Wrestlers Protest | భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసన ఆదివారం 15వ రోజుకు చేరింది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని బజరంగ్ పునియా, వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్ సహా స్టార్ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఇప్పటికే పలువురు నేతలు మద్దతు తెలుపారు. తాజాగా పంజాబ్, హర్యానాకు చెందిన వేలాది మంది రైతులు మద్దతు ప్రకటిస్తూ జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద మహా పంచాయత్ నిర్వహించనున్నారు. సుదీర్ఘంగా ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆదివారం ఉదయం టిక్రీ సరిహద్దులతో రైతు నాయకులతో పాటు మహిళలు సైతం ఢిల్లీకి చేరుకోవడం కనిపించింది. రైతులు బస్సులు, పలు వాహనాల ద్వారా తరలివస్తున్నారు. మరో వైపు రైతులకు రైతు సంఘాల నేత రాకేశ్ టికాయిత్ మద్దతు ప్రకటించారు. పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుంటే పోలీస్స్టేషన్లో మహా పంచాయత్ నిర్వహిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘ఎవరినీ ఢిల్లీకి రాకుండా ఆపడం లేదు. కానీ ఢిల్లీ పోలీసుల విచారణ పూర్తయిన రోజు నేను దోషిగా తేలితే నేను వ్యక్తిగతంగా మీ అందరి మధ్యకు వస్తాను. మీరందరూ నన్ను మీ బూట్లతో కొట్టి చంపడి’ అన్నారు.