వెల్లింగ్టన్: యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్.. ఈ ఇద్దరు స్పిన్నర్లు ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి వచ్చేశారు. నిజానికి టీ20 వరల్డ్కప్ బృందంలో చాహల్ ఉన్నా.. అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఈ ఇద్దరూ జట్టులో చేరారు. గతంలో తమ స్పిన్ మాయాజాలంతో ఇండియాకు విజయాలను అందించిన ఈ జోడి ఇప్పుడు మళ్లీ తమ ట్యాలెంట్ను ప్రదర్శించనున్నది.
కివీస్తో మ్యాచ్ నేపథ్యంలో చాహల్ తన ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టాడు. కుల్దీప్తో దిగిన ఫోటోను అతను షేర్ చేశాడు. టీమిండియా ఫోటోషూట్ నుంచి ఆ ఫోటోను తీశాడు. కుల్దీప్ ఎలా ఉన్నావ్ అంటూ తన పోస్టులో చాహల్ కామెంట్ చేశాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్కప్లో టీమిండియా సెమీస్లో నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో స్పిన్నర్ చాహల్ను వాడకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
మణికట్టు స్పిన్నర్ అయిన చాహల్ను ఇంగ్లండ్పై ఆడిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రిస్ట్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ ప్లేయర్లు ఇబ్బందిపడుతారని, అతను ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఈ ఇద్దరు స్పిన్నర్లు ఇప్పుడు కివీస్తో సిరీస్లో ఆడనున్నారు.
కివీస్తో శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ జరగనున్నది. ఆ తర్వాత ఆదివారం, మంగళవారం రెండో, మూడో టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఇక నవంబర్ 25న తొలి వన్డే ఉంటుంది. 27న రెండో, 30న మూడో వన్డే ఆడనున్నారు.