హైదరాబాద్, ఆట ప్రతినిధి/శంషాబాద్ రూరల్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో చరిత్ర సృష్టించిన తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్కు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మెగాటోర్నీలో నిఖత్ ప్రపంచ చాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకుంది. ప్రత్యర్థి బాక్సర్లను చిత్తుచేస్తూ వరుసగా రెండోసారి స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న నిఖత్జరీన్కు మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి ఘన స్వాగతం పలికారు. వందలాదిమంది అభిమానులు తరలిరాగా ఎయిర్పోర్ట్లో సందడి వాతావరణం నెలకొంది. అంతర్జాతీయ టోర్నీలో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిన జరీన్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ సన్మానించారు. అనంతరం అభిమానులు జాతీయ జెండాలు చేతబూని వెంటరాగా, ఓపెన్టాప్ జీప్లో నిఖత్ విజయోత్సవ ర్యాలీ సాగింది.
దారివెంట ఫ్యాన్స్కు అభివాదం చేస్తూ నిఖత్ ముందుకుసాగింది. ఓవైపు ఎండ వేడిమి అధికంగా ఉన్నా..లెక్కచేయకుండా ర్యాలీ కోలహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ‘నిఖత్ మరోమారు రాష్ట్ర ప్రతిష్ఠను ద్విగుణీకృతం చేసింది. భవిష్యత్లోనూ ఇదే జోరు కొనసాగిస్తూ మరిన్ని పతకాలు కొల్లగొడుతుందన్న నమ్మకం ఉంది. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లకు ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంటుంది’ అని అన్నారు. మరోవైపు నిఖత్ స్పందిస్తూ ‘ప్రపంచ బాక్సింగ్ టోర్నీ కెరీర్లో ఒక గొప్ప అనుభవం. ఒలింపిక్ విభాగమైన 50కిలోల కేటగిరీలో సత్తాచాటడం మరిచిపోలేని అనుభూతి. అన్సీడెడ్గా బరిలోకి దిగి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాను. మెగాటోర్నీలో ఆరు బౌట్లలో కఠిన ప్రత్యర్థులతో తలపడ్డాను. రానున్న ఆసియా గేమ్స్లోనూ నాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఒత్తిడిని అనుకూలంగా మలుచుకుంటూ ఫలితంతో సంబంధం లేకుండా ముందుకుసాగుతాను. పారిస్ బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాను’ అని పేర్కొంది.