దేశవాళీ క్రికెట్లో గత కొన్నాళ్లుగా పరుగుల వరద పారిస్తున్న ముంబై యువ కెరటాలు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ మరోసారి శతకాల మోత మోగించారు. కోయంబత్తూర్ వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2022 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్లైన యశస్వి జైస్వాల్ (265) డబుల్ సెంచరీతో దుమ్మురేపగా సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్) సెంచరీతో మెరిశాడు.
జైస్వాల్, సర్ఫరాజ్ మెరుపులకు తోడు శ్రేయాస్ అయ్యర్ (71), హెట్ పటేల్ (51 నాటౌట్) లు అర్థ సెంచరీలతో మెరవడంతో రెండో ఇన్నింగ్స్ లో వెస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా 529 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌత్ జోన్ ముందు నిలిపింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ జోన్ తడబడుతున్నది. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన మయాంక్ అగర్వాల్ (14), హనుమా విహారి (1), మనీష్ పాండే (14) లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. కానీ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (95 బంతుల్లో 87 బ్యాటింగ్) ఒక్కడే పోరాడుతున్నాడు. ఓటమిని తప్పించుకోవాలంటే సౌత్ జోన్ ఈ రోజుతో పాటు రేపు కూడా ఆడి 390 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సౌత్ జోన్ గెలవడం అసాధ్యం.
సంక్షిప్త స్కోర్లు : వెస్ట్ జోన్ : తొలి ఇన్నింగ్స్- 270 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ – 585-4 డిక్లేర్డ్
సౌత్ జోన్ : ఫస్ట్ ఇన్నింగ్స్ – 327 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 142-5 (మ్యాచ్ కొనసాగుతున్నది)