Christian Atsu : తుర్కియేలో ఈమధ్య వచ్చిన భారీ భూకంపం యువ ఫుట్బాలర్ను బలిగొన్నది. భూకంపం కారణంగా క్రిస్టియన్ అత్సు అనే 31 ఏళ్ల ఫుట్బాలర్ మరణించాడు. సహాయక బృందాలు దాదాపు 12 రోజుల తర్వాత శిథిలాల కింద ఇతని మృతదేహాన్ని గుర్తించాయి. క్రిస్టియన్ అంటక్యా సిటీలో ఉండేవాడు. ఫిబ్రవరి 6న తుర్కియేలో భూమి ప్రకంపనలు మొదలైప్పటి నుంచి క్రిస్టియన్ జాడ దొరకలేదు. దాంతో, అతడి ప్రాణాలతో బయటపడాలని అందరూ ప్రార్థించారు. కానీ, అవేవీ ఫలించలేదు. దాంతో, తుర్కియే ఫుట్బాల్లో విషాదం చోటుచేసుకుంది.
ఘనాకు చెందిన క్రిస్టియన్ గతంలో చెల్సియా, న్యూకాస్లే యునైటెడ్, ఎవెర్టన్, బౌర్న్మౌత్, మలగా వంటి క్లబ్స్కు ఆడాడు. అంతేకాదు ఘనా తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో కూడా మెరిశాడు. పోయిన ఏడాది సెప్టెంబర్లో క్రిస్టియన్ తుర్కియేలో పాపులర్ ఫుట్బాల్ క్లబ్ అయిన హతయ్స్పోర్లో చేరాడు. భూకంపం రావడానికి ముందు రోజు క్రిస్టియన్ చివరి నిమిషంలో గోల్ చేసి తమ క్లబ్ను గెలిపించాడు. తుర్కియే సూపర్ లీగ్లో కసింపస క్లబ్తో జరిగిన మ్యాచ్లో అతను విన్నింగ్ గోల్ కొట్టాడు. ఎన్నో ఆశలతో ఈ క్లబ్కు వచ్చిన అతడి జీవితం ఆర్థాంతరంగా ముగిసింది.
ఫిబ్రవరి 6న తుర్కియేలో సంభవించిన భూకంపం పెను విలయాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.
భూకంపం కారణంగా దాదాపు 84 వేల భవనాలు నేలమట్టం అయ్యాయి. 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యల్లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు చూశాం. ప్రకృతి ప్రకోపానికి కకావికలం అయిన తుర్కియేకు భారత్ సహా పలు దేశాలు అత్యవసర సాయం అందచేసిన విషయం తెలిసిందే.