‘కామన్వెల్త్ బరిలో ఉన్న 12 మంది రెజ్లర్లు పతకాలతోనే దేశంలో అడుగుపెడతారు’.. బర్మింగ్హామ్ వెళ్లడానికి ముందు భారత రెజ్లింగ్ సమాఖ్య చేసిన వ్యాఖ్య ఇది. అందుకు తగ్గట్లే భారీ అంచనాలతో బరిలోకి దిగిన మన మల్లయోధులు ఉడుంపట్టు పట్టి అదుర్స్ అనిపించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఆరుగురు రెజ్లర్లలో ముగ్గురు స్వర్ణాలు, ఇద్దరు కాంస్యాలు, ఒకరు రజతం కైవసం చేసుకోగా.. శనివారం వినేశ్ ఫొగాట్, రవి దహియా, నవీన్ పసిడి కాంతులు విరజిమ్మారు. పూజ గెహ్లాట్, పూజ సెహాగ్, దీపక్ నెహ్రా కాంస్యాలు చేజిక్కించుకున్నారు.
మరోవైపు బాక్సింగ్లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ ఫైనల్కు దూసుకెళ్లగా.. అమిత్ పంగల్ అంచనాలు అందుకుంటూ తుదిపోరుకు చేరాడు. లాన్బౌల్స్లో దేశానికి రెండో పతకం దక్కగా.. 3000 మీటర్ల స్టీపుల్చేజ్లో అవినాశ్ రజతం కైవసం చేసుకున్నాడు. రేస్ వాక్లో ప్రియాంక్ రెండో స్థానంలో నిలిస్తే.. టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ ఫైనల్కు అర్హత సాధించింది. బ్యాడ్మింటన్లో పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లారు. పురుషుల హాకీలో భారత్ ఫైనల్ చేరగా.. టీటీలో శరత్ కమల్ రెండు పతకాలు పక్కా చేశాడు!
బర్మింగ్హామ్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కామన్వెల్త్ క్రీడల్లో నయా రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే రెండు సార్లు ఈ మెగాటోర్నీలో స్వర్ణాలు చేజిక్కించుకున్న వినేశ్.. బర్మింగ్హామ్లో హ్యాట్రిక్ నమోదు చేసింది. భారత్ తరఫున కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణాలు గెలిచిన తొలి మహిళా రెజ్లర్గా చరిత్రకెక్కింది. ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ ఎదురుకాకపోవడంతో వినేశ్ చమట పట్టకుండానే స్వర్ణం ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన 53 కేజీల ఫైనల్లో కేశాని మదురవల్గే (శ్రీలంక)పై వినేశ్ ఏకపక్ష విజయం సాధించింది. అంతకుముందు తొలి రౌండ్లో 36 సెకన్లలోనే ప్రత్యర్థిని మట్టి కరిపించిన భారత రెజ్లర్.. సెమీఫైనల్లో ప్రేక్షకులు కుర్చీల్లో కూర్చోవడానికి ముందే తన సంపూర్ణ ఆధిపత్యంతో టెక్నికల్ సూపరియారిటీ ద్వారా విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్లో పేలవ ప్రదర్శన తర్వాత ఫిట్నెస్ సమస్యలతో సతమతమైన వినేశ్.. బర్మింగ్హామ్లో అద్వితీయ ప్రదర్శనతో అభిమానులతో పాటు విమర్శకుల మన్ననలు అందుకుంది. కామన్వెల్త్లో పతకాలు సాధించిన అథ్లెట్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.
రవి రాజసంగా..
టోక్యో ఒలింపిక్స్ రజత విజేత రవి దహియ బంగారు పతకం ఖాతాలో వేసుకున్నాడు. 57 కేజీల విభాగంలో బరిలోకి దిగిన రవి.. సంపూర్ణ ఆధిపత్యంతో అదరగొట్టాడు. తుదిపోరులో నైజీరియాకు చెందిన వెల్సన్ను 10-0తో చిత్తు చేసిన రవి.. అంతకుముందు జరిగిన బౌట్లలో ప్రత్యర్థులపై టెక్నికల్ సుపీరియారిటీతో గెలుపొందాడు. మొదటి బౌట్లో సూరజ్ సింగ్ (న్యూజిలాండ్)ను మట్టికరిపించిన రవి.. ఆ తర్వాత పాకిస్థాన్ రెజ్లర్ అసద్ అలీపై అలవోక విజయం సాధించాడు.
నయా చాంపియన్ నవీన్
పురుషుల 74 కేజీల విభాగంలో నవీన్ దుమ్మురేపాడు. తుదిపోరులో నవీన్ 9-0తో పాకిస్థాన్ రెజ్లర్ తాహిర్ మహమ్మద్ షరీఫ్ను చిత్తుచేసి కామన్వెల్త్లో తొలి స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. బర్మింగ్హామ్ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ముందుకు సాగిన నవీన్.. ఫైనల్లోనూ అదే జోష్ కొనసాగించాడు. మరోవైపు మహిళల 50 కేజీల విభాగంలో పూజ గెహ్లాట్ కాంస్యం గెలుచుకోగా.. పూజ సిహాగ్ (76 కేజీలు) కూడా కంచు మోత మోగించింది. సెమీస్లో పూజా గెహ్లాట్ 12-2తో టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా లెచిడో (స్కాట్లాండ్)పై గెలుపొందింది. మరో పోరులో పూజ సిహాగ్ 11-0తో నవోమీ బ్రూన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గింది. పురుషుల 97 కేజీల విభాగంలో దీపక్ నెహ్రా.. తయాబ్ రజా (పాకిస్థాన్)పై గెలిచి కాంస్యం కైవసం చేసుకున్నాడు.
శ్రీజ అదరహో..
తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కామన్వెల్త్ గేమ్స్లో విజృంభిస్తున్నది. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరడం ద్వారా శ్రీజ పతకం ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన టేబుల్ టెన్నిస్ (టీటీ) సెమీస్లో శ్రీజ-శరత్ కమల్ జంట 3-2 (11-9, 11-8, 9-11, 12-14, 11-7)తో కరెన్ లైన్-చూంగ్ జయెన్ (మలేషియా) ద్వయంపై విజయం సాధించింది. అంతకుముందు పురుషుల డబుల్స్లో శరత్-సాతియాన్ జోడీ 3-2 కూడా ఫైనల్కు చేరింది. దీంతో భారత్కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. సింగిల్స్లోనూ చక్కటి ప్రదర్శన కనబర్చిన శ్రీజ హోరాహోరీగా సాగిన సెమీస్లో 3-4 (6-11, 11-8, 11-6, 9-11, 8-11, 11-8, 10-12)తో ఫెంగ్ (సింగపూర్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్లో శరత్, సాతియాన్ సెమీఫైనల్కు అర్హత సాధించారు. మహిళల డబుల్స్లో శ్రీజ-రీత్, మనికా బాత్రా-దియా జోడీలు క్వార్టర్స్లోనే వెనుదిరిగాయి. గోల్డ్కోస్ట్ (2018) కామన్వెల్త్ క్రీడల్లో 4 పతకాలతో మెరిసిన స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా ఈ సారి రిక్తహస్తాలతో వెనుదిరిగింది.