పుణె: చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో సూపర్ నోవాస్ను విజయం వరించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన మహిళల టీ20 చాలెంజ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్ నోవాస్ 4 పరుగుల తేడాతో వెలాసిటీని చిత్తుచేసి మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. మొదట సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. డెండ్రా డాటిన్ (44 బంతుల్లో 62; ఒక ఫోర్, 4 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. హర్మన్ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 43; ఒక ఫోర్, 3 సిక్సర్లు), ప్రియా పునియా (28; 2 సిక్సర్లు) రాణించారు.
వెలాసిటీ బౌలర్లలో దీప్తి శర్మ, కేట్ క్రాస్, సిమ్రన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెలాసిటీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ (15), యస్తిక భాటియా (13), కిరణ్ ప్రభు (0) విఫలమవగా.. లౌరా వాల్వర్ట్ (40 బంతుల్లో 65 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), సిమ్రన్ (10 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టినా ఫలితం లేకపోయింది. వెలాసిటీ విజయానికి మూడు ఓవర్లలో 48 పరుగులు అవసరమైన దశలో ఈ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడి.. హర్మన్ బృందాన్ని భయపెట్టింది. సూపర్ నోవాస్ బౌలర్లలో అలానా కింగ్ 3 వికెట్లు పడగొట్టింది. డాటిన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు
సూపర్ నోవాస్: 20 ఓవర్లలో 165/7 (డాటిన్ 62, హర్మన్ప్రీత్ 43; దీప్తి 2/20, కేట్ క్రాస్ 2/29), వెలాసిటీ: 20 ఓవర్లలో 161/8 (వాల్వర్ట్ 65 నాటౌట్, సిమ్రన్ 20 నాటౌట్; అలానా కింగ్ 3/32, ఎకెల్స్టోన్ 2/28).