ప్రపంచ క్రికెట్లో తమను అంచనాలకు అందని జట్టు అని ఎందుకంటారో పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. టీమ్ఇండియాతో జరిగిన గత మ్యాచ్లో చివరి బంతి వరకు పోరాడి పరాజయం వైపు నిలిచిన పాక్.. తాజా పోరులో జింబాబ్వే చేతిలో చిత్తైంది. ఆఖరి బంతికి ఫలితం తేలిన మ్యాచ్లో పాక్ను ఓడించిన జింబాబ్వే ప్రపంచకప్పు నెగ్గినంత సంబురపడిపోతే.. పాక్ ఆటగాళ్లు మాత్రం మరోమారు తమ అనిశ్చితిని క్రీడాలోకానికి చాటారు. పాక్ సంతతికి చెందిన ఆల్రౌండర్ సికందర్ రజా.. జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించడం కొసమెరుపు.
పెర్త్: స్టార్ ఆటగాళ్లతో నిండిన పాకిస్థాన్కు జింబాబ్వే షాక్ ఇచ్చింది. గ్రూప్-2లో భాగంగా గురువారం పెర్త్లో చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన పోరులో జింబాబ్వే ఒక పరుగు తేడాతో పాకిస్థాన్పై విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన పాకిస్థాన్.. సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గితేనే పాక్ జట్టు.. సెమీఫైనల్కు చేరనుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. సీన్ విలియమ్స్ (31) టాప్ స్కోరర్ కాగా.. పాక్ బౌలర్లలో మహమ్మద్ వసీమ్ 4, షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 11 బంతులు అవసరం కాగా.. పాక్ 9 పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. మరో మారు మహమ్మద్ రిజ్వాన్ (14), బాబర్ ఆజమ్ (4) విఫలం కాగా.. టీమ్ఇండియాతో మ్యాచ్లో రాణించిన షాన్ మసూద్ (44) ఒక్కడే పోరాడాడు. ఇఫ్తిఖార్ అహ్మద్ (5), షాదాబ్ ఖాన్ (17), హైదర్ అలీ (0) ఎక్కువసేపు నిలువలేకపోవడంతో ఆఖర్లో ఒత్తిడిలో పడ్డ పాకిస్థాన్ చివరకు పరాజయం పాలైంది. జింబాబ్వే బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సికందర్ రజా 3, బ్రాడ్ ఇవాన్స్ రెండు వికెట్లు పడగొట్టారు.