ముంబై: జాతీయస్థాయి మహిళా రెజ్లర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చారిత్రక కోట పైనుంచి లోయలోకి దూకారు. మహిళా రెజ్లర్, ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. మరో కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. (Woman Wrestler Jumps From Fort) మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. క్రీడా రంగంలో ‘మహారాష్ట్ర ఆడపులి’గా ప్రసిద్ధి చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అయిన 30 ఏళ్ల అశ్విని మనోహర్ పాల్, గురువారం మధ్యాహ్నం తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆ జిల్లాలోని చారిత్రక నల్దుర్గ్ కోట వద్దకు చేరుకున్నారు. కుమారుడు, ఇద్దరు కవల కుమార్తెలతో కలిసి కోట పైనుంచి వంద అడుగుల లోతైన లోయలోకి ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, అశ్విని, ఐదున్నరేళ్ల వయస్సున్న కుమారుడు అజింక్య అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు కవల కుమార్తెల్లో ఒకరైన రెండేళ్ల వయస్సున్న క్రాంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తీవ్రంగా గాయపడిన మరో కవల కుమార్తె వీర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ధారాశివ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్పై ఆ చిన్నారి చికిత్స పొందుతున్నది. అయితే తన కుమార్తె అశ్వినిని ఆమె భర్త, అత్తమామలు నిరంతరం మానసికంగానూ, శారీరకంగానూ వేధించినట్లు ఆమె తండ్రి ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు అత్యుత్తమ జాతీయస్థాయి మహిళా రెజ్లర్గా అశ్విని ప్రసిద్ధి చెందారు. క్రీడా రంగంలో ‘మహారాష్ట్ర ఆడపులి’గా ఆమె పేరు పొందారు. 2007లో కేరళలోని తిరువనంతపురంలో జరిగిన జాతీయ రెజ్లింగ్ పోటీలో అగ్రస్థానంలో నిలిచారు. అనేక పతకాలు సాధించారు. 2008లో పంజాబ్లోని గురుదాస్పూర్, 2009లో తమిళనాడులోని చెన్నైలో జరిగిన జాతీయ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. భోపాల్, కాన్పూర్, హర్యానా, పూణే, కన్యాకుమారి, లక్నోలలో జరిగిన జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలలో అశ్విని రాణించారు. ఆమె తన కెరీర్ మొత్తంలో ఐదు స్వర్ణ, ఆరు రజత పతకాలు గెలుచుకున్నారు. అయితే అశ్విని తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడటం క్రీడా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.