WPL 2024, UP vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో నేడు యూపీ వారియర్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. డబ్ల్యూపీఎల్లో బెంగళూరు వేదికగా జరుగబోయే ఆఖరి మ్యాచ్ ఇదే. రేపటి (మార్చి 05) నుంచి డబ్ల్యూపీఎల్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి షిఫ్ట్ అవనుంది. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీకి సొంతగడ్డ బెంగళూరుపై ఇదే చివరి మ్యాచ్ కాగా నేటి పోరులో ఆ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు రానుంది. అలిస్సా హీలి సారథ్యంలోని యూపీ వారియర్స్.. బౌలింగ్ చేయనుంది. ఈ సీజన్లో యూపీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఉత్కంఠ విజయం అందుకున్న విషయం తెలిసిందే.
పాయింట్ల పట్టికలో యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లూ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన యూపీ.. రెండు గెలిచి రెండింటిలో ఓడింది. ఆర్సీబీదీ అదే కథ. అయితే నెట్ రన్ రేట్ పరంగా యూపీ.. (+0.211).. ఆర్సీబీ కంటే (-0.015) కంటే మెరుగ్గా ఉంది. నేటి మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
16 మ్యాచ్లు ఉన్న లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరిగేది 11వ మ్యాచ్ కాగా.. ఇకనుంచి ప్రతి జట్టూ ఆడబోయే మ్యాచ్ కీలకమే. లీగ్ దశ ముగిసేనాటికి టాప్ – 3లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ ఆడతాయి. గతేడాది ఢిల్లీ, ముంబై, యూపీలు ప్లేఆఫ్స్ ఆడాయి.