హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మహిళల 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ చైనా రెజ్లర్ లాంగ్ జియాను ఓడించి పతకం దక్కించుకుంది. ఈ పోరులో సోనమ్ 7-5 తేడాతో చైనా రెజ్లర్ను మట్టి కరిపించింది.
సోనమ్ గెలిచిన కాంస్యంతో కలిపి భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 91 కి చేరుకుంది. అందులో 21 బంగారు పతకాలు, 33 రజత పతకాలు, 37 కాంస్య పతకాలు ఉన్నాయి. వివిధ క్రీడాంశాల్లో మరో 9 పతకాలు ఇప్పటికే ఖాయమయ్యాయి. దాంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించే పతకాల సంఖ్య 100 ను దాటడం ఖరారైపోయింది.