కొంతమంది పిల్లలు లాక్డౌన్లో వీడియో గేమ్లంటూ కాలక్షేపం చేశారు. మరికొందరు మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకుని సృజనకు పదును పెట్టారు. బిహార్కు చెందిన శౌర్యా మిశ్రా అనే పసివాడు తన ఊహాశక్తితో ఏకంగా 83 పేజీల పే..ద్ద కథ రాసి ‘యంగెస్ట్ ఆథర్’గా నిలిచాడు. ఆ విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం..
లాక్డౌన్ కారణంగా స్కూళ్ళు, పార్కులు, ప్లే గ్రౌండ్లు మూతపడ్డాయి. దాదాపు పదహారు నెలలు పిల్లలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఆడుకునేందుకు, అల్లరి చేసేందుకు స్నేహితుల్లేరు. చదువుకునేందుకు స్కూళ్లూ లేవు. ఆన్లైన్ పాఠాలు అంతంతమాత్రంగానే సాగాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న శౌర్యకు చిన్నప్పటినుంచీ కథలంటే ఇష్టం. లాక్
డౌన్లో స్కూల్ లేక బోర్ కొడుతోందని సరదాగా ఓ కథ రాయడం ప్రారంభించాడు శౌర్య. రెండు, మూడు పేజీలతో ఆపేద్దామనుకున్నాడు కానీ, కథ ఎనభై మూడు పేజీలకు చేరింది. ‘స్పేస్ మాఫియా ఆన్ ది లూస్’ అనే పుస్తకమే అయ్యింది. పదకొండేండ్ల ఈ బుల్లి రచయిత ఊహాశక్తిని మెచ్చుకుంటూ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్వయంగా ఉత్తరం రాశారు. ‘ఆడుకునే వయసులో నువ్వు ఇలా కథ రాయడం ఆశ్చర్యం అనిపించింది. అంతరిక్షం గురించి ఊహించి రాసిన విధానమూ చాలా బాగుంది. లాక్డౌన్లో సమయాన్ని వృథా చేయకపోవడం అభినందనీయం. తోటి పిల్లలకు నువ్వు ఆదర్శం. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉంటూనే నీలోని ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేశావు. సైన్స్ ఫిక్షన్ విభాగంలో యంగెస్ట్ ఆథర్గా నీ ఘనత అసాధారణం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. 2019లో రూబిక్ క్యూబ్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీలలో విజేతగా నిలిచి బంగారు పతకాన్నీ కైవసం చేసుకున్నాడు శౌర్య. మున్ముందు మరిన్ని కథలతో మంచి రచయితగా ఎదగాలని ఆశిస్తూ.. ఈ చిన్నారి రచయితకు మనమూ ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం!