World Cup Final | ఇటీవల జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ పరాజయం పాలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 19న జరిగిన మ్యాచ్లో ఆసిస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడోసారి ప్రపంచకప్ సాధించాలన్న భారత్ ఆశలు అడియాశలయ్యాయి. వరల్డ్ కప్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఈ సారి టిటైల్ను నెగ్గుతుందని అంతా భావించారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన నరేంద్ర మోదీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకొని మ్యాచ్ను వీక్షించారు.
అలాగే, టీవీల్లోనూ లైవ్లో దాదాపు 30కోట్ల మంది మ్యాచ్ను చూశారని బీసీసీఐ సెక్రెటరీ జైషా తెలిపారు. భారతీయ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన ప్రోగ్రామ్గా నిలిచిందన్నారు. అలాగే, భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ వీక్షకుల రికార్డులను సైతం బద్దలుకొట్టింది. ఓటీటీ ప్లాట్ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 5.9 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రత్యక్షం ప్రసారం ద్వారా వీక్షించారు. ఇప్పటివరకు చాలా మంది ప్రజలు ఓటీటీలో ఏ క్రికెట్ మ్యాచ్ను ఇంత పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా చూడలేదు.
అయితే, మ్యాచ్ ఆస్ట్రేలియాకు అనుకూలంగా రావడంతో వీక్షకుల సంఖ్య చివరలో తగ్గింది. అదే సమయంలో మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు దాదాపు 1.3 లక్షల మంది ప్రేక్షకులు హాజరై ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించారు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ను ఆరోసారి గెలుచుకోగా.. ఈ ఓటమి భారత అభిమానులకు 2003 ప్రపంచకప్ ఫైనల్ను జ్ఞప్తికి తెచ్చింది. 20 ఏళ్ల కింద జోహన్నెస్బర్గ్లో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది.