IPL Mega Auction | త్వరలో జరిగే ఐపీఎల్-2022 టోర్నీకోసం ఇటీవల జరిగిన ప్లేయర్ల వేలం తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలం తీరు సంతలో పశువులను కొన్నట్లు కొన్నారన్న అభిప్రాయం కలుగుతుందన్నాడు. టోర్నీలో పాల్గొనే ఫ్రాంచైజీలు తమకు నచ్చిన ఆటగాళ్ల కోసం పోటీపడుతుంటే.. ఏదో వస్తువు కోసం పోటీ పడుతున్నాయన్న దారుణమైన ఫీలింగ్ కలుగుతుందన్నాడు. వేలం టైంలో క్రికెటర్లు కూడా మనుషులేనన్న విషయాన్ని ఫ్రాంచైజీలు మరిచిపోయి ప్రవర్తిస్తాయన్నాడు.
వేలంలో అమ్ముడుపోని క్రికెటర్ల మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఎవరూ ఊహించలేరని, అది వర్ణించలేని బాధ కలిగిస్తుందని రాబిన్ ఊతప్ప అన్నాడు. ఆటగాళ్ల కోసం వేలం భారత్లో మాత్రమే జరుగుతుందని, మున్ముందు ఈ ప్రక్రియకు స్వస్తి పలికితే బాగుంటుందని సూచించాడు అందరికీ మేలు జరిగేలా ముసాయిదా విధానం అమలులోకి వస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుందన్నాడు.
కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాబిన్ ఉతప్పను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 2 కోట్ల బేస్ ధరకు కొనుగోలు చేసింది. గత సీజన్లోనూ చెన్నైకే ఆడాడు. సీఎస్కే వంటి టీంకే ఆడాలన్నది తన కోరిక అని, అందుకోసం తాను, తన కొడుకు దేవుడిని ప్రార్ధిస్తున్నామన్నాడు. రాబిన్ ఉతప్ప 2006-2015 మధ్య టీం ఇండియా తరఫున 46 వన్డేలు, 13 టీ-20 మ్యాచ్లు ఆడాడు.