టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టోర్నీకి వేళైంది. టోక్యో వేదికగా సోమవారం నుంచి మొదలవుతున్న మెగాటోర్నీలో సత్తాచాటేందుకు భారత షట్లర్లు సర్వశక్తులతో సిద్ధమయ్యారు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించి మంచి జోరుమీదున్న మన షట్లర్లు ప్రపంచ టోర్నీలో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అయితే కామన్వెల్త్లో గాయపడ్డ స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీకి దూరమైంది.
గత దశాబ్ద కాలంలో గాయంతో సింధు దూరం కావడం ఇదే తొలిసారి. 2019లో స్వర్ణం సహా ఐదు పతకాలు సొంతం చేసుకున్న ఈ తెలుగు అమ్మాయి ప్రపంచ టోర్నీపై తనదైన ముద్ర వేసింది. సింధు గైర్హాజరీలో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్పై భారీ ఆశలు నెలకొన్నాయి. కామన్వెల్త్ గేమ్స్తో పాటు అంతకుముందు జరిగిన థామస్కప్ టోర్నీలో భారత్ చిరస్మరణీయ విజయాలు సాధించడంలో వీరిద్దరు కీలక భూమిక పోషించారు.
ముఖ్యంగా యువ షట్లర్ లక్ష్యసేన్ అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు. గత టోర్నీలో శ్రీకాంత్ రజతం గెలువగా, లక్ష్యసేన్ కాంస్యం దక్కించుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈసారి ప్రపంచ స్టార్ షట్లర్లు కెంటో మోమొటో, జోనాథన్ క్రిస్టి, అంటోనీ జింటింగ్ నుంచి శ్రీకాంత్, లక్ష్యసేన్కు కఠిన పోటీ ఎదురయ్యే అవకాశముంది. వీరిద్దరికి తోడు ప్రణయ్ సత్తాచాటేందుకు పట్టుదలతో ఉన్నాడు. గత కొన్ని టోర్నీలుగా నిలకడగా రాణిస్తున్న ప్రణయ్కు ఆదిలోనే మోమొట నుంచి షాక్ తగిలే అవకాశముంది.
2019లో కాంస్యం గెలిచిన సాయి ప్రణీత్ తిరిగి ఆ స్థాయి ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. మహిళల సింగిల్స్లో సింధు గైర్హాజరీలో సీనియర్ షట్లర్ సైనా నెహ్వాల్ తనలో వాడి తగ్గలేదని నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నది. గత కొన్నేండ్లుగా గాయాలతో సతమతమవుతున్న ఈ హైదరాబాద్ షట్లర్ ఏ మేరకు టోర్నీలో ముందంజ వేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్శెట్టి జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి కామన్వెల్త్లో భారత్కు తొలి స్వర్ణం అందించిన జోడీగా నిలిచిన వీరు..ప్రపంచ చాంపియన్షిప్లో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉన్నారు. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి, అశ్విని పొన్నప్ప ద్వయంతో పాటు గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ జంట ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.