WPL 2024, GG vs UP | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో ఫస్ట్ ఎలిమినేట్ కానున్న జట్టు ఏదో నేడు తెలిసిపోనున్నది. యూపీ వారియర్స్ – గుజరాత్ జెయింట్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నేడు కీలక పోరు జరుగనున్నది. ఇప్పటికే ఏడు మ్యాచ్లు ఆడి మూడు గెలిచి నాలుగింట ఓడిన యూపీ వారియర్స్కు నేడే ఆఖరి అవకాశం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే యూపీకి ప్లేఆఫ్స్ ఛాన్స్స్ సజీవంగా ఉంటాయి. ఒకవేళ గుజరాత్ జెయింట్స్ గనక యూపీకి షాకిస్తే ఆ జట్టు ఎలిమినేట్ అవనుంది. యూపీకి అత్యంత కీలకంగా మారిన ఈ మ్యాచ్లో.. గుజరాత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. వారియర్స్ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి ఉంది.
పాయింట్ల పట్టికలో యూపీ వారియర్స్.. ఏడు మ్యాచ్లు ఆడి మూడింట గెలిచి ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా గుజరాత్.. ఆరింట ఒకటి గెలిచి ఐదు ఓడి రెండు పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీతో పాటు యూపీకి ఆరు పాయింట్లే ఉన్నా బెంగళూరు నెట్ రన్రేట్ (+0.027) యూపీ కంటే (-0.365) మెరుగ్గా ఉంది.
నేటి మ్యాచ్లో యూపీ.. భారీ తేడాతో గుజరాత్ను ఓడించడమే గాక తర్వాత మ్యాచ్లో ఆర్సీబీ.. ముంబై చేతిలో ఓడిపోతే యూపీ రెండోసారి ప్లేఆఫ్స్ ఆడే అవకాశం దక్కనుంది. ఏడో మ్యాచ్ ఆడుతున్న గుజరాత్.. నేటి పోరులో గెలిచినా ఓడినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువ. ఈ సీజన్లో తొలి ఐదు మ్యాచ్లలో చెత్త ప్రదర్శనతో విఫలమైన గుజరాత్.. గత రెండు మ్యాచ్లలో మాత్రం అంచనాలకు మించి రాణించి ఆకట్టుకుంది. నేటి మ్యాచ్లోనూ అదే ప్రదర్శనను రిపీట్ చేయాలని ఆ జట్టు కోరుకుంటోంది.