట్టీలు ఉన్నట్లు!
ఉదయం నాట్య గురుకులానికి వెళ్లిన జాయపుడు అటునుంచి జైన బసదికి వచ్చాడు. జైన బసది వద్ద పుళిందపుడు కలిశాడు. నాట్య అభ్యాసవేళ ధరించిన గజ్జెలపట్టీలు కంచుకంలోనే ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని మెల్లగా బయటికి తీసి.. తన చేతికి కట్టుకున్నాడు.
“ఒరే! ఎవడికైనా దమ్ముంటే.. ఇదిగో ఈశబ్దం నా చేతికున్న గజ్జెలపట్టీది. నన్ను గుర్తుపట్టిస్తుంది. రండి నాపైకి..” అంటూ గజ్జె కదిపాడు.
ఎవరో మీదికొచ్చాడు.. లిప్త కాలంలో చావుకేక పెట్టాడు. జాయపుడు కూడా చావుకేకలు పెడుతున్నాడు. మళ్లీ ఎవడో ఎవడి మీదో వచ్చిపడ్డాడు.. మరొకడెవడో అరిచాడు. ఈ అరుపులు.. గజ్జెల శబ్దాలు.. జాయపుని అరుపులు.. ముమ్మడికి ఏమీ అర్థం కావడంలేదు. కాసేపటికి అరుపులు, చావుకేకలు, గజ్జెల శబ్దాలు.. ఆగిపోయి అంతటా అందరూ రొప్పుతున్న శబ్దాలు.. దెబ్బలతో మూలుగులు వినిపిస్తున్నాయి.
అందులో జాయపుడు ఉన్నాడో లేడో ఆచూకీ తెలియడంలేదు ముమ్మడికి. రెండు లిప్తలకాలం చూసి
లేచి కాగడా వెలిగించాడు. కళ్లముందు కనిపించిన దృశ్యం చూసి అతనికి బతుకు మీద విరక్తి పుట్టింది. అతని మనుషులంతా చచ్చిపడి ఉన్నారు. కాస్త పక్కగా కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు జాయపుడు. అతని తలను గారంగా నాకుతూ విక్రమ.. అంత భయానక వాతావరణంలోనూ ముమ్మడిని ఆకర్షించింది గజ్జెల పట్టీ. ఓ సైనికుడి చేతికి కట్టి ఉంది. మరొకటి జాయపుని చేతికి కట్టి ఉంది.
తాపీగా చెప్పాడు జాయపుడు.
“ఓ వెధవకు గజ్జె కట్టాను. నేనే అనుకుని మిగతా వారంతా వాణ్ని కుళ్ల బొడిచారు. అనంతరం గజ్జెలపట్టీని మరొకడికి కట్టాను. అంతా వాణ్ని కొట్టికొట్టి చంపేశారు. అలా అలా మీవాళ్లందరికీ గజ్జెలు కడుతుంటే.. మీవాళ్లే మీవాళ్లను చంపేశారు!”.
జాయపుని పోరాట విన్యాసాల్లోని అద్భుతతత్వం ముమ్మడికి అర్థమయ్యేలోగా.. చిరుతపులిలా చెంగున ఎగిరి అతణ్ని ఒడిసి పట్టుకున్నాడు జాయపుడు. అతని ముష్టిఘాతాలకు ముమ్మడి పిచ్చికేకలు పెట్టసాగాడు. కాసేపు కందుకక్రీడ ఆడి ముమ్మడి లేచిన ఆసనంపై కూర్చుని, నరసింహావతారునిలా ముమ్మడిని ఒడిలో పెట్టుకుని.. లాఘవంగా కర్రను విరిచినట్లు నడుము విరవడానికి పైకి ఎత్తాడు.
“జాయప సేనాని! శరణు.. శరణు. క్షమించి అతణ్ని విడిచిపెట్టు!”..
ఎప్పుడు వచ్చాడో బిగ్గరగా ఏడుస్తూ కాళ్లపై పడి
వేడుకుంటున్న గొంతు పుళిందపుడిది.
లిప్తకాలం ఆగి ఉద్రేకంతో మళ్లీ అరిచి.. ముమ్మడిని పైకి ఎత్తాడు జాయపుడు.
“ఒక్క విరుపు.. నడుము విరిచి వదిలేస్తాను
పుళిందపా! అదీ నువ్వు చెప్పావని మాత్రమే సుమా!”.
బావురుమన్నాడు పుళిందపుడు.
“వద్దు వద్దు. దయచేసి విడిచిపెట్టు. నడుం విరిగితే సంసారానికి పనికిరాడు బిడ్డ! దయ చూడు సేనానీ!”.
జాయపునికి కళ్లముందు ఓ స్త్రీమూర్తి లీలామాత్రంగా గోచరించగా.. ముమ్మడిని సున్నితంగా పట్టి లేవనెత్తి కూర్చోబెట్టాడు. అప్పుడు తీశాడు కళ్ల గంతలు!!
తనువులెల్లా వణికిపోతుండగా చేతులు జోడించి కాళ్లపై సాష్టాంగపడ్డారు ముమ్మడి, పుళిందపుడు.
నాట్యంలాగే జాయపుని యుద్ధం కూడా అనేకానేక తాళ, లయబద్ధ విన్యాసాలతో చేసేది అని వాళ్లకు అర్థంకాదు.. ఎప్పటికీ!!
నడిరాత్రి అంతఃపురానికి చేరాడు జాయపుడు..
రాత్రి నియోగంలో ఉన్న కోట శ్రీవాకిలి నుంచి అంతఃపుర ప్రతిహారీ, కంచుకి వరకూ అందరికీ ఏదేదో నోటికొచ్చిన కతలు చెప్పి.. నవ్వించి కవ్వించి మోహపుచ్చి మోసపుచ్చి లోపలికి చేరాడు.
నిశ్శబ్దంగా ఉంది నారాంబ శయ్యాగృహం.
ఒకటో రెండో నూనెదీపాలు ఆవులిస్తూ మగతగా ఉద్యోగం చేస్తున్నాయి. పరిచారికలు వారి మందిరంలోకి నిష్ర్కమించారు.. నిద్రపోతున్న కన్నకొడుకులపై ఓ చేయి వేసి పల్యంకంలో కూర్చుని కుడ్యానికి ఆనుకుని జోగుతున్నది నారాంబ.
భర్త నిత్యమూ రాకపోవచ్చు. తోటికోడలి అంతఃపురానికి పోవచ్చు. మరేదైనా రాచకార్యం మీద వెళ్లవచ్చు.
భర్త రాలేదనే దిగులు ఆమెకు లేదు. తమ్ముడు వచ్చేవరకూ నిద్రపోదు. ఎక్కడ తిరిగినా జాయపుడు అక్క వద్దకు రావాల్సిందే!
తనకు భోజనం పెట్టడం కోసం వేచి ఉన్న అక్కను చూసి నిర్ఘాంతపోయాడు. ఆమెకు నిద్రాభంగం కాకుండా అడుగులో అడుగువేస్తూ పోయి సాహిణంలో నీటి గుండిగల వద్ద ఒళ్లు కడుక్కున్నాడు. రక్తపు మరకలు తుడుచుకున్నాడు. వచ్చి అక్కను కదిపాడు.
చటుక్కున లేచింది నారాంబ..
“అర్ధరాత్రి వరకు ఎక్కడికి పోయావురా జాయా! కాస్త రెండుముద్దలు తిని వెళ్లి వీధుల్లో తిరగవచ్చుకదా..” అన్నది ఆవులిస్తూ.
మౌనం.. మౌనం..
ఆమె పళ్లెరంలో ముద్దలు కలిపి తినిపిస్తున్నది. మౌనంగా శబ్దం రాకుండా మింగుతున్నాడు. హఠాత్తుగా ఆమె ముద్ద పెట్టడం ఆపి తమ్ముడి శరీరానికి ముక్కు ఆనించి.. వాసన పీల్చి అన్నది విభ్రమతో..
“ఏమిట్రా! ఏదో పేడవాసన. మట్టిలో దొర్లినట్లు.. గుర్రపు కంపు!”.. రోతగా ముఖంపెట్టి ముక్కు మూసుకుంది నారాంబ.
“ఏమీ లేదక్కా.. అశ్వం మీదినుంచి పడిపోయాను” అన్నాడు.
ఓ మహావీరుడు గుర్రం మీదినుంచి పడిపోవడం హాస్యాస్పదమని ఆమెకు తెలియదు. నమ్మేసింది.
అప్పటికప్పుడు బయటికి పరిగెత్తి కంచుకిని నిద్రలేపి వైద్యుణ్ని పిలిపించి.. తగిన మందులు తాగించింది. కాస్త విశ్రాంతిగా తమ్ముణ్ని పడుకోబెట్టి, ఒళ్లంతా స్వయంగా వేడినీటితో కాపడం పెట్టసాగింది. తెల్లవార్లూ ఏదేదో హడావుడి పడుతూనే ఉంది.
తెల్లవారి అంతఃపురానికి వచ్చిన గణపతిదేవుడు అడిగాడు ఆశ్చర్యంగా.
“ఏమైంది.. జాయా? నారాంబా.. ఏమైంది నీ ముద్దుల తమ్ముడికి..” అని.
ఏం చెప్పాలో తెలియక దుప్పటి పూర్తిగా కప్పుకొని మూలగసాగాడు జాయపుడు.
నారాంబ భర్తపై విరుచుకుపడింది.
“వాడు గుర్రం మీదినుంచి పడిపోయాడు. పాపం.. ఒళ్లంతా దెబ్బలు. కాస్త విశ్రాంతి తీసుకోనివ్వండి”.
లిప్తకాలం చూసి..
“అయ్యో పాపం! గుర్రానికి కూడా దెబ్బలు తగిలాయేమో.. జంతువైద్యుణ్ని పురమాయించావా?” అన్నాడు గణపతిదేవుడు. ఎప్పటిలాగే హాస్య ధోరణిలో.
“మీకన్నీ వేళాకోళంగానే ఉంటాయి. పాపం పసివాడు గుర్రం మీదినుంచి..”.
“పడ్డాడా.. ఎవరైనా రాజనగరి మిత్రులు పడవేశారా? కనుక్కో.. కనుక్కో..”.
దుప్పటి ముసుగుపెట్టి బావగారి స్పందన వింటున్న జాయపుడు గతుక్కుమన్నాడు. ఊరు తెల్లవారకముందే ఈయనగారికి తెలిసిపోయినట్లుంది. నగర దండనాయకుడు చెవిన వేసేసినట్లున్నాడు.
“మిత్రులంటారు. మళ్లీ పడవేశారు అంటారు. మిత్రులెక్కడైనా గుర్రం మీదినుంచి పడవేస్తారా?”.
“నీ తమ్ముడేమీ తక్కువవాడు కాదు. ఒంటినొప్పులు తగ్గాక రాజనగరి అంతా బ్రహ్మరథం పడుతుందిలే!” అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు గణపతిదేవుడు.
“ఒంటినొప్పులని ఆయనే అంటారు.. మళ్లా ఎవరో బ్రహ్మరథం పడతారు అంటారు. ప్చ్.. ఏమిటో ఈయన.. నాకెప్పటికీ అర్థం కారు!” కాపడం పెడుతూ నిట్టూర్చింది నారాంబ.
దుప్పటి తొలగించి.. బావగారిలాగే నవ్వాడు జాయప.
గణపతిదేవుడు అన్నట్లు మరునాటినుంచి జాయపునికి రాజనగరి బ్రహ్మరథం పట్టసాగింది. పుళిందపుడు అన్ని కార్యక్రమాలకూ జాయప సేనానిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాడు. ఎంతోమంది రాజనగరి యువతులు కనురెప్పలపై సిగ్గుల మొగ్గలను పూయిస్తూ అవన్నీ జాయపునికే అంకితం అంటున్నారు. ఇక జలజాంబ లాంటి ముదురు మిత్రురాళ్ల సంఖ్య, ఆహ్వానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
అన్నిటినీ తట్టుకుని తన దైనందినాన్ని కొనసాగిస్తున్నాడు జాయపుడు.
“తమరి దర్శనభాగ్యమే మాకు కరువయ్యింది!”..
చటుక్కున కదిలి నిలబడ్డాడు జాయపుడు.
అంతఃపుర మందిరంలో పిల్లలతో ఆడుకుంటూ అక్కతో కబుర్లు చెబుతున్న సమయాన.. గణపతిదేవుడు ఎప్పుడు లోపలికి ప్రవేశించాడో చూడలేదు జాయపుడు. మొదటికొలువు పూర్తయ్యి లోపలికి వచ్చిన గణపతి సరాసరి అంతఃపురంలోకి వచ్చాడు. అంతఃపురంలోకి వస్తున్నప్పుడు వెంట ఎవ్వరూ.. వ్యక్తిగత సహాయకుడు కూడా రారు. గణపతి దృష్టిలో పడకుండా ఉదయాన్నే ప్రత్యూషవేళకు పూర్వమే బయటికి జారుకోవడం, నడిరాత్రి రాజనగరుకు చేరుకోవడం జాయపుని దినచర్య. ఏమాత్రం సమయమున్నా అక్కతో, పిల్లలతో గడుపుతాడు. చాలారోజుల తర్వాత చక్రవర్తికి ఎదురుపడ్డాడు.
“ఆ.. ఊ.. నమస్కారం.. బా.. బావగారూ!” అన్నాడు తడబడుతూ.
గణపతిదేవుణ్ని అంతఃపురంలో ‘బావగారూ!’ అని, బయట ‘దేవరా!’ అని సంబోధిస్తాడు జాయపుడు.
“ఊ.. తమరి నాట్యవిన్యాసాలు, శిల్పకళా భంగిమలు తెలుసుకుంటున్నాం. మీరు చెప్పకపోయినా మాకు తప్పదుకదా!” అన్నాడు మురారిని పరిచారిక నుంచి తీసుకుంటూ.
మౌనం గొప్ప ఆయుధం.
“జాయా! వెలనాడు యుద్ధంలో గజసైన్యంతో నువ్వుచేసిన యుద్ధ విన్యాసాలు మమ్మల్నేకాదు.. మన సైన్యాధ్యక్షులందర్నీ ఆకట్టుకున్నాయి. శత్రువులు కూడా కంగుతిన్నారు. శత్రుదుర్భేద్యమైన గజసైన్యం కాకతీయ రాజ్యంలో ఉన్నదని సమస్త రాజ్యాలూ చెప్పుకోవాలని మా అభిమతం. గజశిక్షణపై ప్రత్యేకదృష్టి పెట్టరాదూ..” అన్నాడు.
“తప్పకుండా బావగారూ!” అన్నాడు నిజాయతీగా.
గణపతి వాక్కు అంటే.. వేదవాక్కు జాయపునికి.
ఆయన చెప్పినట్లు గజశాలకు వెళ్లాడు. జాయపుణ్ని చూసి ఆనందంతో పులకించిపోయాడు గజసాహిణి కొమరయ నాయకుడు. జాయపుడంటే అతనికి గొప్ప సంబురం.
“ఏనుగులు నువ్వు చెప్పినట్లు ఎలా నడచుకుంటాయి జాయపసేనానీ?” అని ఆయనెప్పుడూ
ఆశ్చర్యపోతుంటాడు.
గజస్థావరాలు ప్రజానివాసాలకు ఆవలగా అరణ్యాల వద్ద ఉంటాయి. అనుమకొండ చుట్టూ గజస్థావరాలు పాతిక ఉన్నాయి. దూరదూరంగా మరోపాతిక. అన్నిటి వద్దకూ వెళ్లాడు. వాటికి ఇస్తున్న యుద్ధశిక్షణ చూశాడు.
“శత్రుదుర్భేద్యమైన గజసైన్యం మనకు ఉండాలని మహామండలేశ్వరులు కోరుకుంటున్నారు. నేనూ, తంత్రిపాలుడు ముచ్చనాయకుడు, సకల సేనాధిపతి రుద్రసేనానివారు కూడా ఆ భావంలోనే ఉన్నాం. నీ గజయుద్ధ తంత్రాలు చూశాకే మాకు ఈ ఆలోచన వచ్చింది. నువ్వే చెప్పు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో..” అన్నాడు గజసాహిణి.
“సరేసరే! ముందు నేను ఇక్కడికి వచ్చానని మీతో చర్చించానని చక్రవర్తులవారికి తెలియజేయండి. అలాగే పిష్టపుర యుద్ధంలో దళపతిగా పనిచేసిన సుబుద్ధి గారిని మన శిక్షాణాలయానికి మార్చండి. వారి గజతంత్రాలు అమోఘం!”.
చిత్రవిచిత్ర కూజితాలతో ఏనుగులకు ఆజ్ఞలు ఇవ్వడం బాల్యంనుంచి తెలిసిన జాయపునికి బంజాయతండాలో పిల్లలు.. దగ్గరలో, దూరంలో, సుదూరంలో, చెట్ల చాటున, కొండల కావల.. కంటికి కనిపించనంత దూరంలో ఉన్న యుద్ధ జంతువులకు.. ముఖ్యంగా ఏనుగులకు ఆజ్ఞలు ఇచ్చేలా వేరువేరు కూజితాలను పలికించడంలో ప్రత్యేక నైపుణ్యవిద్య నేర్పారు.
ఇప్పుడు దానికి తన కళాభిజ్ఞతను కలగలిపి అందుకు తగిన పొడుగు, పొట్టి కొమ్ముబూరలను, కంచు కాహళీలను తయారు చేయించుకున్నాడు. నడుముకు చురకత్తి ఉన్నట్లే.. పొట్టి కాహళి ఒకటి అతని మెడలో ఎప్పుడూ సర్వసన్నద్ధంగా ఉంటుంది. అతని శిక్షణలో ధీర.. కాహళి కూజితం వినగానే తన పొడవైన దంతాలతో రాజనగరిలోనే పాతికమందిని చంపేస్తుంది.
(సశేషం)
“జాయా! వెలనాడు యుద్ధంలో గజసైన్యంతో నువ్వుచేసిన యుద్ధ విన్యాసాలు మమ్మల్నేకాదు.. మన సైన్యాధ్యక్షులందర్నీ
ఆకట్టుకున్నాయి. శత్రువులు కూడా కంగుతిన్నారు. శత్రుదుర్భేద్యమైన గజసైన్యం కాకతీయ రాజ్యంలో ఉన్నదని సమస్త రాజ్యాలూ చెప్పుకోవాలని మా అభిమతం. గజశిక్షణపై ప్రత్యేకదృష్టి పెట్టరాదూ..”
మత్తి భానుమూర్తి
99893 71284