తాష్కెంట్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అప్రతిహత విజయాలతో దూసుకెళ్లిన హుసాముద్దీన్ మోకాలి గాయం కారణంగా సెమీఫైనల్ బౌట్లో బరిలోకి దిగలేకపోయాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో హుసామ్ కాలికి గాయం కావడంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) శుక్రవారం అతడిని సెమీస్ పోటీకి అనుమతించలేదు. దీంతో హుసామ్ కాంస్యం పతకం చేజిక్కించుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్లో రెండు పతకాలు సాధించిన నిజామాబాద్ బాక్సర్ హుసామ్కు ప్రపంచ చాంపియన్షిప్లో ఇదే తొలి పతకం కావడం విశేషం. ‘గాయం కారణంగా హుసాముద్దీన్ ప్రత్యర్థికి వాకొవర్ ఇవ్వాల్సి వచ్చింది. క్వార్టర్స్లో హుసామ్ మోకాలికి గాయం అయింది. వాపు ఇంకా తగ్గకపోవడంతో అతడిని బౌట్కు అనుమతించలేదు’ అని బీఎఫ్ఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సెమీస్ బౌట్లలో దీపక్ భొరియా (51 కేజీలు), నిషాంత్ దేవ్ (71 కేజీలు) ఓటమి పాలై కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. 2019లో మన బాక్సర్లు ఓ రజతం, ఓ కాంస్యం గెలుచుకోగా.. ఈ సారి మూడు కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ నుంచి ఇప్పటి వరకు విజేందర్ సింగ్ (2009 కాంస్యం), వికాస్ కృష్ణన్ (2011 కాంస్యం), శివ థాపా (2015 కాంస్యం), గౌరవ్ బిధురి (2017 కాంస్యం), అమిత్ పంగల్ (2019 రజతం), కౌషిక్ (2019 కాంస్యం), ఆకాశ్ కుమార్ (2021 కాంస్యం) పతకాలు గెలిచారు.