WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) గ్రూప్ దశ పోటీలు చివరి అంకానికి చేరాయి. లీగ్ దశలో శనివారం గుజరాత్ జెయింట్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన పోరుతో ఈ లీగ్లో 16 మ్యాచ్లు ముగిశాయి. నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలున్న ఈ స్టేజ్లో ముంబై ఇండియన్స్ ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ (మరో మ్యాచ్ గెలిస్తే చాలు) కూడా దాదాపు ప్లేఆఫ్స్ చేరినట్టే. మరి నాకౌట్ దశకు చేరే మూడో జట్టు ఏది..? యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ మూడు జట్లలో ప్లేఆఫ్స్ వెళ్లేదెవరు..? ఏ జట్టుకు అక్కడికి వెళ్లడానికి అవకాశాలు ఏవిధంగా ఉన్నాయి.
గుజరాత్ జెయింట్స్..
శనివారం గుజరాత్.. ముంబైపై 190 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. హర్మన్ ప్రీత్ కౌర్ దంచికొట్టడంతో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరు మ్యాచ్లు ఆడి ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో ఉన్న గుజరాత్.. ప్లేఆఫ్స్ చేరాలంటే తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్లలో గెలవడంతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడాల్సి ఉన్న మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడిపోవాలి.
యూపీ వారియర్స్..
గత సీజన్లో ప్లేఆఫ్స్ వరకూ వెళ్లగలిగిన యూపీ ఈసారి ఏడు మ్యాచ్లు ఆడి మూడింట్లో గెలిచి నాలుగు ఓడింది. ఈ సీజన్లో మరో మ్యాచ్ మాత్రమే ఆడనున్న ఆ జట్టుకు ప్లేఆఫ్స్ అవకాశాలు తక్కువే. ఒకవేళ యూపీ.. తర్వాత మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ను ఓడించినా ప్లేఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ ఆడాల్సి ఉన్న తర్వాత రెండింట్లోనూ ఒకదాంట్లో ఓడిపోవాలి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఆర్సీబీ ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి మూడింట ఓడింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. తమ తర్వాతి రెండు మ్యాచ్లలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్లను ఢీకొనుంది. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయితే కచ్చితంగా నెగ్గాలి. ఆర్సీబీ.. ఈ రెండు మ్యాచ్లలో ఏదో ఒకదాంట్లో గెలిచినా గుజరాత్ జెయింట్స్ కథ ముగిసినట్టే.