WPL 2024, GG vs DC | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో హ్యాట్రిక్ విజయంతో పాటు అగ్రస్థానంపై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. బెంగళూరులో గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆరంభంలో దూకుడుగా ఆడినా ఆఖర్లో తడబడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. గత మూడు మ్యాచ్లలో బౌలింగ్లో విఫలమైన గుజరాత్ ఈ మ్యాచ్లోనూ ఆరంభ ఓవర్లలో అదే వైఫల్యాన్ని కొనసాగించినా చివర్లో మాత్రం పుంజుకుని ఢిల్లీని 163 పరుగులకే పరిమితం చేసింది. ఢిల్లీ సారథి మెగ్లానింగ్ (41 బంతుల్లో 55, 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థసెంచరీతో మెరవగా అలీస్ క్యాప్సీ (17 బంతుల్లో 27, 5 ఫోర్లు) దూకుడుగా ఆడింది. గుజరాత్ బౌలర్లలో మేఘనా సింగ్ మూడు (4/37) వికెట్లు పడగొట్టింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు మెరుపు ఆరంభమే దక్కింది. ఓపెనర్ షఫాలీ వర్మ 9 బంతులే ఆడినా ఓ సిక్సర్, ఓ బౌండరీ సాయంతో 13 పరుగులు చేసి ఔట్ అయింది. వన్ డౌన్లో వచ్చిన అలీస్ క్యాప్సీ ఆ ఊపును కొనసాగించింది. కెప్టెన్ మెగ్లానింగ్ కూడా వేగంగా పరుగులు రాబట్టడంతో ఢిల్లీ స్కోరు పరుగులెత్తింది.
అయితే పరుగులు వస్తున్నా కీలక సమయంలో ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయింది. మేఘనా సింగ్.. ఢిల్లీని వరుస ఓవర్లలో దెబ్బతీసింది. ధాటిగా ఆడుతున్న క్యాప్సీని మేఘనా.. ఏడో ఓవర్లో ఆఖరి బంతికి ఔట్ చేసింది. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న లానింగ్.. మేఘనా వేసిన 13వ ఓవర్లో మూడో బంతికి పెవిలియన్ చేరింది. ఈ సీజన్లో మెప్పించలేకపోతున్న జెమీమా రోడ్రిగ్స్ (7) మరోసారి నిరాశపరిచింది. మన్నత్ కశ్యప్ వేసిన 14వ ఓవర్లో మొదటి బంతికే రోడ్రిగ్స్.. పఠాన్కు క్యాచ్ ఇచ్చింది.
కీలక బ్యాటర్లు అంతా వెనుదిరిగినా అన్నాబెల్ సదర్లండ్ (12 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడటంతో ఢిల్లీ స్కోరు ఈజీగా 180 ప్లస్ దాటుతుందని అనిపించింది. కానీ గుజరాత్ బౌలర్లు ఢిల్లీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అన్నాబెల్ను తనూజా ఔట్ చేయగా జొనాసెన్ (11), అరుంధతి రెడ్డి (5)ని గార్డ్నర్ ఔట్ చేసి ఢిల్లీ భారీ ఆశలపై నీళ్లు చల్లింది. ఆఖర్లో శిఖా పాండే (8 బంతుల్లో 14 నాటౌట్, 2 ఫోర్లు) రెండు బౌండరీలు బాది ఢిల్లీ స్కోరును 160 దాటించింది.