డోంగ్హే(దక్షిణకొరియా): ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో కరోనా కలకలం రేపింది. భారత హాకీ ప్లేయర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో దక్షిణకొరియాతో బుధవారం జరుగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భారత్- కొరియా మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో ఒకరికి కొవిడ్-19 సోకిందని తేలింది. ఈ విషయంపై ఆసియా హాకీ సమాఖ్య (ఏఐహెచ్) స్పందిస్తూ.. ‘ఒక ప్లేయర్కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కొరియాతో జరుగాల్సిన మ్యాచ్ రద్దు చేస్తున్నాం’ అని ప్రకటించింది. ఈ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో మన అమ్మాయిలు 13-0తో మలేషియాను చిత్తుగా ఓడించారు. డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ అత్యధికంగా ఐదు గోల్స్ సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. 2020లో నిర్వహించాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడి ఇటీవల ప్రారంభమైంది. ఇప్పుడు అన్ని జాగ్రత్తలతో నిర్వహిస్తున్నా ఒకరికి పాజిటివ్ రావడంతో టోర్నీ కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.