ఢిల్లీ: వచ్చే నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై వేదికగా వేలం నిర్వహించనున్నట్లు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన తొలి సీజన్కు విశేష స్పందన లభించగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్య డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ నిర్వహించేందుకు బోర్డు కసరత్తులు చేస్తున్నది.
ఈ లీగ్లో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గుజరాత్, యూపీ జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే అన్నీ జట్లు ప్రధాన ప్లేయర్లను రిటైన్ చేసుకోవడంతో పాటు.. అనవసరం అనుకున్న వాళ్లను వదిలేసుకున్నాయి. ఐదు జట్లు కలిపి 60 మంది ప్లేయర్లను అట్టి పెట్టుకోగా.. మిగిలిన వారిని వచ్చే నెలలో జరుగనున్న వేలంలో ఎంపిక చేసుకోనున్నాయి. గుజరాత్ జెయింట్స్ టీమ్ అత్యధికంగా పదకొండు మందిని వేలానికి వదిలేసింది.