Wimbledon | టాప్సీడ్ అల్కరాజ్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గత రెండు రౌండ్లలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ముందంజ వేసిన ఈ స్పెయిన్ వీరుడు.. మూడో రౌండ్లో ప్రత్యర్థి నికోలస్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా కీలక సమయాల్లో పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరాడు. అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ వీరుడు నొవాక్ జొకోవిచ్తో పాటు మెద్వెదెవ్, సిట్సిపాస్ కూడా నాలుగో రౌండ్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ స్వియాటెక్ ఎదురులేకుండా సాగుతున్నది.
వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ జోరు కొనసాగిస్తున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ప్రపంచ నంబర్వన్ అల్కరాజ్ 6-3, 6-7 (6/8), 6-3, 7-5తో 25వ సీడ్ నికోలస్ జర్రీపై విజయం సాధించాడు. గత రెండు రౌండ్లలో పూర్తి ఆధిపత్యం కనబర్చిన అల్కరాజ్.. ఈ మ్యాచ్లో కాస్త తడబడ్డా తేరుకొని గెలుపు గీత దాటాడు. 12 ఏస్లు కొట్టిన అల్కరాజ్ 5 బ్రేక్ పాయింట్లు సాధిస్తే.. 15 ఏస్లు సంధించిన నికోలస్.. రెండు బ్రేక్ పాయింట్లు మాత్రమే సాధించి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్ను అలవోకగా చేజిక్కించుకున్న అల్కరాజ్కు రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. ఆ తర్వాత జరిగిన రెండు సెట్లలోనూ విజృంభించిన అల్కరాజ్ ప్రిక్వార్టర్స్లో అడుగు పెట్టాడు. మరో మ్యాచ్లో రెండో సీడ్ జొకోవిచ్ 6-3, 6-1, 7-6 (7/5)తో వావ్రింకపై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్లో 23 గ్రాండ్స్లామ్స్ ఖాతాలో వేసుకొని ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జొకో.. ఈసారి ఇయర్ గ్రాండ్స్లామ్ నెగ్గాలనే కృతనిశ్చయంతో కనిపిస్తున్నాడు. ఇతర మ్యాచ్ల్లో మూడో సీడ్ మెద్వెదెవ్ 4-6, 6-3, 6-4, 6-4తో ఫుకోవిక్పై, ఐదో సీడ్ సిట్సిపాస్ 6-4, 7-6 (7/5), 6-4తో జెరెపై, ఎనిమిదో సీడ్ సిన్నెర్ 3-6, 6-2, 6-3, 6-4తో హలీస్పై విజయాలు సాధించారు.
తిరుగులేని స్వియాటెక్
మహిళల విభాగంలో టాప్ సీడ్ స్వియాటెక్ ఎదురులేకుండా సాగుతున్నది. మూడో రౌండ్లో స్వియాటెక్ 6-2, 7-5తో మార్టిక్పై గెలుపొందింది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో స్వియాటెక్ వరుస సెట్లలో విజృంభించి ముందంజ వేసింది. మరో మ్యాచ్లో రెండో సీడ్ అరియానా సబలెంక 6-2, 6-3తో బ్లింకోవాపై, అలెగ్జాండ్రోవా 6-0, 6-4తో గాల్ఫిపై, క్విటోవా 6-3, 7-5తో కోస్టిక్పై హద్దద్ మైయా 6-2, 6-2తో క్రిస్టియాపై గెలుపొందారు.
బోపన్న జోడీ శుభారంభం
వింబుల్డన్ పురుషుల డబుల్స విభాగంలో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి బరిలోకి దిగిన భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రోహన్-మాథ్యూస్ జోడీ 6-2, 6-7 (5/7), 7-6 (10/8)తో డురాన్-థామస్ (అర్జెంటీనా) ద్వయంపై విజయం సాధించింది. ఆరో సీడ్గా బరిలోకి దిగిన రోహన్ జంట.. రెండు గంటలా 12 నిమిషాల పాటు సాగిన పోరులో రోహన్-మాథ్యూస్ జోడీ సత్తాచాటింది.