మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఎదురన్నదే లేకుండా పోయింది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో దూసుకెళుతున్న ఢిల్లీ వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటున్నది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ను చిత్తుచేస్తూ ఢిల్లీ తమ అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదన్న రీతిలో ముంబైకి ముచ్చెమటలు పట్టిస్తూ ఢిల్లీ జిగేల్మంది. జెమీమా రోడ్రిగ్స్, మెగ్ ల్యానింగ్ ధనాధన్ అర్ధసెంచరీలతో భారీ స్కోరు అందుకున్న ఢిల్లీ..ముంబైని స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ వరుసగా నాలుగో విజయాన్ని దక్కించుకున్న ఢిల్లీ.. టాప్గేర్లో దూసుకెళుతున్నది.
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్లో నిరుటి రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. అరుణ్జైట్లీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 29 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. జెమీమా రోడ్రిగ్స్(33 బంతుల్లో 69 నాటౌట్, 8ఫోర్లు, 3సిక్స్లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ మెగ్ ల్యానింగ్(38 బంతుల్లో 53, 6ఫోర్లు, 2సిక్స్లు)రాణించడంతో 20 ఓవర్లలో 192-4 స్కోరు చేసింది. ఇస్మాయిల్, ఇషాక్, వస్ర్తాకర్, మాథ్యూస్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 163-8 స్కోరుకు పరిమితమైంది. అమన్జ్యోత్కౌర్(42) తప్పా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. యస్తికా భాటియా (6), స్కీవర్ బ్రంట్(5), కెప్టెన్ హర్మన్ప్రీత్కౌర్ (6), అమెలియా కెర్ (17) స్వల్ప స్కోర్లకు వెనుదిరిగారు. జొనాసెన్ (3-21), కాప్ (2-37) రాణించగా, శిఖాపాండే, టిటాస్ సాధు, రాధా యాదవ్ ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అజేయ అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకమైన రోడ్రిగ్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ ఆది నుంచే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యంగా మంచి ఫామ్మీదున్న షెఫాలీవర్మ, ల్యానింగ్.. ముంబై బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ బ్యాటింగ్ కొనసాగించారు. బౌండరీతో తన ఖాతా తెరిసిన షెఫాలీ..అదే జోరు కనబరిచింది. మరో ఎండ్లో ల్యానింగ్ తానేం తక్కువ కాదన్నట్లు బ్యాటు ఝులిపించడంతో స్కోరుబోర్డుకు పరుగులు జతకలిశాయి. ఇస్మాయిల్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్స్లతో చెలరేగిన షెఫాలీ.. యస్తికా భాటియా క్యాచ్తో తొలి వికెట్గా నిష్క్రమించింది. దీంతో పవర్ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి ఢిల్లీ 56 పరుగులు చేసింది. కెర్ను ఒక భారీ సిక్స్, రెండు ఫోర్లతో అరుసుకున్న ల్యానింగ్..బౌండరీతో అర్ధసెంచరీ మార్క్ అందుకుంది. ఇక్కణ్నుంచి రోడ్రిగ్స్ విశ్వరూపం ప్రదర్శించింది. ఇస్మాయిల్ 16వ ఓవర్లో రోడ్రిగ్స్ మూడు సూపర్ ఫోర్లతో విరుచుకుపడింది. ఇలా బౌలర్ ఎవరైనా బౌండరీ లక్ష్యంగా చెలరేగిన రోడిగ్స్.్ర.ఢిల్లీకి భారీ స్కోరు కట్టబెట్టింది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 192-4(రోడ్రిగ్స్ 69 నాటౌట్, ల్యానింగ్ 53, వస్ర్తాకర్ 1-20, మాథ్యూస్ 1-23),
ముంబై: 163-8(అమన్జ్యోత్ 42, మాథ్యూస్ 29, జొనాసెన్ 3-21, కాప్ 2-37).