ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన భారత తొలి రెజ్లర్గా చరిత్ర లిఖించాలనుకున్న రవి కుమార్ దహియా కల నెరవేరలేదు. పసిడి పోరులో ఓడిన ఈ హర్యానా యోధుడు రజత పతకంతో ఆకట్టుకున్నాడు. మరోవైపు స్వర్ణ ఆకాంక్షలు పెట్టుకున్న మహిళా స్టార్ వినేశ్ ఫోగట్కు క్వార్టర్స్లో అనూహ్య ఓటమి ఎదురవగా.. దీపక్ పునియా కాస్తలో కాంస్యాన్ని చేజార్చుకున్నాడు.
టోక్యో: విశ్వక్రీడల చరిత్రలో రజత పతకం సాధించిన భారత రెండో రెజ్లర్గా రవికుమార్ దహియా రికార్డు నెలకొల్పాడు. టోక్యో ఒలింపిక్స్ సెమీస్లో అద్భుత విజయంతో సత్తాచాటిన అతడు ఫైనల్లో ఓడి పసిడిని పట్టలేకపోయాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల విభాగం ఫైనల్లో రవి 4-7 తేడాతో జవుర్ యుగెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. రవి దూకుడు ప్రదర్శించినా ఆర్వోసీ రెజ్లర్ డిఫెన్స్ను ఛేదించలేకపోయాడు. దీంతో సుశీల్ తర్వాత ఒలింపిక్స్ వెండి పతకం పట్టిన భారత రెజ్లర్గా రవి నిలిచాడు. సుశీల్ జైలుపాలుకావడంతో మసకబారిన భారత రెజ్లింగ్కు రవి ఈ పతకంతో కళ తేవడంతో పాటు ఎంతో మంది ఈ క్రీడలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచాడు.
అయ్యో వినేశ్
భారత స్టార్, టాప్ సీడ్ వినేశ్ ఫోగట్కు మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్లోనే షాక్ ఎదురైంది. బెలారస్ రెజ్లర్ వనెసా కలాడ్జిన్సకయా చేతిలో వినేశ్.. 3-9తో వెనుకబడి ఫెయిల్గా పోటీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో సోఫియా మ్యాట్సన్పై 1-7తో అదిరే విజయం సాధించిన ఫోగట్ ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఇక తనను ఓడించిన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో రెపిచేజ్ రౌండ్ రూపంలో అన్షుమాలిక్(57 కేజీలు)కు మరో అవకాశం వచ్చినా ఫలితం లేకపోయింది. ఈ పోటీలో అన్షు 1-5 తేడాతో కొబ్లోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. దీంతో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత్ తరఫున ఇక సీమా బిస్లా (50కేజీలు) మాత్రమే టోక్యో బరిలో మిగిలింది.
చివరి 10 సెకన్లలో..
కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ దీపక్ పునియాకు తీవ్ర నిరాశ ఎదురైంది. మైల్స్ నజెమ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన దీపక్ చివరి పది సెకన్లలో వెనుకబడ్డాడు. దీంతో చివరికి 2-4 తేడాతో ఓడాడు. మరోవైపు భారత స్టార్ బజరంగ్ పూనియా శుక్రవారం బరిలోకి దిగనున్నాడు.